
అనూహ్యను చంపింది క్యాబ్ డ్రైవరేనా?
ముంబైలో హత్యకు గురైన మచిలీపట్నం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విషయమై డీజీపీ బి. ప్రసాదరావు ముంబై పోలీసులను సంప్రదించారు. అక్కడ జరిగిన విషయాలు, ఆ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనూహ్య రైలు దిగిన తర్వాత క్యాబ్లో తన హాస్టల్కు బయల్దేరి ఉంటుందని, బహుశా క్యాబ్ డ్రైవరే ఆమెను హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మచిలీపట్నానికి చెందిన ఈస్తర్ అనూహ్య (23) ముంబైలో టీసీఎస్లో సాప్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. క్రిస్మస్ సెలవులు కావటంతో సొంత ఊరికి వచ్చిన అనూహ్య.... ముంబై వెళ్లేందుకు ఈ నెల 4న విజయవాడలో విశాఖపట్నం-ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కింది. ఆ రోజు రాత్రి పది గంటలకు తండ్రికి ఫోన్ చేసిన అనూహ్య... ఆ తరువాత... హాస్టల్కు వెళ్లాక మాట్లాడుతానంటూ ఫోన్ కట్ చేసింది.
ఆ తరువాత అనూహ్య నుంచి ఫోన్ రాలేదు. దాంతో ఆమె తండ్రి ప్రసాద్.... అనూహ్యకు ఎన్నికాల్స్ చేసినా సమాధానం లేదు. అనంతరం ఆయన అంథేరీ హాస్టల్లోని అనూహ్య స్నేహితురాలికి ఫోన్ చేసినా అక్కడ నుంచి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ప్రసాద్ ఈ నెల 5వ తేదీన అనూహ్య కన్పించటం లేదంటూ విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి 11 రోజుల తరువాత... కంజుమార్గ్లోని కాలిన గాయాలతో కుళ్లిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమె చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా మృతదేహం అనూహ్యదిగా ఆమె తండ్రి గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.