
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ‘ప్రగతి నివేదన సభ’కు పోటెత్తనున్న వాహనాలకు టోల్ వసూళ్ల ప్రక్రియతో ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ గండం పొంచి ఉందని ‘టోల్’ఫికర్ శీర్షికతో బుధవారం ప్రచురిత కథనంపై కదలిక వచ్చింది. సెప్టెంబర్ 2న ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఓఆర్ఆర్పై టోల్ వసూలు చేయమని హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు.
అయితే ఆ రోజు టోల్ వసూలు చేయకపోవడం వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని టీఆర్ఎస్ చెల్లించాలని పేర్కొన్నారు. లక్షలాది వాహనాలు వస్తుండటంతో సెప్టెంబర్ 2న టోల్ వసూలు చేయవద్దని టీఆర్ఎస్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చేసిన దరఖాస్తును పరిశీలించిన కమిషనర్ షరతులతో కూడిన అనుమతులిచ్చారు.
కొంగర కలాన్, రావిర్యాల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లేందుకు ఓఆర్ఆర్పై మార్గాల మధ్య మరిన్ని ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని దరఖాస్తులో పేర్కొన్న అంశంపై సమాధానమిస్తూ తాత్కాలిక ఎగ్జిట్ ప్రాంతాలను ముందుగా హెచ్ఎండీఏ అధికారులు పరిశీలించి నియమిత సంఖ్యలోనే అనుమతించాలని ఆదేశించారు. ట్రాక్టర్లు, ట్రాలీలు, నెమ్మదిగా వెళ్లే ఇతర వాహనాలను ఓఆర్ఆర్పై అనుమతించబోమని, అవి సర్వీసు రోడ్డు మీదుగానే వెళ్లాలని నిబంధన విధించారు.
Comments
Please login to add a commentAdd a comment