
మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కే..
- తెలంగాణలో కొత్త ప్రభుత్వం మాదే
- టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య
ఖిలాషాపురం(రఘునాథపల్లి), న్యూస్లైన్ : తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవ సం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన ఖిలాషాపురంలో బుధవారం పొన్నాలతోపాటు ఆయన సతీమణి అరుణాదేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం పొన్నాల లక్ష్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎంత ప్రచారాల జోరు పెంచినా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని, విశ్వసించదగిన పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని, ఆ విషయూన్ని గత ఎన్నికలు నిరూపించాయన్నారు. తెలంగాణ కోసమే ఆవిర్భవించిన పార్టీ అని చెప్పుకునే వారికి 2004 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 50 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే 26 సీట్లు వచ్చాయన్నారు.
2009లో కాంగ్రెస్ను ఎలాగైనా గద్దె దింపాలని టీడీపీతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన టీఆర్ఎస్.. 52 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు 53 స్థానాలు సాధించిందన్నారు.
నా ఓటు నాకు వేసుకోలే...
ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో నా ఓటు నాకు వేసుకున్నది లేదని పొన్నాల లక్ష్మయ్య అన్నా రు. జనగామ, హైదరాబాద్లో ఓటు వేసుకోవచ్చు.. కానీ ఇక్కడే పుట్టి పెరిగాను.. ఇదే పాఠశాలలో చదివాను.. అందుకే సొంత గ్రామంలో నే ఓటు వేస్తున్నా అని అన్నారు. ఈ ప్రాంతా న్ని అభివృద్ధి చేస్తున్నానని, జనగామ ప్రజలకు రుణపడి ఉన్నానని, వారే నా దేవుళ్లని అన్నా రు. తనకు ఎలాంటి పదవులు వచ్చినా జనగా మ ప్రజలకే అంకితమని ఆయన పేర్కొన్నారు.
బడిగంట కొట్టి బజారుకొచ్చి నినాదాలు చేశా..
1955లో 4వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో బడిగంట కొట్టి బజారుకొచ్చి విశాలాంధ్ర వద్దు.. తెలంగాణ ముద్దు అని నినాదాలతో ఊరంతా తిరుగుతూ నినాదాలు చేశానని, అవి ఇప్పటికీ చెవిలో మార్మోగుతున్నాయని పొన్నాల గుర్తు చేశారు. ఆ ఉద్యమం ఏ ఒక్కరితో రాలేదని, 60 ఏళ్లుగా ప్రజల్లో ఉందన్నారు. దేశంలో 26 చోట్ల ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.
అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చిరకాల కోర్కె నెరవేర్చినందుకు తెలంగాణలో కాంగ్రెస్ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పొన్నాల రామకృష్ణ, రాజనాల శ్రీహరి, బట్టి శ్రీనివాస్, సర్పంచ్ దొంగ అంజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కడారి నాగేశ్వర్, నాయకులు గాదె రమేష్, పెరమాండ్ల రాంబాబు, పొన్నాల రామ్మోహన్, రాణిసంయుక్త, మంగు మనోహర్, హర్యానాయక్, బక్క ఉపేందర్, కట్ల సదానందం, ముప్పిడి శ్రీనివాస్, అన్వర్, సరాబు వీరన్న, నాసగోని మల్లయ్య, బండిమీది కుమార్, జిట్టె వీరస్వామి, చీమల ఈశ్వరయ్య, సరాబు వీరన్న, దన ప్రకాష్, మసి చంద్రమౌళి, రాజ్కుమార్ ఉన్నారు.