
రాజన్న ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలు
సాక్షి, వేములవాడ : కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న వేములవాడ రాజన్న గుడి వద్ద అపరిశుభ్రం రాజ్యమేలుతోంది. ఏటా లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న ఈ క్షేత్రంలో పారిశుధ్యం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, భక్తులు పడేసిన విస్తర్లు, చెత్త, ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. రద్దీ సమయంలో ఇంకా చెత్త పెరిగిపోయి పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోందని భక్తులు మొత్తుకుంటున్నారు.
చెత్త కుప్పలు.. మలినాలు
రాజన్న ఆలయ ఆవరణతోపాటు క్యూలైన్ల వెంట చెత్తకుప్పలు, మలినాలు దర్శనమిస్తున్నాయి. ఇక క్యూలైన్లలోని మరుగుదొడ్ల వద్ద ముక్కులు మూసుకునే దుస్థితి నెలకొంది. ప్రధానాలయం ముందు భాగంలో చెత్త కుప్పలు అలాగే పడి ఉంటున్నాయి. రాజగోపురం వద్ద ప్లాస్టిక్ కవర్లు, చెత్త దర్శనమిస్తోంది. ధర్మగుండం వద్ద పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోంది.
కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా..
ఏటా పారిశుధ్యం నిర్వహణకు ఆలయం నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తులకు మాత్రం స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ఆలయ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment