సాక్షి, హైదరాబాద్: వైశ్యులను కించపరిచాడనే పేరిట ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై జరుగుతున్న దాడిని మావోయిస్టు పార్టీ ఖండిస్తోందని రాష్ట్ర కమిటీ అధికారి ప్రతినిధి జగన్ మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్చను ఎవరూ అడ్డుకునే హక్కు లేదని, దేశంలో సంఘ్పరివార్ నేతృత్వంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. కులం గురించి మట్లాడటాన్ని నేరంగా చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్టం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని ప్రతినిధి జగన్ ఆరోపించారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి ఐలయ్య పుస్తకాలపై నిషేదం తీసుకురావడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని పార్టీ అభిప్రాయపడుతోందని వెల్లడించారు. చంద్రబాబు వ్యవహారం అభిప్రాయాలని, అక్షరాల్ని నిషేదించాలనుకునే నియంతృత్వం వైఖరి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు.
ఐలయ్య రాసిన అంశాలపై కౌంటర్ వాదన చేయవచ్చని, కానీ బెదిరించడం అప్రజాస్వామ్యమని, కంచె ఐలయ్యకు అన్నిరకాలుగా తమ పార్టీ మద్దతునిస్తోంది, ప్రజాస్వామ్య వాదులంతా ఐలయ్యకు అండగా నిలవాలని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణీయ, హిందూ మనోత్మాదానికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.