Deepavali Festival
-
దీపావళి షాపింగ్ చేద్దాం పదండి! (ఫొటోలు)
-
ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!
పండుగ టైంలో కూడా ఎప్పుడు కట్టుకునే విధంగానే డ్రెస్ లేదా చీరని కట్టుకుంటే కలర్ఫుల్నెస్ ఏముంటుంది..?. జోష్ ఏం వస్తుంది. ఏదైనా వెరైటీగా చేస్తేనే కదా..! పండగ మొత్తం మన నుంచే జరుగుతుందేమో..! అనేలా కనిపించాలి ఆహార్యం. అందుకు తగట్టు మన కట్టు, బొట్టు తీరు అదరహో అనే రేంజ్లో ఉండాలి. అందులోనూ ఇంకొద్ది రోజుల్లోనే దీపావళి వస్తోంది. మిరమిట్లుగొలిపే దీపాల కాంతిలో మనం ధరించే డ్రెస్ లేదా చీర అత్యంత శోభాయమానంగా కనిపించాలి. అందుకోసం ఈసారి చీరను ఇలా ఇన్ని రకాలుగా కట్టుకుని సందడి చేసేందుకు ప్రయత్నిద్దామా..!.సెలబ్రిటీలకు చీరలు కట్టే డాలీ జైన్ డ్రేపింగ్ టెక్నీక్లతో ఈసారి పండగకు చీర కట్టుకుని అసలైన సందడిని, జోష్ని తెద్దామా..!. డాలీ రాధికా మర్చంట్ నుంచి నీతా వరకు ఎంతో మంది ప్రముఖులకు స్టైలిష్గా చీరలు కట్టేస్తుంది. ఒక్క చీరతోనే లెహంగా స్టైల్, వెస్ట్రన్, గుజరాతీ స్టైల్లో చీరలు కట్టేస్తుంది. ఆమె చీర కట్టు తీరుకు సంబంధించిన ఓ ఐదు టెక్నీక్లు ఈసారి ట్రై చేసి చూద్దాం.మెర్మైడ్ తరహా చీరఈ శైలిలో కట్టే చీరను ముందుగా నడుమ చుట్టు చక్కగా దోపి ఒకవైపుకే చీరను కుచ్చిళ్లలా మడతపెట్టి కడతారు. ఇది ఫిష్టైల్ లెహెంగా రూపాన్ని సృష్టిస్తుంది. దీని పేరుకు తగ్గట్టు సాగర కన్య మాదిరిగా ఉంటుంది ఈ చీర కట్టు తీరు. ఈ స్టైల్ కోసం సన్నటి బార్డర్, ఫ్లీ ఫ్యాబిక్ ఉన్న చీరలకే బాగుంటుంది. ఈ చీర లుక్ కోసం సరైన బ్రాస్లెట్, చెవిపోగులు ధరిస్తే హైలెట్గా ఉంటుంది. లెహంగా చీరలెహంగాపై అందంగా చీరను చుట్టి ఓ కొత్త లుక్ని తీసుకొస్తారు. ఇందుకోసం విశాలమైన అంచుతో ఉన్న బనారసి లేదా కంజీవర చీర అయితే కరెక్ట్గా సరిపోతుంది. జస్ట్ స్కర్ట్పైనే చీరను అందంగా కడతారు. ఇండో-వెస్ట్రన్ శైలి..ఆధునికత ఉట్టిపడేలా చీర కట్టుకోవాలనుకుంటే..చీరను వదులుగా ఉండే కుర్తా లేదా కేప్తో జత చేయాలి. ఈ ఇండో వెస్ట్రన్ చీర ఆధునికతకు కేరాఫ్గా ఉంటుంది. పైగా ఈతరహా స్టైల్ సౌలభ్యంగా కూడా ఉంటుంది. జలపాతం శైలి చీరసంప్రదాయ శైలిలో చీరను ధరించి.. అతిథులందరి కంటే భిన్నంగా ఉండాలంటే ఈ శైలి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కొద్దిపాటి బార్డర్తో కూడిన చీర ఈ స్టైల్కి సరిపోతుంది. సిద్ధ పల్లు తరహా చీరఇది చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ శైలి సంప్రదాయబద్ధమైన లుక్ని తీసుకొస్తుంది. క్లాసిక్ గుజరాతీ శైలీ చీరలు ఈ తరహా కట్టుకి సరిపోతాయి. దీనికి మంచి బెల్ట్ ధరిస్తే చీర లుక్ని బాగా హైలెట్ చేస్తుంది. (చదవండి: ఊహకే అందని రైడ్..ఐతే అక్కడ మాత్రమే..!) -
తిరుమలలో వైభవంగా దీపావళి ఆస్థానం
-
విశాఖపట్నంలో ఘనంగా దీపావళి సంబరాలు
-
తిరుపతి, విజయవాడలో దీపావళి సంబరాలు
-
ప్రజలకు సీఎం వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
-
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఇప్పటికే పలువురు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు వడ్డీని పొందారు. ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న నిల్వలపై 8.15 శాతం వడ్డీ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈపీఎఓ ఖాతాలో వడ్డీ జమైందో లేదో అని తెలుసుకునేందుకు ఖాతాదారులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా వారి పాస్బుక్ను ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలంటే? ♦ https://www.epfindia.gov.in/ site_en/For_Employees.php ఈపీఎఫ్ఓ పోర్టల్లో లాగిన్ అవ్వండి ♦ హోమ్పేజీలో 'సర్వీస్' పై క్లిక్ చేసి, 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ని ఎంచుకోండి ♦ ఆపై 'మెంబర్ పాస్బుక్' లింక్పై క్లిక్ చేయండి. మీకు అక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ♦ మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి అకౌంట్లో లాగిన్ అవ్వండి. ♦ అనంతరం మీరు మీ ఖాతా వివరాలను ఎంటర్ చేసి ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఉమాంగ్ యాప్లో ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలంటే ♦ ఉమాంగ్ యాప్ను ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఓటీపీ లేదా ఎంపీఐఎన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ♦ లాగిన్ చేసిన తర్వాత ఈపీఎఫ్ని సెలక్ట్ చేసుకోవాలి. ♦ కాన్ వ్యూ పాస్బుక్పై క్లిక్ చేయాలి. ♦ ఆ తర్వాత మీ యూఏఎన్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి ♦ ఓటీపీని ఎంటర్ చేయండి ♦ ఇప్పుడు మీరు మీ ఈపీఎఫ్ఓ ఖాతా వివరాలను చూడవచ్చు. మెంబర్ ఐడిని సెలక్ట్ చేసుకుని ఇ-పాస్బుక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ని చెక్ చేయండి మీరు మీ యూఏఎన్ని ఉపయోగించి ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఖాతా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి "EPFOHO UAN ENG"ని 7738299899కి పంపండి. వెంటనే మీకు మీ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. 40ఏళ్లలో తొలిసారి తగ్గిన వడ్డీరేట్లు ఈపీఎఫ్ వడ్డీరేట్లను ఖాతాదారుల అకౌంట్లలోకి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) జమ చేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కోసం సీబీటీ ప్రతి ఏడాది ఆదాయం, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఓ బడ్జెట్ను తయారు చేస్తుంది. ఆ బడ్జెట్కు అనుగుణంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ♦తాజా సమాచారం ప్రకారం, కోవిడ్ కారణంగా ఈపీఎఫ్ఓ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.1శాతానికి తగ్గించింది. 40ఏళ్ల తర్వాత ఇదే అత్యల్పం. అయితే నాలుగు దశాబ్దాల తర్వాత కోవిడ్ కారణంగా వడ్డీని తగ్గిస్తూ వచ్చింది. ♦గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే 13.22శాతం పెరుగుదలతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓకి 1.39 కోట్ల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు. -
దీపావళి - ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
-
స్విట్జర్లాండ్లో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
స్విట్జర్లాండ్లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. ఈ దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి గారు, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గారావు , ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి ,స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టి, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
గ్రహణాలు వీడాలి!
దీపాలు లేని లోకాన్ని ఊహించగలమా? దీపాలే లేకుంటే రోజులో సగం చీకటిమయమయ్యేది; జీవితాల్లో సగం అంధకారబంధురమయ్యేది. నాగరకత ఇంకా నత్తనడకనే కొనసాగే లోకంలో అలముకున్న తిమిరాన్ని తరిమికొట్టేవి దీపాలే! నిప్పు రాజెయ్యడం నుంచి వివిధ తైలాలతో ప్రమిదలను నింపి దీపాలు వెలిగించడం వరకు సాగిన పరిణామ క్రమానికి సహస్రాబ్దాల కాలం పట్టింది. విద్యుద్దీపాలను కనుగొన్న తర్వాత నాగరకత విద్యుద్వేగాన్ని పుంజుకుంది. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అంటూ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోల్చారు మన పూర్వులు. పరంజ్యోతి అంటే పరబ్రహ్మమే! మనుషుల్లో అజ్ఞానం తొలగిపోవాలంటే, జ్ఞాన దీపాలను వెలిగించాల్సిందే! దీపావళి పండుగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నరకాసుర వధకు సంబంధించిన గాథ ప్రసిద్ధమైనది. రావణ వధా నంతరం రాముడు అయోధ్యకు చేరుకుని ఈరోజే పట్టాభిషిక్తుడయ్యాడనే గాథ ప్రచారంలో ఉంది. బలి చక్రవర్తిని వామనుడు ఇదేరోజు పాతాళానికి అణగదొక్కాడని పురాణాల్లో ఉంది. దీపావళి ముందురోజు చతుర్దశినాడు యమధర్మరాజును దీపాలు పెట్టి పూజించితే పితృదేవతలు నరక విముక్తులవుతారని, అందువల్లనే దీనికి ‘నరక చతుర్దశి’గా పేరు వచ్చిందని కూడా చెబుతారు. పితృదేవతలను నరక విముక్తులను చేసే పర్వదినంగానే దీపావళిని జరుపుకోవడం మొదలైందని సురవరం ప్రతాపరెడ్డి ‘హిందువుల పండగలు’లో అభిప్రాయపడ్డారు. ఆరుద్ర కూడా సురవరం అభిప్రాయాన్నే బలపరుస్తూ ‘వాస్తవానికి నరకాసురుడికి, దీపావళికి సంబంధం లేదు. బలి చక్రవర్తితో కొంత సంబంధం ఉంది’ అంటూ ‘వ్యాసపీఠం’లో ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలను ఉటంకిస్తూ రాశారు. నరకాసుర వధ తదితర గాథలను తదనంతర కాలంలోనే దీపావళికి ఆపాదించుకున్నారని అనుకోవచ్చు. కథలూ గాథలూ ఎలా ఉన్నా, జనాలందరూ వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. దీపావళికి మన సంస్కృతిలోనే కాదు, దేశంలోని వివిధ భాషల సాహిత్యంలోనూ ఇతోధిక స్థానం ఉంది. దీపావళి ఆలంబనగా కొందరు హర్షాతిరేకాలను ప్రకటిస్తే, మరికొందరు నిరాశా నిర్వేదాలను పలికించారు. పురాణ ప్రబంధ సాహిత్యాల్లో దీపావళి వర్ణన పెద్దగా కనిపించదు గాని, ఆ తర్వాత వెలువడిన సాహిత్యంలో దీపావళి ప్రస్తావన కనిపిస్తుంది. ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి తొలికావ్యం ‘దీపావళి’. ‘లోన జ్వలియించు చున్న మహానలమున/ కొక స్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని/ శైశవమ్మాది ప్రేమ శ్మశానమైన/ జీవి కొకనాటి కేటి దీపావళి యిక’ అంటూ నిర్వేదాన్ని పలికిస్తారు. సరిగా అరవయ్యేళ్ల కిందట– 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు తిలక్ చైనాను నరకాసురుడితో పోలుస్తూ ‘మళ్లీ ఒక దీపావళి’ కవిత రాశారు. ‘మన ప్రధాని శ్రీకృష్ణుడు, ప్రజాశక్తి సత్యభామ/ దొంగచాటు బందిపోటు చైనాసురుడొరుగుతాడు/ మన పతాక హిమగిరిపై మళ్లీ ఆడుతుంది–/ మళ్లీ ఒక దీపావళి మళ్లీ ఒక దీపావళి’ని మనసారా ఆకాంక్షించారు. దాదాపు అదేకాలంలో మల్లవరపు జాన్ ‘కుమతులై దేశమును దురాక్రమణ జేయు/ ద్రోహచిత్తులు భీతిల్లి తొలగిపోవ/ ఢమ ఢమ యటంచు నశని పాతముల బోలి/ ధ్వని జనించె; దీపావళి దినముఖమున’ అంటూ దీపావళి విజయోత్సవ సంరంభాన్ని వర్ణించారు. హైదరాబాద్ విలీనమై తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు వానమామలై వరదాచార్యులు ‘దీనికె రాములు సెట్టి/ జీవితమును ముడిబెట్టి/ కడకు విశాలాంధ్ర గలుప/ కాస్త అయ్యెను పొట్టి... ఈ దీపావళి వెలుగున/ ఇరువురమును సోదరులుగ/ తెలిసికొంటి మెడద నెడద/ కలిపికొంటి మొకటైతిమి’ అంటూ ‘అపూర్వ దీపావళి’కి ఆహ్వానం పలికారు. ప్రపంచ దారుణాలకు మనసు చెదిరిన బైరాగి ‘పీడిత దరిద్ర శాపంతో/ క్రుంగిన ధరిత్రి కడుపు పగిలి/ వెలిగిన ప్రళయ ప్రదీపావళి/ దీపావళి వచ్చిందండీ’ అంటూ ‘చీకటి నీడలు’లో నిష్ఠుర పోయాడు. అమావాస్య రోజున వచ్చే వెలుగుల పండుగ దీపావళి. మన కవులలో కొందరు దీపావళిలో అమావాస్య చీకట్లనే చూస్తే, ఇంకొందరు ఆశల వెలుగులను తిలకించారు. వెలుగులు, చీకట్లను చూసిన కవులూ తమ సమకాలీన చారిత్రక పరిణామాలను నమోదు చేయడం విశేషం. ఈసారి దీపావళి గ్రహణాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. దీపావళి, సూర్యగ్రహణం ఒకేసారి రావడం చాలా అరుదు. ఇలాంటి పరిణామం ఇరవై ఏడేళ్ల కిందట ఒకసారి ఏర్పడింది. గ్రహణం శుభ సంకేతం కాదని చాలామంది నమ్ముతారు. అమవాస్య రోజు సూర్యగ్రహణం, పున్నమి రోజున చంద్రగ్రహణం ఏర్పడతాయి. భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు శతాబ్దాల కిందటే కనుగొన్నారు. అయినా గ్రహణాల చుట్టూ అల్లుకున్న నమ్మ కాలు జనాల్లో ఈనాటికీ సజీవంగానే ఉన్నాయి. ఖగోళ పరిణామాల వల్ల ఏర్పడే గ్రహణాల సంగతి అలా ఉంచితే, మనుషులు నిత్యం ఎదుర్కొనే గ్రహణాలు చాలానే ఉన్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడించి, అతలాకుతలం చేసిన ‘కరోనా’ గ్రహణం ఇప్పుడిప్పుడే వీడింది. అంతమాత్రాన సమాజానికి గ్రహణమోక్షం లభించిందని సంతోషించే పరిస్థితులు లేవు. ఆకలి బాధలు, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, కుల మత లింగ వివక్షలు, నేరాలు ఘోరాలు వంటి గ్రహ ణాలు సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ గ్రహణాలు వీడినప్పుడే మానవాళికి అసలైన దీపావళి! అంతవరకు ఆశల దీపాలను వెలిగించి ఉంచుదాం. -
స్వీట్లు, టపాసుల దుకాణాల వద్ధ కొనుగోలుదారుల సందడి
-
బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇక సంక్రాంతి, దసరా.. ముఖ్యంగా దంతెరాస్, దీపావళి వంటి పండగల సమయాల్లో ఫిజికల్ గోల్డ్, గోల్డ్ కాయిన్స్, జ్వువెలరీ కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతుంటాయి. దీనికి తోడు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 282 జిల్లాల్లో బంగారంపై హాల్మార్క్ తప్పని సరిచేయడంతో కొనుగోళ్లు సాఫీగా జరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ధంతేరాస్, దీపావళికి ఫిజికల్ గోల్డును ఎలా కొనుగోలు చేయాలి? పండగల సమయాల్లో ఎంత బంగారం కొనుగోలు చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం పాప్లీ గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పాప్లీ, బంగారంపై తప్పనిసరి హాల్మార్కింగ్ను అమలు చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సలహా కమిటీలో ఉన్న ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పెథే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పూనమ్ రుంగ్తా జాతీయ మీడియాకు ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి. కోవిడ్- 19 లాక్డౌన్ ఎత్తివేత, తగ్గిపోతున్న మహమ్మారి కారణంగా భారత్లో బంగారంపై డిమాండ్ పెరుగుతుందా? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. రాజీవ్ పాప్లీ : అవును, బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే? రక్షా బంధన్ నుంచి బంగారం విక్రయాలు ఊపందుకున్నాయి. కోవిడ్ ఎఫెక్ట్తో అనిశ్చిత కాలంలో గోల్డ్లో పెట్టుబడులు సురక్షితమని పెట్టుబడి దారులు భావిస్తున్నారు. ఆశిష్ పేథే : గత రెండేళ్లుగా నేను చూస్తున్న మరో ట్రెండ్ ఏమిటంటే పెట్టుబడి దారులు ముఖ్యంగా యువకులు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రెట్టింపు ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా బంగారం కొనుగోళ్ల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం ప్రారంభించాయి. హాల్మార్క్ లేని ఆభరణాలను తప్పుగా అమ్మడం సాధ్యమేనా? పెథే : హాల్మార్కింగ్ తప్పనిసరి అయిన 282 జిల్లాల్లో మీరు బంగారం కొనుగోలు చేస్తే, హాల్మార్క్ లేని ఒక్క ఆభరణాన్ని కూడా విక్రయించలేరు. 2 గ్రాముల చిన్న ముక్క లేదా చిన్న చెవిపోగు కూడా హాల్మార్క్ చేయబడాలి. వాస్తవానికి, ప్రతి స్వర్ణకారుడు కనీసం 10x మాగ్నిఫికేషన్ ఉన్న భూతద్దం కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తుంది. తద్వారా వినియోగదారు హాల్మార్కింగ్ను తనిఖీ చేయవచ్చు. 18-క్యారెట్ బంగారు ముక్క మొదలైన వాటి కోసం మార్కింగ్ను వివరించే చార్ట్ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి పూనమ్ రుంగ్తా : మనం భారతీయులం. బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ మన పెట్టుబడుల్ని మాత్రం ఆభరణాల్లో కలపకూడదు. ఎందుకంటే? కొన్న బంగారాన్ని కుటుంబ సభ్యులకు విభజించాలంటే.. వాటిని అమ్మాల్సి ఉంటుంది. అందువల్ల, గోల్డ్ బార్గా లేదా ఇ-గోల్డ్ లేదా పేపర్ గోల్డ్ కొనుగోలు చేయడం వంటి మార్గాలు బంగారంపై ఉత్తమమైన పెట్టుబడిగా భావించాలి. బంగారాన్ని ఈక్విటీ (షేర్లు), డెబిట్ వంటి ఏదైనా ఇతర ఆస్తిలాగా పరిగణించండి. భౌతిక రూపంలో (స్వచ్ఛమైన బంగారం) లేదా గోల్డ్ ఇటిఎఫ్లలో మీ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 10-15 శాతం బంగారం రూపంలో ఉంచండి. ధంతేరస్, దీపావళి సమయాల్లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? రుంగ్తా : ప్రజలు ధంతేరస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బంగారం ధర కూడా డిమాండ్, సప్లై నిర్విరామంగా కొనసాగుతుంది. అలాంటి సమయాల్లో కొనుగోలు దారులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే? పండగల సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఆ సమయంలో కొద్ది బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణ సమయాల్లో మీకు కావాల్సినంత బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. ధంతేరాస్, దీపావళి సమయంలో మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బంగారు నాణేలు కొనుగోలు చేయడం ఉత్తమమేనా? రుంగ్తా : తక్కువ మేకింగ్ ఛార్జీల సంగతి అటుంచితే. బంగారు నాణేలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. మనకు తెలిసినట్లుగా, బంగారు కడ్డీలు, నాణేలు 24-క్యారెట్ల స్వచ్ఛమైన నాణ్యతతో వస్తాయి. అంతేకాకుండా, బంగారు నాణేలు వినియోగం కంటే పెట్టుబడి పెడితే ఎక్కువ రుణాలు ఇస్తాయి. -
కొనకుండానే పేలుతున్న టపాకాయలు..!
-
Diwali 2022: నరక చతుర్ధశి.. అనేక పేర్లు... అనేక ఆచారాలు.. ఈ విషయాలు తెలుసా?
నరక చతుర్ధశి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నరకం నుంచి విముక్తి కోసం చేసే యమ ధర్మరాజు ప్రీత్యర్థం జరుపుకొనే పండుగగా ‘నరక చతుర్దశి’ మొదలైందట. కానీ, ఆ తరువాతి కాలంలో నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించిన సందర్భాన్ని పురస్కరించుకొని.. ‘నరక చతుర్దశి’ జరుపుకోవడం ప్రాచుర్యంలోకి వచ్చింది. అనేక పేర్లు... అనేక ఆచారాలు నిజానికి నరక చతుర్దశికి అనేక పేర్లున్నాయి. ‘ప్రేత చతుర్దశి’, ‘కాళ చతుర్దశి’ అని కూడా అంటారు. ‘కాళ’ అంటే అంధకారం అని అర్థం! అలా ఇది ‘అంధకారపు చతుర్దశి’. గుజరాతీయులు ‘కాల చౌదశ్’ అంటారు. ఆ రోజుకూ, కాళీ మాతకూ సంబంధం ఉందనేవారూ ఉన్నారు. దీన్ని ‘కాళీ చౌదశ్’గా పేర్కొంటూ, అంధకారాన్ని రూపుమాపే కాళీ దేవతను ఆ రోజు పూజిస్తారు. నరకాసుర కథ పురాణాల ప్రకారం నరకాసురుడు దేవతల్నీ, మానవుల్నీ హింసించేవాడు. అనేక రాజ్యాలను జయించి, 16 వేల మంది రాకుమార్తెల్ని చెరపట్టాడు. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు దేవతల, మానవుల ప్రార్థన మేరకు నరకాసురునితో యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుని భార్య సత్యభామ యుద్ధక్షేత్రంలో భర్తకు సహకరించింది. కృష్ణుడు నరకాసురుణ్ణి వధించి, రాకుమార్తెలను చెర నుంచి విడిపించాడు. ‘ఈ తిథి నాడు ఎవరైతే మంగళస్నానం చేస్తారో, వారికి నరకలోక భయం లేకుండా ఉండేలా అనుగ్రహించాల్సింది’ అంటూ నరకుడు, శ్రీకృష్ణుణ్ణి వరం కోరాడు. ఆయన అనుగ్రహించాడు. అందుకే ‘నరక చతుర్దశి’ నాడు ప్రధాన కర్తవ్యం తెల్లవారగట్టే లేచి తలంటి స్నానం చేయడం! నరకాసుర దహనం మహారాష్ట్రీయులకు ఇది ముఖ్యమైన పండుగ. పశ్చిమ బెంగాల్లో పందిళ్ళు వేసి, దేవతా విగ్రహాలను పెట్టి, పూజలు జరుపుతారు. గోవా లాంటి చోట్ల ఈ పండుగను ‘దసరా’ లానే జరుపుకొంటారు. దసరాకు రావణాసురుడి దిష్టిబొమ్మలు చేసి, దహనం చేస్తారు. నరక చతుర్దశికేమో నరకాసురుడి బొమ్మ దహనం చేస్తారు. వేకువనే బొమ్మ దహనం చేసి, టపాకాయలు కాల్చి, ఇంటికి వచ్చి తలంటు స్నానం చేస్తారు. తలంటు స్నానం... యమతర్పణం... దీపదానం తెల్లవారే తలంటు పోసుకొని, పాపక్షయం కోసం ప్రార్థించాలి. యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి. దీపం వెలిగించాలి. అలాగే, ఆ రోజున నరకం నుంచి ముక్తి కోసం సాయంకాలం ప్రదోషకాలంలో యమ ధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని ‘వ్రతచూడామణి’ చెబుతోంది. దేవాలయాల్లో, మఠాల్లో దీపాలను వరుసగా ఉంచాలి. అందుకే, నరక చతుర్దశినే ‘యమ దీపదాన్’ అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి సంప్రీతి కోసం ఇలా నరక చతుర్దశి, దీపావళి, కార్తిక శుద్ధ పాడ్యమి - వరుసగా మూడు రోజులూ దీపప్రదానం చేయాలి. ఈ పండుగ 14వ తిథి నాడు జరుగుతుంది కాబట్టి, 14 రకాల కూరగాయలతో వంటకాలు చేస్తారు. దేవుడి సంప్రీతి కోసం ఒక సద్బ్రాహ్మణుణ్ణి దేవుడిగా భావించి, అతనికి భోజనం పెడతారు. ఆ తరువాత అందరూ భోజనం చేస్తారు. నాలుగు వత్తుల దీపంతో... సాయంత్రమయ్యాక ప్రదోషకాలంలో పూజ చేస్తారు. నరకం పాలు కాకుండా ఉండేందుకూ, పాపాలన్నీ పోగొట్టుకొనేందుకూ ఆ సమయంలో నాలుగు వత్తులతో సంప్రదాయబద్ధంగా ఒక దీపం వెలిగిస్తారు. ‘దత్తో దీప శ్చతుర్దశ్యామ్ నరక ప్రీతయే మయా, చతుర్వర్తి సమాయుక్తః సర్వపాపాపనుత్తయే’ అంటూ ‘లింగ పురాణం’లోని శ్లోకం చదువుతారు. ఈ చతుర్దశికి నరకాధిపతి ప్రీతి కోసం, పాపాలన్నీ పోగొట్టుకోవడం కోసం ఈ నాలుగువత్తుల దీపం వెలిగిస్తున్నానని అర్థం. అలాగే శివపూజ చేస్తారు. కాళీపూజ దీపావళి అనగానే ఎక్కువగా లక్ష్మీపూజ గుర్తొస్తుంది. కానీ, బెంగాల్ ప్రాంతంలో నరక చతుర్దశి రోజు రాత్రి అంతా కాళీపూజ చేస్తారు. అందుకే, అక్కడ ఆ రోజును ‘కాళీపూజా దినం’గా పిలుస్తారు. మొత్తం మీద నరకం అంటే, అజ్ఞానమనీ, అంధకారమనీ, పాపాల కూపమనీ కూడా అర్థం చెప్పుకోవచ్చు. వీటన్నిటి నుంచి విముక్తి కోరుకొనే పండుగ కాబట్టే, దీనికి ఇంత విశిష్టత. - రెంటాల జయదేవ చదవండి: Narak Chaturdashi: తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోక కంటకుడై! చివరికి Walnut Halwa: వాల్నట్ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి! -
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
Diwali 2022: ఈ ఏడాది దీపావళిపై సందిగ్దత.. ఎప్పుడు జరుపుకోవాలి?
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. పురాణాల్లో దీపావళి వెనక రెండు కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడనే రాక్షసున్ని సంహారం చేసిన మరుసటి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతుంటారు. అదే విధంగా త్రేతాయుగంలో లంకలో రావణుడిని హతమార్చి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ఈ ఏడాది దీపావళి పండుగ జరుపుకోవడంపై కొంత అయోమయం తలెత్తింది. తిథులు, నక్షత్రాల ప్రకారం ఈనెల 24న జరుపుకోవాలని కొందరు భావిస్తుంటే మరికొంతమంది నవంబర్ 25న ప్రభుత్వం దీపావళి సెలవు ప్రకటించారని కాబట్టి ఆరోజే పండుగ నిర్వహించుకోవాలని ఆలోచిస్తున్నారు.. దీంతో కాస్తా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శాస్త్రం ప్రకారం అమావాస్య రాత్రి తిథి ఉండగా దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పంచాంగం, తిథి, వారం ప్రకారం చూసుకున్నా నవంబర్ 24వ తేదీన దీపావళి వేడక నిర్వహించుకోవాలని తెలిపారు. అక్టోబర్ 24 సోమవారం రోజు చతుర్ధశి తిథి సాయంత్రం 5 గంటల లోపు ఉందని, 5 గంటల తరువాత అమామాస్య ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది. అంటే 25న సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించే సమయానికి అమావాస్య ఉండదని వెల్లడించారు. రాత్రి సమయాల్లో అమావాస్య తిథి 24వ తేదీనే ఉండటం వల్ల ఆ రోజే దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉన్నప్పటికీ సూర్యాస్తమయం సమయానికి అమావాస్య వచ్చేస్తుంది. దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సోమవారం రాత్రి ( 24 తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. -
Panjagutta: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ..
హైదరాబాద్: పంజగుట్టలో చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు.. చిన్నారి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో నవంబరు 4న దీపావళిరోజు సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం.. ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు ఉండటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప! చదవండి: యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం.. -
దీపావళి వేడుకల్లో టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ దంపతులు
డల్లాస్, టెక్సాస్: ప్రవాస భారతీయులతో కలిసి టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తన సతీమణి సిస్లియాతో కలసి టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ లోని తన నివాస గృహంలో త్సాహంగా పండుగ జరుపుకున్నారు. దీపావళి సంకేతంగా పలు దీపాలను గవర్నర్ దంపతులు వెలిగించార. అందరికీ విందుభోజనం తో పాటు మిటాయిలు పంచారు. మరిచిపోలేని అనుభూతి ఈ సందర్భంగా గవర్నర్ అబ్బాట్ మాట్లాడుతూ.. అమెరికా దేశ ప్రగతిలో ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్ర పురోభివృద్ధికి వివిధ రంగాలలో ప్రవాస భారతీయులు చూపుతున్న ప్రతిభ అనన్య సామాన్యం అన్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవడం తనకొక ఒక ప్రత్యేక అనుభూతి పంచిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. భారత దేశం టెక్సాస్ రాష్ట్రాల మధ్య ఇప్పటికే గణనీయమైన వాణిజ్య సంభందాలున్నాయని, భవిష్యత్తులో అవి ఇంకా పెరుగుతాయనే నమ్మకం ఉందన్నారు. కృతజ్ఞతలు భారత్, టెక్సాస్ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక, వాణిజ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు గవర్నర్ చేస్తున్న కృషి అమోఘమని ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్ అగర్వాల్ అన్నారు. అధికారిక నివాస గృహంలో ప్రవాస భారతీయల మధ్య దీపావళి పండుగ జరుపుకున్న గవర్నర్ అబ్బాట్ దంపతులకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మురళి వెన్నం, సుధాకర్ పేరం, వినోద్ ఉప్పు, సంజయ్ సింఘానియా, డాక్టర్ గూడూరు రమణా రెడ్డి, గొట్టిపాటి వెంకట్, సునీల్ రెడ్డి, వెంకట్ మేడిచెర్ల, బంగారు రెడ్డి, సునీల్ మైని, ఏకే మాగో, పియూష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా'
న్యూఢిల్లీ : దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రధాని ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరి సెక్టార్లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా. సైన్యం కోసం 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకొచ్చా. ప్రతీ దీపావళి సైనికులతో జరుపుకుంటున్నా. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉంది. సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారు. సర్జికల్ స్ట్రైయిక్లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణం. దేశానికి సైన్యం సురక్షా కవచం' అని అన్నారు. दीपावली के पावन अवसर पर देशवासियों को हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि यह प्रकाश पर्व आप सभी के जीवन में सुख, संपन्नता और सौभाग्य लेकर आए। Wishing everyone a very Happy Diwali. — Narendra Modi (@narendramodi) November 4, 2021 -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు
-
వాట్సాప్లో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!
దీపావళి పండుగ వచ్చిందంటేనే మన అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. దీపావళి అంటేనే మన జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజున మన సంతోషాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులతో శుభాకాంక్షలు తెలపడం ద్వారా పంచుకోవాలని భావిస్తూ ఉంటాం. మరి ఎప్పటిలాగానే దీపావళి శుభాకాంక్షలు టైపు చేసి తెలిపితే కిక్ ఏముంటుంది? అందుకే వాట్సాప్లో వినూత్నంగా స్టిక్కర్ల ద్వారా శుభాకాంక్షలు తెలపండి. వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్తగా 'హ్యాపీ దీపావళి' స్టిక్కర్ ప్యాక్ ప్రవేశపెట్టింది. ఈ స్టిక్కర్ మీ మిత్రులకు, బందువులకు శుభాకాంక్షలు తెలపండి. ఎలా 'హ్యాపీ దీపావళి' స్టిక్కర్ పంపించాలని ఆలోచిస్తున్నారా?. ఈ కింద చెప్పిన విధంగా చేయండి. దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా! మొదట ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల చాట్ ఓపెన్ చేసి కీబోర్డ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చాట్ బార్ లోని స్మైలీ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎమోజీ బోర్డు దిగువ నుంచి స్టిక్కర్ ఐకాన్ ఎంచుకోండి. తర్వాత 'ప్లస్' ఐకాన్ మీద నొక్కండి. హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్ కోసం సర్చ్ చేయండి. మీకు కనబడకపోతే ఈ లింకు ద్వారా హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్ డౌన్ లోడ్ మీద క్లిక్ చేయండి. స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు మీ స్టిక్కర్ బోర్డులో చూపిస్తుంది. ఇప్పుడు మీరు మీకు నచ్చినవారికి "హ్యాపీ దీపావళి" స్టిక్కర్ పంపించవచ్చు. (చదవండి: జోరందుకున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు) -
చూస్తే చాలు కళ్లు చెమరుస్తాయి.. దీపావళి వేళ.. మనసును హత్తుకునేలా
దీపావళి పండగ అంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. స్టాక్మార్కెట్లో ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ ఉంటుంది. దాదాపు అన్ని వ్యాపార సంస్థలులు ధమాకా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే మనసును ఆకట్టుకునేలా యాడ్స్ రూపొందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అందులో ఈసారి వచ్చిన కొన్ని ప్రకటనలు మనసును హత్తుకునేలా.. గుండె తడిని పెంచేలా.. ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా భావంతో కట్టిపడేసేలా వాటిని రూపొందించారు. పండగ వేళ మీరు వాటిని చూడండి. వీటి తీరే వేరు సాధారణంగా అన్ని యాడ్స్ ఆయా కంపెనీలు తయారు చేసే ప్రొడక్టు గురించి విపరీతంగా ప్రమోట్ చేస్తున్నట్టుగా తయారవుతాయి. కానీ దీపావళి యాడ్స్ అలా కాదు పూర్తిగా భావోద్వేగంగా ఉంటాయి. బ్రాండ్, ప్రొడక్ట్ ప్రమోషన్ అనేది అంతర్లీనంగా ఉంటూ ఎమోషనల్గా ఉంటాయి. అందుకే ఏళ్లు గడిచినా సరే వాటిని మరిచిపోవడం కష్టం. సేల్స్మేన్ కళ్లలో ఆనందం ఇండియన్ ఆయిల్ యాడ్లో .. దీపావళి పండగ సందర్భంగా ఓ స్వీట్ షాప్ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ షాప్ యజమాని వచ్చిన కస్టమర్లందరికీ టేస్ట్ చూడమంటూ కలాకాన్ అందిస్తుంటాడు. ఈ షాప్లోని సేల్స్మేన్ చూస్తుండగానే కాంప్లిమెంటరీ స్వీట్ మొత్తం అయిపోతుంది. చివరకు షాప్ మూసివేసే సమయంలో ఏమైనా స్వీట్ మిగిలి ఉందా అని సేల్స్మేన్ వెతుకుతారు. కానీ అక్కడ ఏమీ కనిపించదు. పండగ వేళ బయటంతా బాణాసంచా వెలుతురుతో సందండి నెలకొంటే సేల్స్మ్యాన్ ముఖంలో విచారణం నెలకొంటుంది. మనసంతా బాధతో నిండిపోయి ఉంటుంది. Sometimes, the smallest gesture can light up someone's world. This festive season, let's celebrate all such moments and spread good cheer and warmth.#IndianOil #Indane #XTRATEJ #HappyDiwali pic.twitter.com/s7Xkei8vhF — Indian Oil Corp Ltd (@IndianOilcl) November 2, 2021 మనసంతా నిరాశతో గుండె బరువెక్కిపోయిన సేల్స్మేన్ కళ్లలో ఆనందం ఎలా వచ్చింది. ఎవరు ఆ సంతోశానికి కారణమనే అంశాలను ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించారు. చివర్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్తో యాడ్ మరో లెవల్కి వెళ్లిపోతుంది. దీపావళి యాడ్స్కి స్పెషల్ ట్రెండ్ని క్రియేట్ని చేసి వాటిలో రెండేళ్ల క్రితం వచ్చిన హెచ్పీ ప్రింటర్స్ యాడ్కి ప్రత్యేక స్థానం ఉంది. ఓల్డ్ అడ్వెర్టైజ్మెంట్కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈసారి కూడా హెచ్పీ సంస్థ యాడ్ను రెడీ చేసింది. కొన్ని బంధాలకు లేబుళ్లు అక్కర్లేదు అంటూ అమెజాన్ రూపొందించిన యాడ్ తప్పకుండా ఆకట్టుకుంటుంది. దీపావళి రోజున ఇంటి దగ్గర ఉండకుండా బయటకు తీసుకెళ్లిన కొడుకుతో తండ్రి వాదులటతో ప్రారంభమయ్యే ఎల్ అండ్ టీ యాడ్ ఎండింగ్లో ఇచ్చే ట్విస్ట్తో మరో లెవల్కి చేరుకుంటుంది. వృద్దాప్యంలో చాదస్తం ఎక్కువైన భర్త, అతనితో వేగలేక పోతున్న భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చెబుతూ ఏయూ బ్యాంక్ రూపొందించిన యాడ్ కూడా ఆకట్టుకుంటుంది. -
చిరు వ్యాపారులకు భారీ షాకిచ్చిన కేంద్రం.. గ్యాస్ ధర ఏకంగా..
అనుకున్నట్టే అయ్యింది. అంతా భయపడ్డట్టే జరిగింది. తనకు కనిరకరం లేదని మరోసారి కేంద్రం చాటుకుంది. పెట్రోలు, డీజిల్ రేట్ల పెంపుతోనే సతమతం అవుతున్న ప్రజానీకంపై ఈసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో విరుచుకుపడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేసేంది. రూ.266 రకరకాల కారణాలు చెప్పి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా మారినట్టుంది. దాదాపు ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ రేట్లు సరిపోవన్నట్టు తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకాఎకిన రూ. 266లు పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర రెండు వేల రూపాయలకు అటుఇటుగా నమోదు అవుతోంది. హైదరాబాద్లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1905.32కి చేరుకుంది. చిరువ్యాపారులకు ఇక్కట్లే ఆగస్టు 17న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం పెంచింది. ఆ తర్వాత రెండు నెలల విరామం ఇచ్చింది. అయితే రెండు నెలల విరామం ఉపశమనం పొందామనే భావన రానీయకుండా ఈసారి ఒకేసారి రూ.266 వంతున ధరను పెంచేసింది. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస సిలిండర్ ధరతో చిరువ్యాపారులు, స్ల్రీట్ఫుడ్ వెండర్ల కష్టాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతోంది. కరోనాతో పోయిన ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంటే.. ఆ ఆనందం క్షణకాలం కూడా నిలవకుండా పెరుగుతున్న గ్యాస్ ధరలు హరించివేస్తున్నాయి. దీపావళికి ముందే గత వారం రోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయనే ఫీలర్లను ప్రభుత్వం వదులుతూ వస్తోంది. దీపావళి తర్వాత పెంపు ఉండవచ్చని భావించారు. కానీ అంతకు ముందే ధరను కేంద్రం పెంచింది. అది కూడా రికార్డు స్థాయిలో రూ.266గా ఉండటం గమనార్హం. రెండు నెలల్లో గ్యాస్పై అందిస్తున్న సబ్సిడీలను క్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గడిచిన రెండు నెలల కాలంలోనే గృహ, వాణిజ్యపరమైన సిలిండర్ల ధరలు నాలుగు సార్లు పెరిగాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై సెప్టెంబరులో రూ. 15 వంతున, అక్టోబరులో రూ. 25వంతున ధర పెంచింది. ఈ ఏడాది మొత్తంగా పరిశీలిస్తే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.205 వంతున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 952లుగా ఉంది. చదవండి: బైకు కంటే విమానాలకే చీప్గా ఫ్యూయల్ ! -
హమ్మయ్య.. ఊపిరాడింది!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజన్లకు ఇది శుభవార్త. దీపావళికి కాల్చిన బాణసంచాతో వెలువడే కాలుష్యం గతేడాది దీపావళితో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈసారి మహానగరవాసుల్లో పర్యావరణ స్పృహ పెరగడం, లాక్డౌన్, కోవిడ్ కష్టాల నేపథ్యంలో చేతిలో నగదు నిల్వలు లేక బాణసంచా కొనుగోళ్లు 40 శాతం మేర తగ్గాయి. దీంతో కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రధానంగా వాయుకాలుష్యంలోని సూక్ష్మ, స్థూల ధూళికణాల కాలుష్యం గతేడాది కంటే తగ్గుముఖం పట్టగా..సల్ఫర్డయాక్సైడ్ కాలుష్యం స్వల్పంగా పెరగడం గమనార్హం. ఇక నైట్రోజన్ ఆక్సైడ్ల కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు పీసీబీ తాజానివేదికలో వెల్లడైంది. శబ్దకాలుష్యం సైతం గతేడాది కంటే స్వల్పంగా తక్కువ నమోదుకావడంతో సిటీజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతేడాది దీపావళి, ప్రస్తుత దీపావళి రోజున నగరంలో పలు ప్రాంతాల్లో నమోదైన శబ్ద, వాయు కాలుష్యం డేటాను సోమవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసింది. చదవండి: ఎట్టకేలకు తల్లి చెంతకు.. తగ్గిన వాయు కాలుష్యం.. గ్రేటర్ పరిధిలో గతేడాది దీపావళి పర్వదినంతో పోలిస్తే ఈ సారి వాయుకాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఉదాహరణకు సూక్ష్మ ధూళికణాల మోతాదు గతేడాది పండగరోజున ఘనపు మీటరుగాలిలో 72 మైక్రోగ్రాములు నమోదుకాగా..ఈ సారి పర్వదినం రోజున కేవలం 64 మైక్రోగ్రాములు మాత్రమే నమోదైంది. ఇక స్థూల ధూళికణాల మోతాదు గతేడాది దీపావళి రోజున 163.4 మైక్రోగ్రాములు నమోదుకాగా..ఈ సారి కేవలం 128 మైక్రోగ్రాములు మాత్రమే నమోదైంది. కాగా ఈ సారి సల్ఫర్డయాక్సైడ్ కాలుష్య కారకం మోతాదు స్వల్పంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది. చదవండి: ముంబైలో తగ్గిన దీపావళి సప్పుడు స్వల్పంగా తగ్గిన శబ్ద కాలుష్యం.. నగరంలో పలు పారిశ్రామిక, వాణిజ్య, నివాస, సున్నిత ప్రాంతాల్లో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేసింది. గతేడాది నివాస ప్రాంతాల్లో పగలు 69 డెసిబుల్స్..రాత్రివేళ 64 డెసిబుల్స్ కాలుష్యం నమోదుకాగా..ఈ సారి(2020 దీపావళి) పగలు 59 డెసిబుల్స్..రాత్రి 63 డెసిబుల్స్ మేర శబ్దకాలుష్యం నమోదైనట్లు పీసీబీ తాజా నివేదిక తెలిపింది. కాలుష్యం తగ్గడానికి కారణాలివే.. ♦ సిటీజన్లలో పర్యావరణ స్పృహ పెరగడం ♦ కోవిడ్ రోగులు, కోవిడ్ నుంచి ఇటీవలే కోలుకున్నవారు, శ్వాసకోశ సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు స్వేచ్ఛగా శ్వాసించేందుకు అసౌకర్యం కలుగుతుందన్న భావన. ♦ కోవిడ్, లాక్డౌన్ కష్టాల నేపథ్యంలో చేతిలో నగదు నిల్వలు లేకపోవడం. ♦ క్రాకర్స్పై నిషేధం విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు నిషేధం ఉత్తర్వులు జారీచేయడంతో వినియోగదారులు అయోమయానికి గురవడం. -
తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు: సీఎం జగన్
-
పండగే పండగ.. మనకు కాదు.. కరోనాకు..
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఒకవైపు... కరోనా వేళ బతుకలేనమ్మ మరోవైపు.. గుంపులు, గుంపులుగా చేరి పండగ చేసుకుందామంటే.. గుబులు గుబులుగా ఉంది పరిస్థితి. ఓనం పండగ తర్వాత కేరళలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి కేరళీయులు కేరళకు వెళ్లడం, అక్కడ పండగను సందడిగా నిర్వహించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా, దీపావళి పండగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో వినాయక చవితి సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ ఉత్సవాలను జరుపుకోలేదు. కరోనా నిబంధనలను పాటించకుండా పండగలను నిర్వహిస్తే వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. తెలంగాణకు ప్రాణం బతుకమ్మ... తెలంగాణ పండగల్లో కీలకమైనది దసరా. బతుకమ్మ ఆటపాటలు మరీ ముఖ్యమైనవి. వీటిని ఆడపడుచులు ఒకచోట గుమిగూడి నిర్వహిస్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరల పంపిణీ చేపడుతోంది. బతుకమ్మ పండగను పురస్కరించుకొని మహిళలు ఒక చోట నుంచి మరోచోటకు పెద్ద ఎత్తున ప్రయాణిస్తారు. ఆ తర్వాత క్రిస్మస్, సంక్రాంతి పండగలు వరుసగా ఉన్నాయి. వాటి విషయంలోనూ ఏం చేయాలన్న దానిపై సర్కారులో తర్జనభర్జన సాగుతోంది. కేసుల పెరుగుదలతో జాగ్రత్తలు తప్పనిసరి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరుకుంది. పల్లెల్లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గడంలేదు. రోజుకు పది వరకు కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వర్షాకాలం సీజన్ దాటి చలికాలం ప్రారంభ దశలో ఉన్నాం. సహజంగా వైరస్ వ్యాప్తికి చలికాలం వాహకంగా ఉంటుంది. ఫ్లూ వంటి వ్యాధులు ఈ కాలంలోనే విజృంభిస్తాయి. ఎలా నిర్వహించుకోవాలి? ఈ పండగల నిర్వహణపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీకాలేదు. అయితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం కొన్ని సూచనలు చేస్తున్నారు. ► భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ► పండుగల సందర్భంగా ప్రజలు గుమిగూడకుండా చూసుకోవాలి. ► పండగలకు బంధువులను పిలవకుండానే ఎవరికివారు తమ ఇళ్లలో నిర్వహించుకోవాలి. ► కరోనా అనుమానిత లక్షణాలున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐసోలేషన్లోనే ఉండాలి. పండగలకు హాజరుకాకూడదు. ► దీపావళి విషయంలో ఇదే మాదిరి చర్యలు తీసుకోవాలి. -
భయపెడుతున్న సాయిపల్లవి
-
దీపావళి ఎఫెక్ట్: హల్చల్ చేస్తున్న సినిమాలు
సినీ అభిమానులకు దీపావళి రెట్టింపు పండగ వాతావరణం తెచ్చింది. దీపావళి కానుకగా తమ అభిమాన హీరోహీరోయిన్ల కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలు, విశేషాలను చిత్ర బృందాలు విడుదల చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానులు దీపావళికి డబుల్ ధమాకా అందుకున్నారు. ఇప్పటికే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పలు చిత్రాలకు సంబంధించిన టైటిల్స్ను అనౌన్స్ చేయడంతో పాటు.. మరికొన్ని చిత్రాల్లోని హీరోహీరోయిన్లతో పాటు ముఖ్య తారాగణం లుక్లను విడుదల చేశారు. అంతేకాకుండా ఆయా చిత్రాల టీజర్, ప్రి టీజర్, మోషన్ పోస్టర్లను కూడా అభిమానులపై వదులుతూ సినీ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి పెద్ద సినిమాలతో మొదలెడితే.. తిప్పరామీసం, అక్షర వంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. భయపెడుత్నున సాయిపల్లవి సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అధిరన్’. తెలుగులో ‘అనుకోని అతిధి’. ఈ మూవీలో సాయిపల్లవి ఇప్పటివరకు పోషించనట్టువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్, సాయి పల్లవి లుక్ తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకంక్షలు తెలుపుతూ సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర బృందం. టీజర్ను పరిశీలిస్తే సాయి పల్లవి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నవంబర్ 15న విడుదల కానుంది. సరిలేరు నీకెవ్వరు.. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.దీపావళి సందర్భంగా దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి లుక్తో పాటు టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు పోస్టర్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అల వైకుంఠపురంలో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అల వైకుంఠపురములో’ . వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఏ రేంజ్లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, బన్నీ డైలాగ్తో పాటు ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసింది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర బృందం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న సభ్యులందరూ దిగిన ఫోటోను షేర్ చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. డిస్కో రాజా మాస్ మహారాజ్ రవితేజ తెరపై కనిపించి చాలా కాలమే అయింది. వరుస ఫెయిల్యూర్తో ఢీలా పడిన రవితేజ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’ . పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. తాజాగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ డిస్కో రాజా పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ నభా నటేష్తో జంటగా కనిపించాడు. దీంతో ఈ చిత్రంలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్లు కొదువే లేదని స్పష్టం అవుతోంది. రజిని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తిప్పరా మీసం.. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తిప్పరామీసం. ఎల్ కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ తంబోలి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శ్రీవిష్ణు ఫస్ట్ లుక్, టీజర్ విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలపుతూ మరో పోస్టర్ను విడుదలు చేసింది. శ్రీ విష్ణు రఫ్ లుక్లో కనిపిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘సూపర్ మచ్చి’అంటున్న చిరు అల్లుడు ‘విజేత’ఫలితం తర్వాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ . రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. తాజాగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ హీరో, హీరోయిన్ల పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఎలాగైనా ఈ చిత్రంతో విజయం సాధించాలని కళ్యాణ్ దేవ్తో పాటు మెగా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ‘అశ్వథ్థామ’గా నాగశౌర్య అంతేకాకుండా నాగశౌర్య, మెహరీన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా చిత్ర టైటిల్ను ‘అశ్వథ్థామ’గా ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. టైటిల్ లోగో అండ్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ‘వెంకీ మామ’, నందమూరి బాలకృష్ణ ‘రూలర్’. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’,సత్యదేవ్, ఇషారెబ్బ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న‘రాగల 24 గంటల్లో’ చిత్రాలు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి, . అంతేకాకుండా నిఖిల్ ‘అర్జున్ సురవరం’సినిమాకు సంబంధించిన అప్డేట్ను కూడా దీపావళి కానుకగా విడుదల చేసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. ఇక దీపావళి కానుకగా సోషల్ మీడియా వేదికగా ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో దీపావళికీ చీకట్లే!
సాక్షి సిద్దిపేట : ఇది ఆర్టీసీ కార్మికుల కుటుంబాల పరిస్థితి. తెలంగాణలో పెద్దపండగ బతుకమ్మ అప్పుడు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది.. సమస్యలు తీరుతాయని ఊహించిన కార్మికుల పరిస్థితి అంతా తారుమారైంది. దీంతో సెప్టెంబర్ నెల వేతనం అందక అక్టోబర్ నెల వేతనం వస్తుందో రాదో తెలియని దుస్థితి. బతుకమ్మకు ఇంటిల్లిపాది కొత్తబట్టలు వేసుకునే సాంప్రదాయం ఉండగా కార్మికులు మాత్రం పాత బట్టలతోనే పండుగ జరుపుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో వంటావార్పు కార్యక్రమాలకు పరిమితమయ్యారు. దసరాకు కళ లేదు. ఆడపడుచులను ఈ ఏడాది పండుగలకు ఇంటికి కూడా పిలువలేని పరస్థితి. చూస్తూ ఉండగానే దీపావళి వచ్చింది. అందరి ఇళ్లలో దీపావళి వెలుగులు నింపగా.. కార్మికుల ఇళ్లలో మాత్రం చీకటి తెరలు కమ్మి ఉన్నాయి. నోములను వాయిదా వేస్తున్నారు. సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో.. తమ సమస్యలు ఎప్పటికి తీరుతాయో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. జీతంతోనే కుటుంబ పోషణ ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు జిల్లాలో మొత్తం 1,147 మంది ఉన్నారు. అంటే ఇన్ని కుటుంబాలు బతుకమ్మ, దసరా, ఇప్పుడు దీపావళి పండుగకు వీరి ఇళ్లలో కళ తప్పింది. పలువురి ఇళ్లలో పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి. సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్లలో బస్సు డిపోలు ఉన్నాయి. ఈ డిపోల ద్వారా ఆర్టీసీ బస్సులు 209, అద్దెబస్సులు 77 నడుస్తున్నాయి. అయితే ఇందులో పనిచేసే 411 డ్రైవర్లు, 506 కండక్టర్లు, మెకానిక్, ఇతర కార్మికులు 228 మంది ఉన్నారు. మొత్తం 1,147 కుటుంబాలు ఉండగా.. వీరికి నెలకు వేతనాలు రూ. 16వేల నుంచి ఎక్కువ ఎక్కువగా రూ. 46 వేలు సర్వీస్ మరీ ఎక్కువైతే రూ. 50వేల వరకు వస్తాయి. వీటితోనే కుటుంబాలు సాధుకోవాలి. రెండు నెలలుగా వేతనాలు నిలిచి పోవడంతో వీరికి తల్లిదండ్రులు, పిల్లలు, అత్తామామ అందరూ పండుగ పూట ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారమైన కుటుంబ పోషణ మల్లేశం ఆర్టీసీ డ్రైవర్. 26 ఏళ్లుగా సంస్థలో కార్మికునిగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పండుగ వచ్చిందంటే చాలు పేద కుటుంబం అయినప్పటికీ మల్లేశం ఇంట్లో సందడి ఉంటుంది. ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగ రోజు బిడ్డ, అల్లుడు, మనమరాలు, కొడుకు, భార్యతో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేవారు. కానీ ఈ సారి పండుగ పూట పస్తులు తప్పలేదు. సమ్మె నేపథ్యంలో అందరితోపాటు మల్లేశం కూడా ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు సెప్టెంబర్ నెల వేతనాలను విడుదల చేయకపోవడంతో పూటగడవడమే కష్టంగా మారింది. ప్రతీ ఏడాది దసరా పండుగ భార్య , కూతురుకు కొత్త బట్టలు కొనిచ్చే మల్లేశానికి ఈ సారి ఆర్థిక సమస్య ఎదురైంది. జేబులో ఒక్క పైసా లేకుండా కుటుంబ సభ్యులు పోషణ తలకు మించిన భారంగా మారింది. దీపావళి పండుగ మరీ దారుణంగా ఉంటుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దీపావళికి కూతురు, అల్లుడిని పండుగకు పిలవాలంటే భయమేస్తుందని మల్లేశం బాధపడుతున్నాడు. -
బాష్...ఫ్రమ్ బాలీవుడ్; ఇది పండగ కల్చర్
దీపావళి గ్రాండ్ ఫెస్టివల్. గోల్డ్ ఫెస్టివల్. హంగు..ఆర్భాటాలతో సాగుతుంది. అందుకే ఇది పార్టీ ప్రియులకు ఇష్టమైన పండుగ. సిటీలో పార్టీలందు పండుగ పార్టీలు వేరయా.... మరీ ముఖ్యంగా దీపావళి పండుగ అంటే చాలు సిటీ పార్టీ సర్కిల్కి ఎక్కడ లేని ఉత్సాహమొస్తుంది. ఒక పార్టీకి ఉండాల్సిన హంగులన్నీ ఉంటాయి. దీపావళి బాష్ పేరిట బాష్...ఫ్రమ్ బాలీవుడ్... బాలీవుడ్ నుంచి సినిమాలు ఫ్యాషన్లు మాత్రమే కాదు అక్కడి పార్టీలు కూడా సిటీకి ట్రెండీగా మారతాయి ఈ దివాళి భాష్లు ఒక ఉదాహరణ. బిగ్బీ అమితాబ్ బచ్చన్ ప్రతి ఏడాదీ దివాళి పార్టీ ఇస్తారు. అలాగే షారూఖ్ఖాన్ నివాసం మన్నత్ దివాళి బాష్ సందడితో వెలిగిపోతుంది. వీరితో పాటు అనిల్కపూర్, శిల్పాశెట్టి, కరణ్ జోహార్, ఏక్తాకపూర్, అర్పితా శర్మ వంటి బాలీవుడ్ ప్రముఖులు నిర్వహించే దివాళి బాష్ కోసం బాలీవుడ్ ఏడాదంతా వేచి చూస్తుంది. య«థా సెలబ్రిటీ తథా సిటీ అన్నట్టుగా... నగరంలోని రిచ్ పీపుల్ కూడా ఎవరికి వారు తమ అతిథులను మెప్పించడానికి దివాళి బాష్ను ఎంచుకున్నారు. – సాక్షి,సిటీబ్యూరో సంప్రదాయ దుస్తుల డిజైన్లలో ఇంత వెరైటీనా? క్రాకర్స్లో ఇంతగా వింత మెరుపులు మెరిపించేవీ ఉంటాయా? అన్ని స్వీట్స్ తినేసింది నేనేనా?... ఇలాంటి ఆశ్చర్యానందాలకు లోనవుతోంది పార్టీ సర్కిల్. దీపావళి పండుగ సందర్భంగా వెల్లువెత్తుతున్న ..దీవాళి బాష్ పేరిట సాగే పార్టీలతో ‘రిచ్’ సిటీ హోరెత్తుతోంది. పండుగ అనుభూతులను రెట్టింపు చేస్తూ పేజ్ త్రీ సర్కిల్ శభాష్ అనే అభినందనలు అందుకుంటోంది. కలర్ఫుల్... క్లిక్స్ గోల్డ్ కలర్ దీపావళ పండుగకు థీమ్ కలర్గా చెబుతారు. అందుకే ఇంట్లో అమర్చే వంట పాత్రలతో సహా గోల్డ్, కాపర్, సిల్వర్ లోహాలతో కళ్ల ముందు మెరుస్తాయి. ప్లాస్టిక్ అలంకరణ వస్తువులకు ఈ రంగులు పూయడం లేదా సింపుల్గా ఒక పార్టీ షాప్కి వెళ్లి గోల్డ్/సిల్వర్ కలర్డ్ ప్లాస్టిక్ కట్లరీని కొనుగోలు చేయడం చేస్తారు. కొన్ని ఫొటోలైనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకపోతే నువ్వు పార్టీకి అసలు వెళ్లినట్టు ఏంటి ఆధారం? అందుకే ఈ బాష్లలో సెల్ఫీ కార్నర్స్, ఫొటో బూత్స్ తప్పనిసరిగా మారాయి. దీనిలో క్యాప్స్, హ్యాట్స్, సన్గ్లాసెస్, ఫన్నీ మెసేజెస్తో హెడ్ బ్యాండ్స్, సెల్ఫీ స్టిక్స్ తదితర యాక్సెసరీస్ అమరుస్తున్నారు. వావ్ అనిపించే డిజైన్డ్ పార్టీస్... సమయం సరిపోక వెళ్లడం కుదరదు గానీ లేకపోతే ఇన్వైట్ చేసిన దివాళీ బాష్లు అన్నింటికీ వెళ్లాలనిపిస్తుంది. అంత బాగా డిజైన్ చేస్తారవి. రెండ్రోజుల క్రితం ఒక పార్టీకి వెళ్లాను. ఎత్నిక్ డ్రెస్సింగ్స్, లైవ్ బ్యాండ్స్, క్రాకర్స్, డ్యాన్స్లు.. ఆ రిచ్నెస్..ఓహ్ అద్భుతంగా అనిపించింది. వేరే లోకంలో ఉన్నామన్నట్లు ఉంది. ఇవి ఏడాదిలో దీపావళికి మాత్రమే జరిగినా ఏడాది మొత్తం టాక్ ఆఫ్ ద టవున్ అవుతాయి. ...హేమంత్సిరి, ఫ్యాషన్ డిజైనర్ పార్టీకి రెడీ... దివాళి బాష్ ఎప్పుడూ మాకు స్పెషల్. మేమిచ్చే పార్టీస్, మేం అటెండయ్యే పార్టీస్తో ఈ వారమంతా సందడిగా గడచిపోతుంది. వ్యక్తిగతంగా కాకుండా ఫ్యామిలీస్తో కలిసిపోయే సందర్భం కావడంతో దీవాళి బాస్ మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది ... సుశీలా బొకాడియా, పేజ్త్రీ సెలబ్రిటీ హోమ్...థీమ్ పార్టీ... పండుగకు వారం రోజుల ముందుగానే సిటీలో ఈ బాష్ ఊపందుకుంటుంది. ఫ్యామిలీ గెట్ టు గెదర్కు అత్యంత అనువైన పండుగ కావడం, దీనికి తోడు ఇది ఎవరి నివాసంలో వారు ఆతిథ్యమివ్వడతో సంపూర్ణమైన హోమ్లీ పార్టీగా జరుగుతుంది. ఈ పార్టీలకు డెకార్ చాలా కీలకం. క్లాసిక్ ఫ్లవర్ లైట్ డెకార్ నుంచి, ద్వార బంధాలకు పూల దండలు తగిలించడం ఇంట్లో నలుమూలలా దీపాలు అమర్చడం, దీపపు ఆకారంలో ఉండే క్యాండిల్స్ పార్టీకి వింతశోభను అద్దుతాయి. వంటి అలంకరణలతో ఇంటింటా ఫెస్టివల్ శోభ పురివిప్పుతుంది. మ్యాజిక్ స్వీట్స్... మ్యూజిక్ హిట్స్ స్వీట్స్ లేని పండుగ ఉండదు. అసలు దీపావళి అంటేనే మిఠాయిల పండుగ.. విభిన్న రకాల రుచులు ఈ పండుగ పార్టీస్లో వండి వడ్డిస్తారు. కండెన్స్డ్ మిల్క్, కోకోనట్ లాడూస్, షాహి తుక్డా, ఖీర్ వంటివి చవులూరిస్తుంటాయి. మొత్తం కుటుంబాన్ని, బంధుమిత్రులను ఒక దరికి చేర్చే పార్టీలో సహజంగానే రకరకాల వినోద భరిత కార్యక్రమాలు ఉంటాయి. అం త్యాక్షరి, పాస్ ఇన్ ది పార్సిల్ వంటి ఆటలు పాపులరై ఇప్పటికీ పార్టీలకు ఊపునిస్తున్నాయి. -
తిరుమలలో ఈ నెల విశేష పర్వదినాలు
సాక్షి, తిరుమల : అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు సంతరించుకున్నాయి. ఇటీవల నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. కాగా సోమవారంతో బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆక్టోబర్ మాసంలో వచ్చే విశేష పర్వదినాలతో తిరుమల మరోసారి ముస్తాబవుతోంది. వాటి వివరాలు.. తేది విశిష్టత అక్టోబరు 13 పౌర్ణమి గరుడసేవ అక్టోబరు 21 శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం అక్టోబరు 26 నరకచతుర్దశి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవ ఆరంభం అక్టోబరు 27 దీపావళి ఆస్థానం, కేదారగౌరి వత్రము అక్టోబరు 30 శ్రీ తిరుమలనంబి శాత్తుమొర అక్టోబరు 31 నాగుల చవితి -
ష్ష్ష్... సౌండ్ చెయ్యొద్దు పొల్యూషన్ కూడా!
వార్నింగ్ కాదు. రిక్వెస్ట్ మాత్రమే! ఎందుకీ రిక్వెస్ట్... మరో వారం రోజుల్లో దీపావళి కదా! పండక్కి సౌండ్ పొల్యూషన్ వద్దంటూ శ్రుతీహాసన్, రకుల్ప్రీత్ సింగ్, పూజా హెగ్డేలు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘క్రాకర్స్ కాల్చడంలో సరదా ఏముంటుంది?’ అని శ్రుతీ ప్రశ్నిస్తుంటే... ‘దీపావళి పేరుతో చేసే సౌండ్ పొల్యూషన్ వల్ల చిన్న పిల్లలు, పెద్దలు, మూగ జీవాలకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా?’ అనడుగుతున్నారు రకుల్. ‘దీపావళి అంటే... ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ నాయిస్’ అనేది పూజ వాయిస్. చిన్నప్పుడు దీపావళికి శ్రుతి క్రాకర్స్ కాల్చేవారట. కానీ, పెద్దయ్యాక క్రాకర్స్ సౌండ్ పొల్యూషన్ నచ్చలేదని ఆమె పేర్కొన్నారు. ‘‘దీపావళి స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకోవడానికి క్రాకర్స్ అవసరం లేదు. కుటుంబమంతా కలసి సరదాగా ఉండొచ్చు. ఇంకా బోలెడు దీపావళి ట్రెడిషన్స్ మనకి ఉన్నాయి’’ అన్నారు శ్రుతి.పదవ తరగతిలో ఉన్నప్పుడు బుజ్జి కుక్కపిల్లను రకుల్ ఇంటికి తెచ్చుకున్నారట! దీపావళి క్రాకర్స్ సౌండ్కి బుజ్జి కుక్కపిల్ల పడే ఇబ్బంది చూసి నాలో మార్పు వచ్చిందని రకుల్ పేర్కొన్నారు . ‘‘పండగ అంటే... మన చుట్టుపక్కల్ని చెత్తా చెదారాలతో నింపేసి, సౌండ్ చేయడం కాదు. ఎవరూ అలా చేయమని చెప్పరు. క్రాకర్స్ కొనే డబ్బులతో ఎన్నో మంచి పనులు చెయ్యొచ్చు. కష్టాల్లో ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. అదే అసలైన దీపావళి’’ అన్నారు రకుల్.‘‘ఎనిమిదేళ్ల వయసు నుంచి క్రాకర్స్ కాల్చడం మానేశా. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవల్సింది ఏంటంటే... మనం పీల్చే గాలినే దీపావళి పేరుతో క్రాకర్స్ కాల్చి, కలుషితం చేసేస్తున్నాం. దీపాల పండక్కి నేను దీపాలే వెలిగిస్తా, క్రాకర్స్ కాల్చను. మనమంతా నో–క్రాకర్స్ దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం’’ అని పూజా హెగ్డే ప్రజలందర్నీ కోరారు. -
ఆ ‘రాక్షస’ వధతోనే నిత్య దీపావళి
సమకాలీనం కాలుష్యమైనా, మహిళలపై నేరాలయినా, సంపద ప్రదర్శనాతత్వమైనా... ప్రభుత్వం చట్టా నికి లోబడి చర్యలు తీసుకుంటుంది. అలా ఒత్తిడి తీసుకురావడం పౌరుల బాధ్యత. అదొక్కటే సరిపోదు. ఎవరికి వారు, ఇందుకు కారణమవుతున్న తమలోని రాక్షసుడ్ని వెతికి, తుదముట్టించాలి. స్వార్థంతో పర్యావరణానికి భంగం కలిగించేలా భూమిని చెరబట్టిన హిరణ్యాక్ష హననం జరగాలి. పరకాంతను చెడు దృష్టితో చూసే కీచక సంహారం జరగాలి. సంపద ప్రదర్శనాతత్వం మితిమీరిన రావణాసుర హతం జరగాలి. అప్పుడే నిత్య దీపావళి. దీపావళి అంటేనే వెలుగుల వెల్లువ. ఆనందం వెల్లివిరిసే సంబురాల పండుగ. చీకటిపై వెలుగు, చెడుపైన మంచి, అజ్ఞానమ్మీద జ్ఞానం సాధించిన గెలుపునకు ప్రతీకగా జరుపుకునే విజయానందం. ఇది ఇంటింటా, ఇంటిల్లి పాదీ జరుపుకొనే విజయోత్సవ వేడుక! భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతీ, సంప్రదాయాల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జగతిని పట్టి పీడిస్తున్న నరకాసురుడ్ని వధించిన రోజు నరకచతుర్థి అని, తర్వాతి రోజు వేడుకే దీపావళి పండుగని పురాణాలు చెబుతున్నాయి. రాక్షసరాజు రావణాసురుడ్ని వధించి శ్రీరాముడు లంక నుంచి సీతా–లక్ష్మణ సమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చిన సంబరమే దీపావళి అంటారు. పద్మపురాణం, స్కంధ పురాణంలో ఇటువంటి పలు ప్రస్తావనలున్నాయి. అది ఏ రూపంలో అయితేనేం! రాక్షస (చెడు) సంహారం జరిగి, లక్ష్య శుద్ధితో శ్రమించిన (మంచి) వారికి విజయం చేకూరితే అదే దీపావళి. ఇలా ఎంత కాలం పురాణ గాథలు చెబుతూ–వింటూ గడుపుతాం? మనం కూడా చెడుపై మంచిని గెలిపించి విజయోత్సవ వేడు కగా దీపావళి జరుపుకోవాలనే భావన ఆధునిక తరానికి రావడం సహజం! మరిప్పుడు రాక్షసులు లేరు కదా! అనే సందేహమూ రావచ్చు. ఎందుకు లేరు! రాక్షసులు ఇప్పుడూ ఉన్నారు. కాకపోతే... వేరెక్కడో దూరంగా కాదు, మనలోనే ఉన్నారు. అందుకు, విజ్ఞులు ఒక మంచి పరిణామ క్రమాన్ని చెబుతారు. యుగ క్రమంలో... మొదటిదైన కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల సాగింది కనుక అంతా మంచివారే తప్ప రాక్షసులు లేరు. తర్వాతిదైన త్రేతా యుగంలో రావణాది రాక్షసులు వేరు, దేవత్వా స్వభావంతో రాముడి వంటి నరులు, ఆంజనేయుడి వంటి వానరులు వేరు వేరు జాతులుగా ఉన్నారు. ఆ తర్వాతి ద్వాపర యుగానికి వచ్చేసరికి మనుషుల్లోనే దైవాంశ కలిగిన కృష్ణుడు, వ్యాసుడు, భీష్ముడు వంటి వారు, రాక్షసాంశ కలిగిన కంసుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు వంటి వారూ ఉన్నారు. ఇక చివరిదైన ప్రస్తుత కలియుగంలో పరిస్థితి మరింతగా మారింది. ఒక మనిషిలోనే దైవ స్వభావం, రాక్షస స్వభావం వేర్వేరు పాళ్లలో ఉన్నాయి. ఆయా స్వభావాల హెచ్చు తగ్గుల్ని బట్టి మంచివారు, చెడ్డవారు. అందుకే స్వామీ వివేకా నందుడంటారు, ‘విద్య అంటే వేరేదో కాదు, మనిషిలో ఉండే దైవత్వాన్ని వివిధ రూపాల్లో వెలికితీయడమే’ అని. మరో రకంగా, మనిషిలోని రాక్షస త్వాన్ని సంహరించడమే నిత్యదీపావళి అనుకోవచ్చు. ఎంపిక చేసిన లక్ష్యా లపై దాడుల (సర్జికల్ స్రై్టక్స్)తో ఆ రాక్షస సంహారమే జరగాలిప్పుడు. ఇది కొత్త మాట కాదు... కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలని మనలోనే ఉన్న ఆరుగురు అంతశ్శత్రువులని, వాటిని జయించాలన్ని ఆర్ష సంస్కృతి చెబుతోంది. కాలుష్యకాసారంలో బతుకు దుర్భరం దేశంలోని మహానగరాల్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంటే ఆ ప్రభావం హైదరాబాద్ మీద కూడా తక్కువేం లేదు. తీవ్రంగా ఈ సమస్య నెదుర్కొంటున్న నాలుగో మెట్రో నగరంగా రికార్డులకెక్కింది. ఢిల్లీ, కోల్కతా, ముంబాయి తర్వాత స్థానం మనదే! వాహనాల పొగ, దుమ్ము–దూళీ, పరి శ్రమలు వెలువరించే వ్యర్థాలు కలిసి ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీనికి తోడు రోజురోజుకు చెట్టు చేమలు, మొత్తంగా హరితమే హరించిపోతూ నగరం కాంక్రీట్ వనంగా విస్తరిస్తోంది. ఆక్సిజన్–ఆక్సిజనేతర వాయువుల నిష్పత్తి మారి ప్రమాదకరంగా తయారవుతోంది. పదేళ్ల కాలంలో ఎన్నో రెట్లు పెరిగిన వాహనాల సంఖ్య, కాలం చెల్లిన వాహనాలు నిరాటంకంగా విడుదల చేసే పొగ వల్ల కూడా వాయు కాలుష్యం హెచ్చుతోంది. ఐటీ రంగం విస్తరి స్తున్న నగరం కావడంతో పెద్ద సంఖ్యలో వాడే ఎలక్ట్రిక్–ఎలక్ట్రానిక్ ఉపకర ణాలు, ఏసీల వినియోగం నగరం సగటు ఉష్ణతాపాన్నే కాక కాలుష్యాన్నీ పెంచుతోందని ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ (ఐజేఐఆర్సెట్) జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. ఫలితంగా ఛాతీ, శ్వాస సంబంధ వ్యాధులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి అంతకన్నా ప్రమాదకరంగా ముదిరే పరిస్థితులున్నాయి. నగర వాసులు మైగ్రేన్ వంటి తలనొప్పులు, సొరియాసిస్ వంటి చర్మవ్యాధులు, ఆస్తమా, క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్య నివారణకు ప్రభుత్వాలు నిర్దిష్ట కార్యాచరణను ఆమలు పరచడమే కాదు, వ్యక్తులుగా అందరూ తమ వంతు పాత్ర నిర్వహించాల్సి ఉంది. ఉదాహ రణకు దీపావళి వేడుకల్నే తీసుకుందాం, విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యం జరుగుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. కిందటి ఏడాది లెక్కలు చూస్తే, బాణాసంచాతో వాయు కాలుష్యానికి లెక్కేలేదు. సగటున 96 నుంచి 105 డెసిబుల్స్ వరకు శబ్దకాలుష్యం వెలువడింది. దీంతో చిన్నారులు, వృద్ధులు, నవజాత శిశువులు, పెంపుడు జంతువులు ఎన్ని అవస్థల పాల య్యారో! సాధారణంగా 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వీరిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, నవజాత శిశువులు వినికిడి శక్తి కోల్పోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తడం తథ్యం. కుక్క, పిల్లి వంటివి 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయంటున్నారు. వాటి కర్ణభేరీ బద్దలయ్యే ప్రమాదమూ ఉంది. గాయాలు సమీప భవిష్యత్లో వాటి మనుగడకు ముప్పుగా పరిణమిస్తాయి. టపాసులు కాల్చినపుడు వెలువడే పొగలో సల్ఫర్డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ధూళి రేణువులు రేగి పర్యా వరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ముఖ్యంగా సల్ఫర్ డై ఆక్సైడ్ క్యూబిక్ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ టపాసులు అధికంగా కాల్చినపుడు ఈ స్థాయి 450–500 మైక్రోగ్రాములకు చేరుతుంది. దీంతోlఊపిరితిత్తులకు హాని. బ్రాంకైటిస్ (తీవ్రమైన దగ్గు) తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఇక నైట్రోజన్ ఆక్సైడ్ పెరుగుదల కూడా ఇదే స్థాయిలో ఉంటుంది. దీంతో కళ్లు, ముక్కు మండుతాయి. శ్వాసకోశాలకు తీవ్ర చికాకు కలుగుతుంది. ఇక ధూళి రేణువులు (ఎస్పీఎం) క్యూబిక్ మీటరు గాలిలో 100 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, వీటి మొతాదు క్యూబిక్ మీటరు గాలిలో 300 మైక్రో గ్రాములకు మించే పరిస్థితి ఉండటం వల్ల తీవ్ర మైన శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులంటున్నారు. మహిళలంటే మర్యాదలేనితనం చదవేస్తే ఉన్న మతి పోయిందని మొరటు సామెత! దీన్ని నిజం చేస్తున్నామా అన్నట్టుంటోంది మహిళల పట్ల మగవారి వైఖరి చూస్తుంటే. ఒకప్పటితో పోల్చి చూస్తే ఉన్నత చదువులు, డిగ్రీలు, సగటు విద్యార్హతలు ఈ మధ్య కాలంలో రమారమి పెరిగాయి. కానీ, మహిళల పట్ల మగవాళ్లు వ్యవహరి స్తున్నతీరు, అత్యాచారాలతో సహా జరుగుతున్న నేరాలు, నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తగ్గకపోగా పెరగడం దీన్నే సూచిస్తోంది. విద్యార్హతలతో నిమిత్తం లేకుండా బాగా చదువు కున్న వారు కూడా మహిళల్ని న్యూనతపరిచే, అవమానించే, వేధించే, హింసించే దురాగతాలు ఈ దుస్థితికి అద్దం పడుతున్నాయి. గృహహింస (నిరోధక) చట్టం, నిర్భయ చట్టం అమల్లోకి వచ్చాక కూడా సదరు నేరాలు, నేర స్వభావం తగ్గటం లేదు. జాతీయ నేర నమోదు బ్యూరో గణాంకాలు విస్మయం కలిగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ నేర గణాంకాల్లో అగ్ర శ్రేణిలో ఉండటం ఆందోళనకరం. ఇది ప్రధానంగా వ్యక్తి ఆలోచనా ధోరణి, వ్యక్తిత్వం, స్వభావానికి సంబంధించిన అంశం. 2015లో దేశవ్యాప్తంగా 3.27 లక్షల కేసులు నమోదు కాగా ఏపీలో 15,931, తెలంగాణలో 15,135 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మహిళా జనా భాకు ఎంత మందికి ఇలాంటి నేరాలు అని లెక్కగట్టే క్రైమ్ రేటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థితిలో ఉంది. ఢిల్లీ, అస్సాం, రాజస్థాన్ తర్వాతి స్థానం తెలంగాణ (83.1), ఏపీ (62.3)లదే అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి మారాలి! సంపద గర్వంతో ప్రదర్శనాతత్వం సమాజంలో ఆర్థిక అసమానతలే అనర్థమంటే, సంపద గర్వం, ప్రదర్శ నాతత్వం కొందరిలో మితిమీరుతున్న వైనం మరో అనర్థం. ఈ పోకడ ఇటీ వల కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అక్రమార్జన వల్ల తేలిగ్గా వచ్చే డబ్బు వారినిలా ప్రోత్సహిస్తుండవచ్చని అనిపిస్తోంది. ముఖ్యంగా పండుగలు, పబ్బాలు, పెళ్లి ఇతర సాంఘిక వేడుకల్లో ఈ ప్రదర్శనా∙తత్వం తారస్థాయికి చేరడం విస్మయకరం, కొన్ని సందర్భాల్లో జుగుప్సాకరం కూడా. తమ సంపదను బహిరంగ ప్రదర్శనకు పెట్టడం ధనగర్వం, ప్రదర్శనతత్వం తప్ప మరోటి కాదని, ఇది ధనిక–పేద అంతరాల్ని ఎలుగెత్తి చాటే కవ్వింపు చర్య అని సామాజిక శాస్త్రవేత్తలంటున్నారు. సినిమా సెట్టింగుల ఆర్భాటంతో ఒక్కో పెళ్లికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న వారున్నారు. కర్ణాటక మాజీ మంత్రి ఒకరు తమ కుమార్తె వేడుకకు చేస్తున్న ఆర్భాటాన్ని చూసి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కె. ఆర్. రమేష్కుమార్ నివ్వెరపోయారు. పెళ్లి వేడుకలను భారీ హంగు, ఆర్భాటంతో జరిపించి సంపదను ప్రదర్శించడాన్ని నియం త్రించాలంటూ ఆయనే ఇటీవల ఆ రాష్ట్ర శాసనసభలో ప్రైవేటు మెంబరు బిల్లును తీసుకువచ్చారు. ఎంపిక చేసిన వారికి విమాన టిక్కెట్లు, స్టార్ హోటళ్లు, లగ్జరీ కార్లు ఏర్పాటు చేసే ఖరీదైన ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ వేడుకలు జరుపుతున్న సంపన్నులూ ఉన్నారు. పుట్టినరోజు, పిల్లలకి పట్టు వస్త్రాలు కట్టివ్వడం వంటి చిన్న చిన్న వేడుకలకూ భారీ ఆర్భాటాలు జరిపించే «ధోరణీ పెరిగిపోతోంది. అన్నీ కలిగిన వారిని చూసి ఆర్థిక స్తోమత లేకపోయినా కొందరు కుహనా ప్రతిష్టకు పోయి, ఇటువంటి ఆర్భాటాలకు పోయి చతికిల బడతున్నవారు పెరుగుతున్నారు. ఇలాంటి వేడుకల్లో ఆహారంతో సహా అన్నీ వృధాయే. కవి కాళోజీ అన్నట్టు ‘అన్నపు రాశులు ఒకవైపు ఆకలి మంటలు ఒకవైపు’ అన్న తరహాలో ఈ నిర్లక్ష్యపు వృధాలు ఆర్థిక అసమానతల్ని ఎత్తి చూపుతాయి. పేదల్ని రెచ్చగొట్టే ఇటువంటి చర్యలే సామాజిక అశాంతికి దారితీస్తాయి.. రాక్షస సంహారమే తరువాయి కాలుష్యమైనా, మహిళలపై నేరాలయినా, సంపద ప్రదర్శన తత్వమైనా... మరో అవాంఛనీయ పరిణామమేదైనా ప్రభుత్వం చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటుంది. అలా ఒత్తిడి తీసుకురావడం సగటు పౌరుల బాధ్యత. అదొ క్కటే సరిపోదు. వీటిని నిలువరించడంలో వ్యక్తులుగా ఎవరేం చేయవచ్చ న్నది ఆలోచించాలి. ఎవరికి వారు, ఇందుకు కారణమవుతున్న తమలోని రాక్షసుడ్ని వెతకాలి. ఉంటే, తుదముట్టించాలి. స్వార్థంతో పర్యావరణానికి భంగం కలిగించేలా భూమిని చెరబట్టిన ‘హిరణ్యాక్ష’ హననం జరగాలి. పర కాంతను చెడుదృష్టితో చూసే ‘కీచక’ సంహారం జరగాలి. సంపద ప్రదర్శనా తత్వం బలపడ్డ ‘రావణ’ హతం జరగాలి. అదే చీకటిపై వెలుగు గెలుపు! అప్పుడే నిజమైన దీపావళి, నిత్యదీపావళి. (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈ మెయిల్: dileepreddy@sakshi.com ) -
సింగరేణి ఉద్యోగులకు బోనస్ పంపిణీ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ మరింత లాభాలు గడించడంతో పాటు అభివృద్ధి పథంలో పయనించాలంటే నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ముందుకు పోవాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు కింద రూ.310 కోట్ల దీపావళి బోనస్ను సింగరేణి ఉద్యోగులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని బుధవారం నగరంలోని సింగరేణి భవనంలో ప్రారంభించారు. సింగరేణి భవన్లోని కొందరు ఉద్యోగులకు బోనస్ పే స్లిప్లను పంపిణీ చేశారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల వద్ద దీపావళి బోనస్ పంపిణీ చేస్తున్నామన్నామని ఆయన తెలిపారు. గతేడాది రూ.48,500 బోనస్ చెల్లిస్తే ఈ ఏడాది రూ.54 వేలకు పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు మనోహరరావు, పవిత్రన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు బుధవారం రూ.310 కోట్ల దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ మానవ వనరుల విభాగం జనరల్ మేనేజర్ ఎం.ఆనందరావు ఓ ప్రకటనలో తెలిపారు. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్గా రూ.54 వేలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. 2015–16లో అండర్ గ్రౌండ్ ఉద్యోగులు 190 మస్టర్లు, సర్ఫేస్ ఉద్యోగులు 240 మస్టర్లు కలిగి ఉంటేనే చెల్లింపులు జరుపుతామని, అంతకు తక్కువైతే మస్టర్ల ప్రాతిపదికన చెల్లిస్తామని, 30 కంటే తక్కువ మస్టర్లు ఉంటే బోనస్కు అనర్హులని పేర్కొన్నారు. సంస్థ ఆర్జించిన లాభాల్లో 23% (రూ.245.21 కోట్లు) సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దసరా సందర్భంగా ఈ నెల 7న ఉద్యోగులకు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. -
కామెడీ క్రాకర్స్
-
దీపావళికి 9,088 ప్రత్యేక బస్సులు
దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్లే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం 9,088 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈనెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి :హిందువులతోపాటు భారతీయులంతా సందడిగా జరుపుకునే దీపావళి పండుగ అంటే అందరికీ ఆసక్తే. ముఖ్యంగా తమిళనాడులో దీపావళి పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కొత్తగా పెళ్లైన వధూవరులు తొలివార్షికోత్సవాన్ని ‘తల దీపావళి’గా పిలుచుకుని వైభవంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే పండుగ కావడంతో ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగ స్థానాలను వదిలి స్వస్థలాకు చేరుకునేందుకు ఉరకలేస్తుంటారు. సహజంగా ఒక్కసారిగా బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతాయి. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం 9,088 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల ఏర్పాట్ల పరిశీలనపై ప్రభుత్వం ఒక కమిటీని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలో కమిటీగా ఏర్పడిన మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడ్డపాడి కే.పళనిస్వామి, సెంథిల్ బాలాజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరులు శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు. గత ఏడాది చేసిన ఏర్పాట్ల స్థాయిలోనే ఈ ఏడాది నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్రం లోని అన్ని జిల్లా కేంద్రాలను కలుపుతూ ఈ నెల 17వ తేదీన 501 ప్రత్యేక బస్సులు, 18వ తేదీన 501 ప్రత్యేక బస్సులు, 19వ తేదీన 699, 20వ తేదీన 1,400, 21న 1,652 బస్సుల లెక్కన మొత్తం 4,753 ప్రత్యేక సర్వీసులను నడుపాలని కమిటీలో తీర్మానించారు. అలాగే చెన్నై మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు 17వ తేదీన 499, 18న 601, 19న 700, 20న 1,234, 21న 1,301 బస్సులు నడపనున్నారు. ఈ లెక్కన మొత్తం 4,335 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. అలాగే దీపావళి పండుగ ముగిసిన తరువాత తిరిగి తమ స్థానాలకు చేరుకునేందుకు ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపాలని తీర్మానించారు. చెన్నై నగరంలో సైతం 200 అదనపు సిటీ బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. దీపావళి డిమాండ్ను అడ్డుపెట్టుకుని అధిక వసూళ్లకు పాల్పడిన వారిపై 044-24794709 ఫోన్కు ఫిర్యాదు చేయవచ్చని ప్రకటించారు. చార్జీల దోపిడీ దీపావళి రద్దీని ప్రైవేటు, ఆమ్ని బస్సు ఆపరేటర్లు ఇష్టారాజ్యం సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టికెట్పై 20 నుంచి 50 శాతం వరకు పెంచేశారు. ఉదాహరణకు చెన్నై నుంచి కోవైకికి సాధారణ బస్సు చార్జీ రూ.715, ఏసీ బస్సులో రూ.880 వసూలు చేయాల్సి ఉంది. దీపావళి కావడంతో సాధారణ బస్సు సర్వీసు టికెట్ను రూ.1000 నుంచి రూ.1,199లకు పెంచేశారు. పైగా పెంచిన అక్రమ మొత్తాన్ని ధైర్యంగా ఆన్లైన్లోనే పొందుపరుస్తున్నారు. మిగిలిన ప్రాంతాలకు వె ళ్లే బస్సు సర్వీసుల్లోనూ ఇదే పరిస్థితి. అన్లైన్ ద్వారా బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నా రవాణాశాఖ నుంచి అడిగేవారే లేరని ప్రయాణికులు వాపోతున్నారు.