![Peddagattu Jatara Started In Suryapet District - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/25/peddagattu-jatara.jpg.webp?itok=QKCBjHgP)
కేసారం గ్రామంలో దేవర పెట్టెను కదిలించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, చిత్రంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
సూర్యాపేట: లింగా ఓ లింగా నామస్మరణతో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని శ్రీ లింగమంతులస్వామి ఆలయం మార్మోగింది. రెండేళ్లకోసారి జరిగే శ్రీ లింగమంతులస్వామి (గొల్లగట్టు) జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో వేడుకలు మొదలయ్యాయి. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో దేవరపెట్టెకు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యాదవులు ఈ పెట్టెను కాలినడక పెద్దగట్టుకు చేర్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీ చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ గట్టుపైకి చేరుకున్నారు. మొదటి రోజు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం భక్తులు లక్షల్లో తరలిరానున్నారు. చౌడమ్మతల్లికి బోనాలు సమర్పించనున్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ అమయ్కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment