
సాక్షి, హైదరాబాద్: తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని...కాంగ్రెస్లోనే కొనసాగుతానని కాంగ్రెస్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అజహరుద్దీన్ టీఆర్ఎస్లోకి వెళ్తున్నారన్న వార్తలను టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్ఖాన్ తీవ్రంగా ఖండించారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. అజహరుద్దీన్ పార్టీలోనే ఉంటారని తెలిపారు. టీఆర్ఎస్లో నాయకత్వ లోపం వల్లే కాంగ్రెస్ నేతలకు ఈ విధంగా వల వేస్తోందని మండిపడ్డారు. కేవలం తిమ్మినిబమ్మి చేయడం ద్వారా ఎన్నికల్లో గెలిచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు టీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నాయని టీపీసీసీ అధికారప్రతినిధి నిజామొద్దీన్ అన్నారు.