
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవల తీర్పునిచ్చి, అనంతరం తన పోస్టు కు రాజీనామా చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కె.రవీందర్రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. రాజీనా మా విషయంలో పునరాలోచనలో పడ్డ ఆయన, సన్నిహితులతో చర్చించి.. తాను ఇచ్చిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. రాజీనామా లేఖ స్థానంలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం తాజాగా హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు నిబంధనల మేర లేకపోవడంతో హైకోర్టు దానిని వెనక్కి ఇచ్చేసింది. నిర్దిష్ట ఫార్మాట్ ప్రకారం దర ఖాస్తు చేసుకోవాలని రవీందర్రెడ్డికి స్పష్టం చేసింది.
వీఆర్ఎస్ నిర్ణయం దృష్ట్యా ఆయన గురువారం విధులకు హాజరయ్యారు. మక్కా మసీదు కేసులో ఉదయం తీర్పు వెలువరించిన రవీందర్రెడ్డి, సాయంత్రం కల్లా రాజీనామా చేయడం సంచలనం సృష్టించిం ది. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ బహిర్గతం కాలేదు. అవినీతి ఆరోపణల వల్లే రాజీనామా చేశారని జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. 2 రోజుల పాటు తర్జనభర్జన అనంతరం, రాజీనామా చేస్తే, ఇన్నేళ్ల సర్వీసు వృథా అవుతుందని, రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలేవీ దక్కవని సన్నిహితులు చెప్పడం తో ఆయన పునరాలోచనలో పడ్డారు.
అనంతరం రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని, దాని స్థానంలో వీఆర్ఎస్కు అనుమతించాలని హైకోర్టును కోరారు. నిబంధనల ప్రకారం వీఆర్ఎస్కు 3 నెలల నోటీసు తప్పనిసరి. దీంతో ఆయన స్వయంగా హైకోర్టుకు వెళ్లి వీఆర్ఎస్ దర ఖాస్తును సమర్పించారు. పదవీవిరమణ (58 ఏళ్లు)కు సమీపంలో ఉన్న తనకు మరో రెండేళ్ల పొడిగింపు వచ్చే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే రవీందర్రెడ్డి వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని నాంపల్లి కోర్టు వర్గాలు చెబుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్లకు పొడిగింపునిచ్చే విషయంలో హైకోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పొడిగింపును ఇవ్వదలచిన న్యాయాధికారి పనితీరు, నీతి నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment