చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : ఓ వస్త్ర దుకాణంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. లక్ష రూపాయల విలువైన చీరలతోపాటు రూ.3.70 లక్షల నగదును ఎత్తుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీఎం కాలనీకి చెందిన యూనుస్ అహ్మద్ బండ్లగూడ హషమాబాద్ ప్రాంతంలో జిక్రా కలెక్షన్స్ పేరుతో ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం షట్టర్ పైకి లేపి ఉండడాన్ని పాల వ్యాపారి గమనించి అతనికి సమాచారం అందించాడు. వెంటనే బాధితుడు అక్కడికి చేరుకొని చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.