
యువశక్తి మన సొంతం: మోదీ
టోర్నటో: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడుపర్యటన కెనడాలో కొనసాగుతుంది. టొరెంటోలో రికో కోలీజియం ప్యాలెస్లో భారతీయులనుద్దేశించి ప్రధాని హిందీలో ప్రసంగించారు. సుమారు పదివేలమంది భారతీయులు హాజరైన ఈ సమావేశంలో మోదీ ప్రసంగంతో చప్పట్ల మోత మోగింది. కొత్త ఆకాంక్షలతో, ఆశలతో తాను కెనడా వచ్చానన్నారు. కెనడాతో భారత్ మంచి సంబంధాలను కలిగి ఉందని ఇకముందు కూడా ఈ సంప్రదాయం కొనసాగుతుందంటూ వారికి అభినందనలు తెలిపారు.
''2006లో అమెరికా, బ్రిటన్ నాకు వీసా ఇచ్చేందుకు నిరాకరిస్తే కెనడా మాత్రం నాకు వీసా ఇచ్చింది. 2003 నుంచి గుజరాత్ అభివృద్ధిలో కెనడా సహకరించింది. గతంలో కెనడాలో నేను పర్యటించినప్పుడు నేనెవరో తెలియదు. చాలాకాలంగా కెనడాతో భారత్కు సత్సంబంధాలున్నాయి. ఈ సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. కెనడా ప్రజలు భారత్ను గౌరవిస్తారు.''
ఈ సందర్భంగా మోదీ దేశాన్ని ఏలిన గత ప్రభుత్వాలపై విరుచుకపడ్డారు. స్కిల్ ఇండియాపైనే తమ దృఫ్టి తప్ప స్కామ్ ఇండియాపై కాదన్నారు. వారు మురికి చేసిపోతే తమ ప్రభుత్వం ఆ మురికిని శుభ్రం చేయడానికి పూనుకుందన్నారు. స్వచ్ఛభారత్ ద్వారా భారత్ను పరిశుభ్రంగా ఉంచాలని సంకల్పించామని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని యువసంపద భారతదేశంలో ఉందన్నారు. దేశాభివృద్ధిలో కీలకమైన 80 కోట్ల మంది యువత కలలు, 160 కోట్ల బలమైన చేతులు దేశానికి అండగా ఉన్నాయి. ఒక దేశ అభివృద్ధికి ఇంతకంటే ఏం కావాలన్నారు. దేశంలోని యువత ఉద్యోగార్థులుగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించేవారుగా తయారు కావాలని కోరుకుంటున్నానన్నారు. 2030 తర్వాత ప్రపంచానికి అవసరమైన కార్మికశక్తి మన వద్ద ఉంటుందన్నారు.