అంతా పాస్‌.. త్వరలోనే జీపీఏ | Tenth Class Students Will Be Given Grade Point Average Based On Internal Marks | Sakshi

అంతా పాస్‌.. త్వరలోనే జీపీఏ

Jun 11 2020 8:59 AM | Updated on Jun 11 2020 8:59 AM

Tenth Class Students Will Be Given Grade Point Average Based On Internal Marks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. ఇక వారికి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ) ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్‌ బుధవారం జీవో జారీచేశారు. కరోనా నేపథ్యంలో పదో పరీక్షలను రద్దుచేసి అందరినీ పాస్‌చేసిన ప్రభుత్వం ఇపుడు వారి ఇంటర్నల్‌ మార్కుల ప్రకారం ప్రతి సబ్జెక్టుకు గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్, మొత్తంగా గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ) ఇచ్చి, త్వరలోనే ఫలితాలను ప్రకటించ నుంది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ, ఓరియంటల్‌ ఎస్సెస్సీ, వొకేషనల్‌) విద్యార్థులంతా పాసైనట్టేనని, వారి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్స్‌ ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (పరీక్ష లేకుండానే పాస్)‌

జీపీఏ ఇచ్చేదిలా.. 
రాష్ట్రంలో మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించడం, అదే నెల 23 నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదా వేయడం తెలిసిందే. ఆ తరువాత జూన్‌ 8 నుంచి పరీక్షలు నిర్వహించేలా హైకోర్టు మే 19న అనుమతి ఇచి్చంది. అయితే జూన్‌ 6న కరోనా పరిస్థితిని సమీక్షించిన హైకోర్టు.. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవచ్చని పేర్కొంది. దీంతో ప్రభుత్వం అదే రోజు పరిస్థితిని సమీక్షించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదావేసింది.  సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈనెల 8న జరిగిన సమావేశంలో పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నల్‌ మార్కుల ఆధా రంగా విద్యార్థులందరికి గ్రేడింగ్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఇప్పటికే విద్యాశాఖ నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలను నిర్వహించిందని, వాటి ఆధా రంగా ఇంటర్నల్‌ మార్కులను పాఠశాలలు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాయని పేర్కొంది. ఆ మార్కులు ఇపుడు విద్యాశాఖ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా విద్యార్ధులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్, మొత్తంగా జీపీఏ ఇవ్వాలని వెల్లడించింది. విద్యాశాఖ వద్ద ఉన్న 20 శాతం ఇంటర్నల్‌ మార్కులను వంద శాతానికి లెక్కించాలని, విద్యార్థులకు ఆ 20శాతంలో వచి్చన మార్కుల ప్రకారం ఐదింతలు వాటికి కేటాయించాలని పేర్కొంది. వన్‌టైమ్‌ మెజర్‌ కింద ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా పాసైనట్టే.

ఆ విద్యార్థుల విషయంలో...
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 5,34,903 మందిలో 25 వేల మంది వరకు ప్రైవేటు విద్యార్థులున్నారు. వారికి గ్రేడింగ్‌ ఇచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి చెప్పా రు. వారు పరీక్ష రాసేందుకు సిద్ధమై ఫీజు చెల్లించినందున వారికీ గ్రేడింగ్‌ ఇవ్వక తప్పదన్నారు. అయితే వారు పాసైన ఇతర సబ్జెక్టులకు ఇప్పటికే గ్రేడ్స్, గ్రేడ్‌ పాయింట్స్‌ ఉన్నాయి. ఆయా విద్యార్థులు గతంలో ఫెయిౖ లెన సబ్జెక్టు కూడా ఇపుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాసైనట్లే లెక్క. ఇపుడు వారికి గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే మొత్తంగా జీపీఏ కేటాయించాల్సి వస్తుం ది. గతంలో పాసైన సబ్జెక్టును వదిలేసి, ఫెయిలైన సబ్జెక్టుల ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్‌ను కేటాయించాలా? అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్స్‌ ఇచ్చి జీపీఏ ఇవ్వాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. విద్యార్థి ఫెయిలైన సబ్జెక్టుకు సంబంధించిన ఇంటర్నర్‌ మార్కుల ప్రకారమే గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్‌ ఇచ్చి జీపీఏ నిర్ణయించే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Advertisement