
భారీ వర్షంతో భాగ్యనగరం తడిచిముద్దయింది.
సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షంతో భాగ్యనగరం తడిచిముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలు దేరిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గచ్చిబౌలి, రాజేంద్రనగర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్లలో ఈదురు గాలుతో కూడిన వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు భారీగా వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఒక మోస్తరుపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు.