- ఏప్రిల్ 2 నుంచి రెండు రాప్ట్రాలకు సహకార బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంకు (ఆప్కాబ్) విభజనకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండోతేదీ నుంచి రెండు రాష్ట్రాల సహకార బ్యాంకులు పనిచేయటం ప్రారంభిస్తాయి. బ్యాంకు పాలకవర్గం సమావేశం గురువారం చైర్మన్ కె. వీరారెడ్డి అధ్యక్షతన అబిడ్స్లోని ఆప్కాబ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది.
ఇందులో బ్యాంకు విభజన చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం అబిడ్స్ నుంచి పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం నారాయణగూడలోని బ్యాంకు అతిథిగృహం, భవనాల సముదాయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్లో ఆప్కాబ్కు స్థిరాస్థులు ఉన్న నేపథ్యంలో ఏపీలో ఏర్పాటయ్యే బ్యాంకు నూతన భవనం ఏర్పాటు చేసుకోవటంతోపాటు సౌకర్యాల కల్పనకు రూ. 50 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఆప్కాబ్లో రూ. 1,650 కోట్ల మూల ధనం ఉంది. దాన్ని జనాభా ప్రాతిపాదికన ఆప్కాబ్కు రూ. 965 కోట్లు, తెలంగాణ రాష్ర్ట సహకార బ్యాంకుకు రూ. 685 కోట్లు కేటాయించనున్నారు. బ్యాంకుకు రూ. 75.42 కోట్ల ఆస్తులుండగా, తెలంగాణ బ్యాంకుకు రూ. 25.78 కోట్లు, ఆంధ్రాకు రూ. 49.63 కోట్ల ఆస్తులను కేటాయించారు.
రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా చైర్మన్లు
విడిపోయిన తర్వాత ఈ బ్యాంకులకు చైర్మన్లు ఎవరవుతారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం ఆప్కాబ్ చైర్మన్గా ఉన్న కె. వీరారెడ్డి సహకార బ్యాంకు చైర్మన్గా కొనసాగే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుకు సంబంధించి ప్రస్తుతం ఆప్కాబ్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రత్నం ఇన్ ఛార్జి చైర్మన్ హోదాలో లేదంటే సీఎం రాజకీయంగా నిర్ణయం తీసుకున్న పక్షంలో చైర్మన్గా ఎంపికయ్యే అవకాశం ఉంది.