
జ్యుడీషియల్ కస్టడీలోనే సహారా చీఫ్ సుబ్రతారాయ్
ఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. రాయ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. 10 వేలకోట్ల రూపాయలు డిపాజిట్ చేయలేమని సహారా గ్రూప్ తెలియజేయడంతో ఆయన కస్టడీలోనే ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సుబ్రతారాయ్తోపాటు సహారా గ్రూప్ ఇరువురు డెరైక్టర్లకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే 10 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని సహారా గ్రూప్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు తాజా షరతులను కంపెనీ పాటిస్తేనే తాత్కాలిక బెయిల్ను మంజూరు చేయడం జరుగుతుందని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి 25 వేల కోట్ల రూపాయలు సమీకరణ - సంబంధిత డబ్బు తిరిగి చెల్లింపులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశం - ఈ ప్రక్రియలో సహారా వైఫల్యం - సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణ వ్యవహారంలో మార్చి 4వ తేదీ నుంచీ రాయ్, ఇరువురు డెరైక్టర్లు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు.