
'ఎస్పీ రాజీనామా చేసి టీడీపీలో చేరాలి'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే కర్నూలు జిల్లా ఎస్పీ.. వైఎస్ఆర్ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్షలు పెంచుకునే బదులు ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని భూమా వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘం అనుమతి లేకుండా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించిందని, అలాంటపుడు ఈసీ అనుమతి లేకుండా తనను ఎలా అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని భూమా చెప్పారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో భూమాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు.