
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, ఇతర కౌమార వయస్కుల ఆత్మహత్యలపై సమాజం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త, హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యాపకుడు విక్రమ్ పటేల్ పేర్కొన్నారు. యుక్తవయసులో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య భారత్లోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిం చే అంశమన్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యు లర్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2012 నాటి లెక్కల ప్రకారం దేశం మొత్తమ్మీద 60 వేల మంది యువజనులు ఆత్మహత్యల కారణంగా మరణించారు. వాస్తవ పరిస్థితులు ఇంతకంటే అధ్వాన్నంగా ఉన్నాయని విక్రమ్ పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక ఆత్మహత్య లు (యువత) పుదుచ్చేరిలో నమోదవుతుండగా.. ఏపీ, తెలంగాణలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయ న్నారు. యువత మానసిక ఆరోగ్యం పరిరక్షణకు తల్లిదండ్రులతోపాటు సమాజం తమవంతు పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా పాల్గొన్నారు.