తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికను మార్చి 16వ తేదీ నుంచి 22కు వాయిదా వేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికను మార్చి 16వ తేదీ నుంచి 22కు వాయిదా వేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న న్యాయవాది డి.వి.రావు దాఖలు చేశారు. ఇంటర్ పరీక్షలను కారణంగా చూపుతూ ఎమ్మెల్సీ ఎన్నికను వాయిదా వేశారని, వాస్తవానికి ఎన్నికను 22న కాకుండా 15న నిర్వహించాలని, ఆ రోజు ఆదివారమని డి.వి.రావు తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఎన్నిక వాయిదా వల్ల అభ్యర్థుల ఎన్నిక ఖర్చు పెరగడమే కాకుండా, అవినీతి కూడా పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ నిర్వహించిన సర్వేలో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు తేలిందని తెలిపారు. అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికను మార్చి 15న నిర్వహించేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.