
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే శాఖలను కేటాయించారు. గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్రావుకు.. ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తిరిగి ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు. కీలకమైన విద్యాశాఖను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దక్కించుకున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు నెరవేరుస్తున్న జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్శాఖను కేటాయించారు.
ఆదివారం సాయంత్రం హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్లు మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. నూతన గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన.. కొద్ది సమయంలోనే వారందరికీ శాఖలను కేటాయించారు. అయితే ఇవాళ రాత్రి 7 గంటలకు మంత్రివర్గ సమావేశం కానున్నట్లు సమాచారం. బడ్జెట్పై చర్చించిన అనంతరం కేబినెట్ దానిని ఆమోదించనుంది.
మంత్రుల శాఖలు ఇవే..
కేటీఆర్: ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ
హరీష్ రావు: ఆర్థిక శాఖ
సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ
గంగుల కమలాకర్: బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ
సత్యవతి రాథోడ్: గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ
పువ్వాడ అజయ్ కుమార్: రవాణ శాఖ
చదవండి: వైభవంగా మంత్రుల ప్రమాణ స్వీకారం