
ఇంటికి చేరిన సాయికిరణ్ మృతదేహం
హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో నల్ల జాతీయుల కాల్పుల్లో మృతి చెందిన సాయికిరణ్ మృతదేహం ఆదివారం కుషాయిగూడలోని అతడి స్వగృహానికి చేరుకుంది. సాయికిరణ్ భౌతికకాయానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనచారి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్తోపాటు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నివాళులర్పించారు.
హైదరాబాద్లోని కుషాయిగూడకు చెందిన సాయికిరణ్ (21) ఉన్నత విద్య కోసం 45 రోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. అయితే ఫ్లోరిడాలోని మియామిలో స్నేహితులతో కలసి వెళ్తున్న సాయికిరణ్ని.... నల్లజాతీయులు ఆపి.. అతడి వద్దనున్న ఐఫోన్ అడిగారు. ఐఫోన్ వారికి ఇచ్చేందుకు సాయికిరణ్ ససేమీరా అన్నారు. దాంతో ఆగ్రహించిన నల్లజాతీయులు అతడిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సాయికిరణ్ అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటన జూలై 14న చోటు చేసుకుంది.