- అలజడి సృష్టిస్తున్న జెడ్పీటీసీ సభ్యుల క్యాంపు
- చర్చనీయూంశంగా మారిన డీసీసీ నోటీసులు
- ముగ్గురు సభ్యుల స్పందనపై ఆసక్తి
- అది కాంగ్రెస్ క్యాంప్ కాదంటున్న సదరు సభ్యులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు గానీ... కాంగ్రెస్ క్యాంపులో లొల్లి మొదలైంది. గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు వారం క్రితం కాంగ్రెస్ క్యాంపు నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడగా... ‘హస్తం’ నేతలు హైరానా పడ్డారు. పోలీసుల దాకా వెళ్లిన ఈ వ్యవహారం చివరకు కర్ణాటక కాంగ్రెస్ నేతల సహకారంతో సద్దుమణిగింది. ఇటీవల ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులకు డీసీసీ నోటీసులు జారీ చేయడంతో మళ్లీ వేడి రాజుకుంది. జెడ్పీ పీఠాన్ని అధిరోహించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పట్టుదలతో వ్యూహాలు రచిస్తున్నాయి.
ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలు గెలిచిన పార్టీగా జెడ్పీ చైర్పర్సన్ పదవిని చేజిక్కించునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సాధారణ ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్.... జెడ్పీ పీఠాన్ని దక్కించుకుని పట్టు సాధించాలని చూస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు దీటుగా క్యాంపు నిర్వహిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు సైతం కాంగ్రెస్ క్యాంపులోనే ఉన్నా... సొంత పార్టీకి చెందిన ముగ్గురు మొదటి నుంచీ క్యాంపునకు దూరంగా ఉండడం హస్తం నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.
పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్ క్యాంపులో చేరలేదు. వీరు ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో వీరు ఎటువైపు ఓటు వేస్తారో తెలియక జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు గాబరా పడుతున్నారు. ఈ ముగ్గురు సభ్యుల వైఖరిలో స్పష్టత వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి గురువారం తీసుకున్న నిర్ణయం హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ తరఫున జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన మీరు పార్టీ నిర్ణయం ప్రకారం వెంటనే మిగిలిన సభ్యులతో చేరాలని... లేకుంటే తదుపరి తీసుకునే చర్యలకు కట్టుబడాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు శనివారం లోపు సమాధానం చెప్పాలని సూచించారు. ప్రస్తుతం ప్రత్యేక క్యాంపులో ఉన్న ముగ్గురు సభ్యులకు ఈ నోటీసులు చేరాయూ అనేది సందేహంగా మారింది.
ఈ ముగ్గురు జెడ్పీటీసీ సభ్యుల ఇంటి చిరునామాలకు నోటీసు లేఖలు అందినా... వారు సమాధానం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. శనివారం రాత్రి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కాంగ్రెస్లోని విశ్వసనీయవర్గాల సమాచారం. అరుుతే నోటీసుల విషయంలో ఆ పార్టీలో విభిన్న వాదనలు వినిపిస్తున్నారుు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సభ్యుల్లో ముగ్గురే వేరుగా ఉండడం సరికాదని... నోటీసులు ఇవ్వడం సమంజసమేనని నాయిని రాజేందర్రెడ్డి వర్గీయులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా... ప్రస్తుతం నిర్వహిస్తున్న క్యాంపు అసలు కాంగ్రెస్ పార్టీదే కాదని ముగ్గురు జెడ్పీటీసీ సభ్యుల వాదనగా తెలుస్తోంది. కాంగ్రెస్కు రాజీనామా చేసి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాయకుల నేతృత్వంతో నిర్వహిస్తున్న జెడ్పీటీసీ సభ్యుల క్యాంపునకు తాము రాలేదనే వాదనకు అసలు అర్థమే ఉండదనే అభిప్రాయంలో వారు ఉన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నేత ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలవలేదని... అలాంటప్పుడు క్యాంపు నిర్వహణతో కాంగ్రెస్కు సంబంధం ఉంటుందని తాము అనుకోవడం లేదని ఈ ముగ్గురు సభ్యులు చెబుతున్న ట్లు తెలిసింది.
నోటీసు లేఖలు అందితే... అం దులో ఉన్న అంశాలను బట్టి స్పందించాలా... వద్దా... అనేది తర్వాత నిర్ణయం తీసుకుంటామనే యోచనలో వారు ఉన్నట్లు సమాచారం. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుం దో తెలియని పరిస్థితుల్లో క్యాంపు నిర్వహించ డం... దానికి రాలేదని నోటీసులు ఇవ్వడం సరికాదని ఈ ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు వా దిస్తున్నట్లు వినికిడి. కాగా, జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
ఇందులో కాంగ్రె స్ 24, టీఆర్ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. కాం గ్రెస్ క్యాంపులో 25 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ క్యాంపులో 25మంది ఉన్నారని గు లాబీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జె డ్పీ చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.