
సాక్షి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో నైతిక విజయం బీజేపీదే అని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. పార్టీ గుర్తును గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ చేయటంలో వెనుకబడ్డామని చెప్పారు. దేశభద్రత బీజేపీతోనే సాధ్యమనే విశ్వాసంతో ప్రజలు మరోసారి పట్టం కట్టారన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని డీకే ఆరుణ అన్నారు. నిజాంబాద్, కరీంనగర్లో ఓటమికి సీఎం కేసీఆర్ నైతికబాధ్యత వహించాలన్నారు. భవిష్యత్లో చాలా కాలం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. కులమతాలకు అతీతంగా కలిసిరండీ అభివృద్ది చేసుకుందామని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ బెదిరింపులు మానుకోకుంటే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మన్నె శ్రీనివాసరెడ్డి 4,11,241 ఓట్లతో గెలుపొందగా, బీజేపీ తరపున పోటీ చేసిన డీకే అరుణకు 3,33,121 ఓట్లు పోలయ్యి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.