
ఇరానీ శాఖ మార్పు వెనుక ఆయన హస్తం
న్యూఢిల్లీ: గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి జుబిన్ ఇరానీకి .. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు ఆలోచించకుండా మావవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ)ను అప్పగించారు. 2014 నుంచి ఇప్పటివరకు ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన ఆమె రెండేళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. రాజకీయంగా కీలకమైన ఈ శాఖ నుంచి స్మృతిని తప్పించి అంతగా ప్రాముఖ్యత లేని చేనేత, జౌళిశాఖకు మారుస్తూ కేబినేట్ తీసుకున్న నిర్ణయం వెనుక బీజేపీ ప్రముఖనేత హస్తం ఉందని ఓ వైపు వినవస్తుండగా, మరో వైపు ఇరానీ శాఖ మార్పునకు కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని గుసగుసలు వినవస్తున్నాయి.
ఇరానీ శాఖను మార్పునకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసిద్ధత వ్యక్తం చేయకపోయినా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం మేరకు ఆమెకు జౌళి శాఖను అప్పజెప్పినట్లు సమాచారం. తనను జౌళి శాఖకు పంపడంతో ఆమె కూడా అప్ సెట్ అయ్యారని ఉన్నతవర్గాల సమాచారం. ఇరానీ ప్రవర్తన వల్లే ఆమె హెచ్ఆర్డీ శాఖ నుంచి బయట పడ్డారని కొందరు అంటున్నారు.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల గొడవ, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య తదితరాలు ఆమెను విలన్ గా చిత్రీకరించాయని వారు అభిప్రాయపడుతున్నారు. స్మృతి ఇరానీ పద్ధతి సంఘ్ పరివార్ కు కూడా నచ్చకపోవడంతోనే ఆమెను వేరే శాఖకు మార్చడానికి ప్రధానకారణం అని మరో గొంతుక కూడా వినవస్తోంది. దీంతో రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన హెచ్ఆర్డీకు ఎలాంటి వివాదాలు లేని ప్రకాశ్ జవదేవకర్ కు అప్పగించారని అంటున్నారు.