
80 ఏళ్ల వయసులో కంప్యూటర్ తో కుస్తీ
సిమ్లా: హిమచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నారు. 80 ఏళ్ల ఈ రాజకీయ కురువృద్ధుడు కంప్యూటర్ పాఠాలు వల్లె వేస్తున్నారు. ఆయనేదో డిగ్రీ సాధించేందుకు ఇలా చేయడం లేదు. తమ శాసనసభను దేశంలోనే ప్రప్రథమ ఇ-అసెంబ్లీ మార్చాలని ఆయన సంకల్పించారు. ఇందులో భాగంగా తాను కూడా కంప్యూటర్ నేర్చుకోవాలని భావించారు.
అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. కంప్యూటర్ పాఠాలు వల్లెవేస్తున్నారు. అంతేకాదు కంప్యూటర్ తెరపై డిజిటల్ పేజీలను పైకి, కిందకు కదిలిస్తూ ప్రశ్నలకు అసెంబ్లీలో ఎలా సమాధానమివ్వాలనే దాని గురించి కూడా ఆయన నేర్చుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తాము డిజిటల్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వీరభద్రసింగ్ అన్నారు. అసెంబ్లీ డిజిటలైజేషన్ కోసం హిమచల్ప్రదేశ్ ప్రభుత్వం రూ. రూ.8.12 కోట్లు వెచ్చించనుంది.