అన్నదాతకు నిరాశ | Annadata depression | Sakshi
Sakshi News home page

అన్నదాతకు నిరాశ

Published Thu, Mar 12 2015 4:41 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

అన్నదాతకు నిరాశ - Sakshi

అన్నదాతకు నిరాశ

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్ తగ్గింది. అటవీశాఖను కూడా కలిపి ప్రభుత్వం కేటాయించిన రూ. 8,432 కోట్ల నిధుల్లో రైతు రుణమాఫీకే రూ. 4,250 కోట్లు పోనున్నాయి.

  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు తగ్గిన నిధులు
  •  అటవీ శాఖతో కలిపి రూ. 8,432 కోట్ల బడ్జెట్
  •  రుణమాఫీకి రూ. 4,250 కోట్ల కేటాయింపు
  • సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్ తగ్గింది. అటవీశాఖను కూడా కలిపి ప్రభుత్వం కేటాయించిన రూ. 8,432 కోట్ల నిధుల్లో రైతు రుణమాఫీకే రూ. 4,250 కోట్లు పోనున్నాయి. మొత్తం బడ్జెట్‌లో ప్రణాళిక పద్దు రూ. 2,572.72 కోట్లుగా ఉంది. గత పద్దుకన్నా ఇది ఏకంగా రూ. 478.60 కోట్లు తక్కువ. ప్రత్యేకంగా వ్యవసాయ శాఖకు గత బడ్జెట్లో రూ. 1828.87 కోట్లను ప్రణాళిక పద్దుకింద కేటాయించగా.. తాజా బడ్జెట్లో రూ. 1035.55 కోట్లను మాత్రమే ఇచ్చింది.

    అంటే ఈసారి రూ. 793.32 కోట్ల మేర కోత పడింది. కేంద్ర నిధులు తగ్గడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కోత విధించడంతో వ్యవసాయానికి మొత్తంగా పెద్ద ఎత్తున కేటాయింపులు తగ్గాయి. అయితే ఉద్యానశాఖకు రూ. 559.02 కోట్లు దక్కాయి. ఇది గతంలోకంటే అధికం. గ్రీన్‌హౌస్‌కు రూ. 250 కోట్లు కేటాయించారు. ఆ శాఖ మాత్రం రూ. 500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. పశుసంవర్థక శాఖకు గతం కంటే నిధులు తగ్గాయి. కేజ్‌కల్చర్ ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసుకున్న ప్రభుత్వం మత్స్యశాఖకు మాత్రం తక్కువ నిధులే కేటాయించింది. దీనికి గత బడ్జెట్లో రూ. 64.96 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 50.57 కోట్లు మాత్రమే దక్కాయి.

    ఇక మార్కెటింగ్ శాఖకు రూ. 402.82 కోట్లను కేటాయించింది. కాగా, వ్యవసాయం దాని అనుబంధ రంగాలతో సంబంధం లేని అటవీ శాఖను కూడా ఇదే పద్దులో చూపించడంపై విమర్శలున్నాయి. ఆ శాఖకు గతంలో కంటే రూ. 100 కోట్లకుపైగా కోతపెట్టి రూ. 281 కోట్లను కేటాయించింది. కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 20 కోట్లు ఇవ్వడం గమనార్హం. పాడి రైతులకు ప్రోత్సాహకం కోసం రూ. 16.30 కోట్లు కేటాయించింది. రైతులకు గిట్టుబాటు ధర అందని స్థితిలో సాయం చేసేందుకు ఉద్దేశించిన మార్కెట్ స్థిరీకరణ నిధిని రూ.400 కోట్ల నుంచి రూ.100 కోట్లకే పరిమితం చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గతేడాది రాష్ట్రానికి రూ.765.55 కోట్లు రాగా, ఈసారి రూ.456.95 కోట్లకు తగ్గడం బడ్జెట్‌లో కోతలకు దారితీసింది.
     
     కీలక కేటాయింపుల వివరాలు

     సూక్ష్మ సేద్యానికి రూ. 200 కోట్లు
     జాతీయ ఉద్యాన మిషన్‌కు రూ. 109.78 కోట్లు
     చుక్క నీటితో ఎక్కువ పంట కోసం రూ. 108 కోట్లు
     సన్న చిన్నకారు రైతుల పంటల బీమాకి రూ. 139 కోట్లు
     వడ్డీలేని రుణాలు, పంటల బీమాకు రూ. 200 కోట్లు
     మార్కెట్ స్థిరీకరణ నిధి కోసం రూ. 100 కోట్లు
     వ్యవసాయ శాఖ భవన నిర్మాణాలకు రూ. 5.19 కోట్లు
     పావలా వడ్డీ రుణాలకు రూ. 18.05 కోట్లు
     వ్యవసాయ విస్తరణ కోసం రూ. 28.83 కోట్లు
     వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 100 కోట్లు
     ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ. 6.88 కోట్లు
     రైతులకు విత్తన సరఫరాకు రూ. 64.51 కోట్లు
     సీడ్ చైన్ బలోపేతానికి రూ. 50 కోట్లు
     పంట కాలనీలు, భూగర్భ జలాల విశ్లేషణకు రూ. 20 కోట్లు
     జాతీయ ఆహార భద్రత పథకానికి రూ. 123.30 కోట్లు
     ఆర్కేవీవై కోసం రూ. 196.26 కోట్లు
     ఉద్యాన శాఖ కార్యక్రమాలకు రూ. 2 కోట్లు
     మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ కోసం రూ. 2.18 కోట్లు
     ఫిష్‌సీడ్ ఫామ్స్ కోసం రూ. 11 కోట్లు
     వైద్యనాథన్ కమిటీ మార్గదర్శకాల అమలుకు రూ. 49.77 కోట్లు
     ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రూ. 4.08 కోట్లు
     
     ఆత్మహత్యల ప్రస్తావనేది
     కరువు, రైతు ఆత్మహత్యలపై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడం దారుణం. ఇప్పటికే 760 మంది చనిపోతే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రం లో కరువు విలయతాండవం చేస్తున్నా పట్టించుకోలేదు.
     - సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement