
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో తలసాని సాయికిరణ్ యాదవ్ గెలుపుతో గులాబీ జెండా ఎగరడం ఖాయమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. సీఎం చంద్రశేఖర్రావు నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూ చిగా మారాయన్నారు.
శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సాయి కిరణ్ గెలుపుతో దేశ చరిత్రలో అతిపిన్న వయస్కుడు ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్కు కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ యూఐ సీనియర్ నేత వల్లభ్కుమార్కు మం త్రులు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
25న సాయి కిరణ్ నామినేషన్
ఈ నెల 25న ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ వద్ద గల అమరవీరుల స్తూపం నుంచి సాయికిరణ్ యాదవ్ నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీతో వెళ్లి అబిడ్స్లోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.