మెట్రో, ఓలా.. ఒప్పందం | Metro, Ola agreement | Sakshi
Sakshi News home page

మెట్రో, ఓలా.. ఒప్పందం

Dec 14 2017 2:51 AM | Updated on Oct 16 2018 5:04 PM

Metro, Ola agreement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరవాసులకు మెట్రో జర్నీతోపాటు చివరి గమ్యం చేర్చేందుకు ప్రముఖ క్యాబ్‌ సంస్థ ఓలా ముందుకొచ్చింది. ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్, ఓలా సంస్థల మధ్య బుధవారం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీంతో మెట్రో ప్రయాణికులు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారిక యాప్‌ ‘టీ–సవారీ’ ద్వారా ఓలా క్యాబ్‌లు, ఆటో లు బుక్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ వాలెట్, ఓలా మనీ సేవలనూ వినియోగించుకోవచ్చు. ఇక మియాపూర్, అమీర్‌పేట్, నాగోల్, కేపీహెచ్‌బీ కాలనీ మెట్రో స్టేషన్ల వద్ద ఓలా ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్న ట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర స్టేషన్లలోనూ త్వర లో ఈ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రో స్టేషన్ల సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఓలా జోన్లు ఏర్పాటు చేయనుండటంతో క్యాబ్‌ల కోసం మెట్రో ప్రయాణికులు నిరీక్షించే అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో మెట్రో స్మార్ట్‌కార్డులను నేరుగా ఓలా మనీ యాప్‌ ద్వారా రీచార్జ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

ఇక యాప్‌ సౌకర్యం లేని మెట్రో ప్రయాణికులు స్టేషన్ల వద్దనున్న ఓలా కియోస్క్‌లను సంప్రదించి అక్కడ ఉండే ప్రతినిధుల సహకారంతో క్యాబ్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక ఓలా జోన్స్‌ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సమస్యకూ పరిష్కారం చూపుతాయన్నారు. ప్రయాణికుల జర్నీ సమయం కూడా గణనీయంగా తగ్గుందన్నారు. మెట్రో తో నగర రవాణా రంగ చరిత్రలో కొత్త శకం ప్రారంభమైందని ఓలా డైరెక్టర్‌ సౌరభ్‌ మిశ్రా తెలిపారు. ఓలా సేవలను ఆన్‌లైన్, ఆన్‌గ్రౌండ్‌ విధానంలో మెట్రో స్టేషన్ల సమీపంలో అందించడం ఆనందంగా ఉందన్నారు.

ఓలా స్మార్ట్‌ మొబిలిటీ సేవలను రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, మెట్రో స్టేషన్లతో అనుసంధానిస్తున్నామని తెలిపారు. సులభమైన, సౌకర్యవంతమైన, క్లిష్టతలేని ప్రయాణాన్ని మెట్రో ప్రయాణికులకు అందించేందుకే ఈ భాగస్వామ్యం చేసుకున్నామన్నా రు. నాగోల్‌–మియాపూర్‌(30 కి.మీ.) మెట్రో మార్గం 2.4 లక్షల ప్రయాణికుల మార్కును అధిగమించడం ద్వారా విజయవంతమైనట్లు ఎల్‌అండ్‌టీ హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ సైనీ తెలిపారు. ఓలాతో ఒప్పందం ద్వారా ప్రయాణికులకు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ తేలికవుతుందన్నారు. ఓలా భద్రతా ఫీచర్లు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మొబిలిటీ అనుభవాలను అందిస్తుందన్నారు. ఓలా సంస్థ ఇటీవలే గుర్‌గావ్, బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు మెట్రోస్టేషన్లలో ఓలా కియోస్క్‌లు ఏర్పాటు చేసిందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement