Legendary Actor
-
వెండితెరకు మిస్టర్ భారత్
‘ఈ దేశం నీకేమిచ్చిందనేది కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అనేది చూడాలి’ అన్నారు నెహ్రూ. ‘జై జవాన్ జై కిసాన్ ’ అన్నారు లాల్బహదూర్ శాస్త్రి. ఈ దేశానికి ప్రధానులైన వారు ప్రజలను దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటగా అందుకున్న హీరో మనోజ్ కుమార్ (Manoj Kumar). సినిమాల్లో తన పాత్రకు ‘భారత్’ అని పేరు పెట్టుకుని అందరి చేత ‘మిస్టర్ భారత్’ అనిపించుకున్నాడు. శుక్రవారం మరణించిన ఈ దేశభక్త నటుడికి నివాళి1974.‘రోటీ కపడా ఔర్ మకాన్’ రిలీజైంది. జనం మొదటిరోజు మొదటి ఆటకు వెళ్లారు. ఫస్ట్సీన్... జేబులో డిగ్రీ పెట్టుకుని రోడ్ల మీద బేకార్గా తిరుగుతున్న హీరో ఒకచోట ఆగిపోయాడు. కారణం... పోలీస్ ఒకతనిపై తుపాకీ ఎక్కుపెట్టి ‘చెప్పు... ఎవరు నువ్వు’ అని అడుగుతున్నాడు. ‘నేనా... ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ని’... ‘ఏం దొంగిలించుకుని వెళుతున్నావ్?’ ‘చూస్తావా...’ కోటు చాటున ఉన్న వస్తువు చూపించాడు. రొట్టె ముక్క.ఈ సీన్తోనే ఆనాటికి దేశంలో పేరుకొని పోయిన ఆకలిని, నిరుద్యోగాన్ని చూపించి ప్రేక్షకుల గుండెలను గట్టిగా చరుస్తాడు మనోజ్ కుమార్. ఆ తర్వాతి సీను కప్పుకోవడానికి గుడ్డలేని పేద స్త్రీలు... నిలువ నీడలేని నిరుపేద కూలివాళ్లు. దర్శకుడు తీసిన కథ తమ కష్టాల గురించే అని జనం అర్థం చేసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది.‘సినిమా అనేది సందేశాలివ్వడానికి కాదు అని కొందరు అంటారు... అనుకుంటారు. కాని నేను తీసేది మాత్రం ఏదో ఒక సందేశం (Message) ఇవ్వడానికి. సమాజం నుంచి ఎంతో పొందాం... బదులుగా మంచి మాట చెప్పడానికి ఏమిటి కష్టం’ అంటాడు మనోజ్ కుమార్.బాధ చూసినవాడు బహుశా బాధ్యతగా ఉంటాడు. పదేళ్ల వయసులో ఉండగా దేశ విభజన చూశాడు మనోజ్ కుమార్. నేటి పాకిస్తాన్లో ఉన్నా అబ్తాబాద్ నుంచి అతడి కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. రెఫ్యూజీ క్యాంప్లో ఉంటూ చదువుకున్నాడు. ఆ కష్టాలను మర్చిపోవడానికి అప్పుడప్పుడు మేనమామ వచ్చి సినిమాకు తీసుకెళ్లేవాడు. పన్నెండేళ్ల మనోజ్ చూసిన మొదటి సినిమా ‘జుగ్ను’. ఇందులో దిలీప్ కుమార్ హీరో. సినిమా చివరలో చనిపోతాడు. తర్వాత మనోజ్ మరో సినిమా చూశాడు. ‘షహీద్’. ఇందులో కూడా దిలీప్ కుమార్ హీరో. సినిమాలో చనిపోతాడు. మనోజ్ చాలా విస్మయం చెంది ఇంటికొచ్చి తల్లిని అడిగాడు ‘అమ్మా.. ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు?’. ‘ఒకసారే’. ‘మరి రెండుసార్లు చనిపోతే?’... ‘అలాంటి వాళ్లు దేవదూతలై ఉంటారు’ అంది. ‘అంటే సినిమా హీరోకు మరణం లేదన్నమాట. నేను హీరోను అవుతాను. దిలీప్ కుమార్లాంటి హీరో’ అనుకున్నాడు మనోజ్ కుమార్. అంతే కాదు దిలీప్ కుమార్ నటించిన ‘షబ్నమ్’ చూసి అందులో దిలీప్ పేరు ‘మనోజ్’ అని ఉంటే ‘నేను పెద్దయ్యి హీరో అయ్యాక ఆ పేరే పెట్టుకుంటాను’ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే హీరో అయ్యాడు. అదే పేరుతో విఖ్యాతం అయ్యాడు. ఎంతగా అంటే అతని అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి (Harikrishna Giri Goswami) అని ఎవరికీ తెలియనంత!ఢిల్లీ నుంచి బాంబే వచ్చి సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు మనోజ్ కుమార్. వాళ్ల నాన్న కవి. ఇతనికి కూడా రాయడం వచ్చింది. కొన్నాళ్లు ఘోస్ట్ రైటర్గా పని చేశాడు. సినిమాల్లో ‘ఎక్స్ట్రా’గా కూడా కనిపించాడు. దిలీప్ కుమార్ను ఇమిటేట్ చేస్తూ ఇతను చేస్తున్న నటన ఖరీదైన దిలీప్ కుమార్ను బుక్ చేసుకోలేకపోయేవారిని ఆకర్షించింది. మెల్లగా అవకాశాలు వచ్చాయి. 1960లో వచ్చిన ‘కాంచ్ కీ గుడియా’తో తొలిసారి హీరోగా కనిపించాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది. మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో హీరో అవకాశాలు పొందడానికి డింకీలు కొడుతున్న ధర్మేంద్ర, శశి కపూర్లతో దోస్తీ కట్టి ఎక్కే స్టూడియో దిగే స్టూడియోగా ఉండేవాడు. ముగ్గురి జాతకం బాగుంది... ముగ్గురూ పెద్ద హీరోలయ్యారు. కాని మిగిలిన ఇద్దరి కంటే మనోజ్ ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శించాడు. నటుడు, రచయిత, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు... అన్నింటికి మించి దేశభక్తి అనే అంశాన్ని సినిమాకు ఫార్ములాగా మార్చగలిగిన మేధావి అయ్యాడు.పెద్ద హీరోల రొమాంటిక్ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో డాన్స్ ఏ మాత్రం చేయలేని, లిమిటెడ్ బాడీ లాంగ్వేజ్ ఉన్న మనోజ్ కుమార్ సీరియస్ సబ్జెక్ట్స్ తనను గట్టెక్కిస్తాయని భావించాడు. భగత్సింగ్లాంటి కేరెక్టర్ తన ఇమేజ్ను పెంచుతుందని ఆ సినిమా చేయాలనుకున్నాడు. కాని భగత్ సింగ్కు సంబంధించి సినిమా తీసేంత సమాచారం ఆ రోజుల్లో లేదు. మనోజ్ కుమారే నాలుగేళ్లు తిరిగి సమాచారం సేకరించి కథ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 1965లో వచ్చిన ‘షహీద్’... భగత్ సింగ్ మీద వచ్చిన తొలి భారతీయ సినిమా. పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు ‘నర్గిస్దత్ జాతీయ పురస్కారం’ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సినిమాను చూశారు. మరుసటిరోజు టీకి ఆహ్వానించి మనోజ్తో ‘నేను జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చాను కదా. నువ్వు ఆ నినాదం పై సినిమా తీయరాదూ’ అని అడిగారు. దేశ ప్రధాని కోరిన కోరిక మనోజ్ను సూటిగా తాకింది. ఒక నోట్బుక్, పెన్ను పట్టుకుని ఢిల్లీలో రైలెక్కి ముంబైలో దిగేలోపు ‘ఉప్కార్’ స్క్రిప్ట్ రాశాడు. దర్శకుడు కావాలనే కోరిక అప్పటి వరకూ మనోజ్కు లేదు. కాని ప్రధానిని ఇంప్రెస్ చేసేలా సినిమా తీయాలంటే తానే దర్శకుడిగా మారక తప్పదు అనుకున్నాడు. అంటే ఒక ప్రధాని వల్ల దర్శకుడైన ఏకైన వ్యక్తి మనోజ్. భారతదేశంలో రైతుకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనికులకు బాసటగా నిలవాలని మనోజ్ తీసిన ‘ఉప్కార్’ అతణ్ణి అంబరంలో కూచోబెట్టింది. అవార్డుల రాసి పోసింది. ‘మేరే దేశ్ కీ ధర్తీ’ పాట జనాన్ని ఊపేసింది. సినిమాలో పాత్రకు పెట్టిన పేరు భారత్ (Bharat) మనోజ్ కుమార్ నిక్నేమ్ అయ్యింది. ‘మిస్టర్ భారత్’.పాశ్చాత్య సంస్కృతి చెడ్డది కాకపోయినా దానిని చెడ్డగా ఇమిటేట్ చేస్తున్న వారిపై ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ తీశాడు మనోజ్. మన సంస్కృతి మనకు ముఖ్యం అని చాటాడు. ఇక దేశంలో నిరుద్యోగం, యువకుల్లో పేరుకుపోతున్న అనిశ్చితి పై ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తీశాడు. నేటికీ ప్రభుత్వాలు ఈ మూడూ అందించడానికి ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. ఇక బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న చిన్న సంస్థానాల నుంచి వారిపై సాయుధ పోరాటం చేసిన వారి కథతో తీసిన భారీ చిత్రం ‘క్రాంతి’ సూపర్డూపర్ హిట్ అయ్యి భాష తెలియని ప్రాంతాల్లో కూడా పెద్ద కలెక్షన్లు రాబట్టింది. కార్మికుల సమస్యలతో ‘షోర్’ తీశాడు. చిరుద్యోగుల తరఫున ‘క్లర్క్’ తీశాడు. ఆకాంక్షలో స్వచ్ఛత, ప్రయత్నంలో శ్రమ ఉంటే విజయం వరిస్తుందనడానికి మనోజ్ కుమార్ జీవితం ఒక ఉదాహరణ. ఏ హీరోని అయితే చూసి హీరో అయ్యాడో ఆ దిలీప్ కుమార్తో ‘ఆద్మీ’లో నటించగలిగాడు మనోజ్ కుమార్. అదే దిలీప్ కుమార్ను డైరెక్ట్ చేసి ‘క్రాంతి’గా సూపర్హిట్ సాధించగలిగాడు. తగిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేక ముఖాన్ని చేతుల్లో దాచుకునే మేనరిజంతో ఫేమస్ అయిన మనోజ్ను అప్పుడప్పుడు కళాకారులు అదే మేనరిజంతో ఆటపట్టించడం కద్దు. షారూక్ ఖాన్ ‘ఓమ్ శాంతి ఓమ్’లో మనోజ్ను ఇమిటేట్ చేసి ఆయనకు కోపం తెప్పించాడు. పరువు నష్టం దావా వేసే వరకూ వ్యవహారం వెళ్లి తర్వాత సద్దుమణిగింది.చదవండి: అసహ్యించుకుంటూనే.. చివరికి నటినయ్యామనోజ్ కుమార్ నిజమైన దేశ ప్రేమికుడు. తన సినిమాల్లో అన్ని మతాల, వర్గాల వారి పాత్రలు సృష్టించి దేశమంటే మనుషులోయ్ అని చూపించినవాడు. నేటి హేట్ ఫిల్మ్స్ మధ్యలో మనోజ్ భావధార వెనుకబడ్డట్టు అనిపించిన అంతిమంగా గెలవబోయేది అదే. ఎందుకంటే విలువల వరుసలో మానవత్వం ముందు ఉండి తర్వాతే కదా మతం ఉండేది. సెల్యూట్ మిస్టర్ భారత్.హోమియోపతి డాక్టర్మనోజ్ కుమార్ మంచి హోమియోపతి డాక్టర్. అతనికి ఒకసారి చెంప మీద సర్పి వచ్చింది. అల్లోపతిలో ఎన్ని వైద్యాలు చేసినా పని చేయలేదు. నటుడికి ముఖాన సర్పి చాలా ప్రమాదం. ఆ సమయంలో మద్రాసులో షూటింగ్లో ఉండగా హోమియోపతిప్రాక్టీసు చేసే నటుడు అశోక్ కుమార్ (Ashok Kumar) ఒక డోస్ మందు వేశాడు. వారంలో సర్పి మాయమైంది. మనోజ్కు ఇది ఎంతగా ఆసక్తి రేపిందంటే అతడు హోమియోపతి డాక్టర్ల కంటే ఎక్కువగా హోమియోపతి (Homeopathy) చదివి ఆ వైద్యం ప్రాక్టీసు చేయడానికి సర్టిఫికెట్ పొందాడు. చాలామందికి హోమియోపతి వైద్యం చేశాడు.తెలుగు సినిమాల్లో మనోజ్ కుమార్మనోజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా తెలుగు సినిమాల్లో ఉన్నాడు. ఆయన తీసిన ‘ఉప్కార్’ తెలుగులో కృష్ణ హీరోగా ‘పాడిపంటలు’గా రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. మరో సూపర్హిట్ ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తెలుగులో శోభన్ బాబు హీరోగా ‘జీవన పోరాటం’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలో అమితాబ్ వేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్ చేశాడు. మనోజ్ కుమార్ నటించిన ‘ఓ కౌన్ థీ’ తెలుగులో జగ్గయ్య, జయలలిత కాంబినేషన్లో ‘ఆమె ఎవరు’గా వచ్చింది. ‘హిమాలయ్ కీ గోద్ మే’ శోభన్ బాబు హీరోగా ‘డాక్టర్ బాబు’గా వచ్చింది. ‘దస్ నంబరీ’ పెద్ద హిట్ కావడంతో ఎన్టీఆర్ (NTR) హీరోగా ‘కేడీ నంబర్ 1’ పేరుతో రీమేక్ చేశారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మగ మహారాజు’ సినిమాలో ఏడు రోజులు సైకిల్ తొక్కే సన్నివేశం ఒరిజినల్ మనోజ్ కుమార్ నటించిన ‘షోర్’లో ఉంది.మనోజ్ కుమార్ కన్నుమూతసుప్రసిద్ధ సినీనటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా వెన్నునొప్పితోనూ, వయసు సంబంధమైన ఇతర రుగ్మతలతోనూ బాధపడుతున్న మనోజ్కుమార్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. కునాల్, విశాల్. వీరిలో కునాల్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. దేశభక్తి సినిమాలతో ఖ్యాతి పొందిన మనోజ్కుమార్ను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. షహీద్, ఉప్కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి తదితర సూపర్హిట్ సినిమాలు మనోజ్ దర్శకత్వంలో రూపొందాయి. -
Superstar Krishna: లెజెండరీ యాక్టర్ కృష్ణ జయంతి.. ఈ రేర్ ఫొటోస్ చూశారా?
-
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
కైకాల మృతి.. స్వగ్రామంలో విషాదఛాయలు.. కంటతడి పెట్టిన స్నేహితులు
గుడ్లవల్లేరు: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ మరణవార్తతో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. కైకాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన స్నేహితులు, గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తరచూ తాను పుట్టి, పెరిగిన ఊరికి వచ్చేవారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సందడి చేసేవారని చిన్ననాటి స్నేహితులు కానూరి పూల రామకృష్ణారావు, బాడిగ ఫణిభూషణరావు, కానూరి రాజేంద్రప్రసాద్లు చెప్పారు. కౌతవరంలో తన తాత కంభంమెట్టు రామయ్య పేరిట ప్రభుత్వ ప్రసూతి కేంద్రం ఏర్పాటుకు కృషిచేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో సుమారు రూ.40లక్షల ప్రభుత్వ నిధులతో కొత్త ఆస్పత్రిని నిర్మించేలా చూశారు. కౌతవరం–చేవెండ్ర రోడ్డు నిర్మాణం కూడా ఆయన వల్లే సాధ్యమైందని గ్రామస్తులు తెలిపారు. -
కొత్త విలనీకి పెట్టింది పేరుగా...
హీరో గానూ, ప్రతినాయ కుడిగానూ 200కు పైగా సినిమాల్లో నటించి ఒక నటుడిగా భారతీయ సినీ చరిత్రలో తన స్థానాన్ని నిలుపుకొన్న నటుడు అజిత్. మొదట హీరోగా నటించి, తర్వాత ఆధునిక పాశ్చాత్య ఆహార్యంతో ఆయన విలన్ పాత్రలకు గొప్ప హుందాతనాన్ని తెచ్చాడు. ఆయన అసలు పేరు అజిత్ హమీద్ అలీఖాన్. 1922 జనవరి 27న గోలకొండలో జన్మించాడు. ఆయన తండ్రి బషీర్ అలీ ఖాన్ పఠాన్ నిజామ్ సైన్యంలోనూ, పరిపాలనా విభాగంలోనూ పని చేశాడు. అజిత్ వరంగల్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో... అతడి ప్రతిభను గుర్తించిన తోటి విద్యార్థులు, టీచర్లు ఆయనను సినిమాల్లో చేరమని ప్రోత్సహించడంతో అటువైపు ఆలోచిం చాడు. కానీ తండ్రికి అజిత్ సినిమాల్లో చేరడం అంతగా ఇష్టం ఉండేది కాదు. అయినా అజిత్ ఒక రోజు తన పుస్తకాలు అమ్మేసి 1943లో బొంబాయి రైలెక్కేశాడు. తన వెంట హైదరాబాద్కు చెందిన ప్రముఖ కవి షాహిద్ సిద్దికీ బోంబేలో ప్రముఖ దర్శకుడు రఫీక్ ఘజ్నవీకి రాసిన ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళాడు. బోంబే వెళ్ళగానే రఫీక్ ఘజ్నవీని కలిసి పరిచయం చేసు కున్నాడు అజిత్. కానీ అప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రఫీక్ తాను సినిమాలు తీయడం లేదని చెప్పడంతో ఇక ఎక్స్ట్రా వేశాలు వేస్తూ మూడేళ్లు గడిపాడు. 1946లో ఇన్ఫర్మేషన్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్మించే డాక్యుమెంటరీ సినిమాలల్లో పనిచేసే అవకాశం అతడికి వచ్చింది. ఒక్కో ఫిల్మ్కు అజిత్కు 125 రూపాయల పారితోషికం లభించేది. అలా అజిత్ వేస్తున్న పాత్రలు, అతనిలోని ప్రతిభ కొంతమంది సినీ నిర్మాతలు, దర్శకుల దృష్టిలో పడ్డాయి. క్రమంగా అవకాశాలు పెరిగిపోయాయి. 1946లో గీతా బాలి హీరోయిన్గా అజిత్ హీరోగా ‘షా–ఏ–మిశ్రా’ సినిమా రూపొందింది. అలా అజిత్ సినీ ప్రస్థానం హీరోగా మొదలయింది. తర్వాత హాతిమ్ తాయి (1947), పతంగా, జీవన్ సాథీ (1949), బేకసూర్ (1950) తదితర సినిమాలతో అజిత్ క్రమంగా నటుడిగా స్థిరపడ్డాడు. 1945లో వచ్చిన ‘నాస్తిక్’ సినిమా ఆర్థికంగా గొప్ప విజయం సాధించడంతో అజిత్ బొంబేలో నటుడిగానూ, అటు ఆర్థికంగానూ స్థిరపడ్డాడు. 1955లో విడుదల అయిన ‘మరైన్ డ్రైవ్’ సినిమా 50 వారాలు ఆడి సాధించిన విజయం అజిత్లో నూతనో త్సాహాన్ని నింపింది. అందులో బీనా రాయ్ హీరో యిన్. తర్వాత ‘26 జనవరి’ 1956లో విడుదల అయింది. అందులో నళినీ జయంత్ నాయకి. అజిత్ హీరోగా నళిని జహాంత్తోనే అధిక సినిమాల్లో నటించాడు. హిందీ సినిమా రంగానికి సంబంధించి నటన, నిర్మాణ, దర్శకత్వ తదితర అన్నీ రంగాల్లో ప్రధాన భూమికను పోషించిన ‘కపూర్’ వంశంతో అజిత్కు మంచి సంబంధాలు ఉండేవి. 1966లో రాజేంద్ర కుమార్ హీరోగా వచ్చిన ‘సూరజ్’లో విలన్గా నటించి తన నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు అజిత్. అప్పటికే విలన్లుగా పలువురు నటులు స్థిరపడి ఉన్నప్పటికీ అజిత్ తనదైన ప్రత్యేకతతో ‘ప్రిన్స్’ లాంటి పలు సినిమాలతో విలన్గా నిలదొక్కుకో గలిగాడు. 1973లో వచ్చిన ‘జంజీర్’ ఆయన విలనీ పాత్రలకు స్థిరమైన స్థానాన్ని ఇచ్చింది. అలా అజిత్ 57కు పైగా సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించాడు. అలా విలన్గా కెరీర్ కొనసాగుతూ ఉండగానే అజిత్ 1985లో సినిమాల్ని మానుకుని కుటుంబంతో సహా హైదరాబాద్ చేరుకున్నాడు. 1998 అక్టోబర్ 21న తన 76వ ఏట తాను అమితంగా ఇష్టపడే హైదరబాద్ నగరంలోనే తుది శ్వాస విడిచాడు. - వారాల ఆనంద్ సినీ విమర్శకుడు (‘దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్’ తరఫున అజిత్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా...) -
నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం
‘‘పండంటి కాపురం’ చిత్రంలో జయసుధ నా కూతురిగా నటించింది. ఆమెకి కూడా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు ఈ లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉంది’’ అని సీనియర్ నటి జమున అన్నారు. వీబీ ఎంటర్టైన్మెంట్స్పై ఆరేళ్లుగా బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు బొప్పన గత రెండేళ్లుగా వెండి తెర అవార్డులను కూడా అందిస్తున్నారు. ఈ ఏడాది జమునకు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్టు, జయసుధకు లెజెండరీ అవార్డుతో పాటు పలువురు కళాకారులకు అవార్డులను అందజేశారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘గతంలో ‘పండంటి కాపురం’లో జమునమ్మకు కూతురిగా నటించాను. నలభై ఏళ్ల తర్వాత ఆమె, నేను ఒకే వేదిక మీద కలిసి అవార్డును తీసుకోవడం గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘నాకు సపోర్ట్ అందిస్తున్న శతాబ్ధిటౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్కి ధన్యవాదాలు. వారు తోడుగా ఉన్నారు కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు విష్ణు బొప్పన. ‘‘నాకు ఆల్ రౌండర్ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాబూమోహన్. ‘‘బెస్ట్ డైలాగ్ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. ఫ్యామిలీ మూవీగా ‘సమ్మోహనం’ చిత్రానికి వీకే నరేశ్, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇషా రెబ్బా, ‘ఎఫ్ 2’కి కమెడియన్గా రఘుబాబు ఇలా పలువురు తారలకు అవార్డులను ప్రదానం చేశారు. -
అభినయ రుషి
నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించుకోవడం (రీఎన్వెంటింగ్). ఒక వ్యక్తితోనే ఒక పరిశ్రమ నిలబ డదుగానీ, ఆ వ్యక్తి లేకపోతే ఆ పరిశ్రమలో ఎప్పటికీ పూరించలేని ఒక ఖాళీ ఏర్పడవచ్చు. అక్కినేని లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇలాంటిదే. అక్కినేని జీవిత చరిత్ర, సినిమా చరిత్ర మనకు తెలిసిందే. ఆయనలా అధికంగా ఇంటర్వ్యూలు ఇచ్చినవారు, అసాధారణ జ్ఞాపకశక్తితో గతాన్ని అవలీలగా మనకు అందించిన వారు ఎవరూలేరు. తెలుగు సిని మారంగంలో, ఆమాటకొస్తే దక్షిణ భారత సినిమారంగంలో నటనకు ఉన్న అర్ధాన్నీ , రూపురేఖలనూ మార్చిన ఘనత ఆయనది. దక్షిణ ప్రాంతం సినిమాల్లో నాయకుల నటన నాటక రంగ అభినయానికి దగ్గరగా ఉన్న రోజులలో ఓవరాక్షన్ గొప్ప నటనగా చలామణి అవుతున్న కాలంలో అండర్ప్లే అంటే ఏమిటో చేసి చూపించిన ప్రతిభ అక్కినేనిది. నాటకరంగంలో నటనకూ, చలనచిత్ర నటనలో ఉన్న తేడాను బహుశా మొట్టమొదట గుర్తించిన నటుడు నాగేశ్వరరావుగారే. అక్కినేని సినీజీవితాన్ని విహంగవీక్షణం చేస్తే, పురా ణ పాత్రలు, జానపద నాయక పాత్రలతో సినీరంగ ప్రవే శం చేశారు. కానీ ఆ రెండూ నిజానికి ఆయనకు నప్పే పాత్రలు కావు. ఆ విషయాన్ని అందరికంటే ముందు గ్రహించింది బహుశా ఆయనే. పరిమితులు తెలుసునన్నంత మాత్రాన అక్కినేని సవాళ్లకు భయపడ్డారనికాదు. ఎలాంటి సవాలైనా స్వీకరిం చే సత్తా ఆయనకుంది. దేవదాసు పాత్ర ఒప్పుకోవడమే ఒక పెద్ద సవాలు. మిస్సమ్మలో తన ప్రధాన ప్రత్యర్థి ఎన్టీ రామారావు నాయకుడని తెలిసీ అప్రధాన హాస్య పాత్రను స్వీకరించడం మరో సవాలు. అన్నిటికంటే గొప్ప సవాళ్లు భూకైలాస్, శ్రీకృష్ణార్జునయుద్ధం చిత్రాల్లో ఎన్టీఆర్ దేదీప్య మానంగా వెలిగిపోతాడని తెలిసీ, తనకు మామూలుగా ఒప్పని పాత్రలు (నారదుడు, అర్జునుడు) స్వీకరించి మెప్పించడం. నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్ష కుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించు కోవడం (రీఎన్వెంటింగ్). గంభీరమైన కుటుంబ కథా నాయకుడిగా లెక్కకు మించి బోరు కొట్టించే సంఖ్యలో సినిమాలు చేశాక, 1970లలో గ్రామీణ అల్లరి పిల్ల వాడిగా, స్టెప్పులు వేసిన సాహసం ఈ పునః సృజనలో భాగమే. అన్ని కథలూ ఒకేలా తయారవుతున్న తరు ణంలో నవలలను తెరకెక్కించడానికి సంపూర్ణంగా మద్ద తు ఇవ్వడం, ఆ పాత్రలకు తనదైన సృజనను అందిం చడం కూడా ఇటువంటిదే. వయసు పైబడటంతో సిని మాలకు స్వస్తి చెప్పక, మామూలు యాంత్రికమైన తండ్రి పాత్రలతో సరిపెట్టుకోక, సీతారామయ్యగారిగా నటించ డం కూడా ఈ పునః సృజనలో భాగమే. ఆయనతో స్నేహం గొప్ప అనుభూతి- వెండి తెరమీద చూసి ఆనందించిన నటుడితో పరిచయం అవుతుందనీ, గంటలకొద్దీ వారితో మాట్లాడతామని అనుకోము. కానీ అక్కినేనిగారిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించిన సందర్భంగా 1990లో దూరదర్శన్ కోసం ఇంట ర్వ్యూ చేసిన నాటి నుంచి ఆయనతో ఒక అరుదైన స్నేహం ఏర్పడింది. సాహిత్య సభల్లో నా ప్రసంగాలను ఆయన మెచ్చుకున్నపుడు, మా యూనివర్శిటీలో మహాసభలకు ఆయన కోసం నేను ఆంగ్లంలో ఉపన్యాసం రాసి ఇచ్చినపుడూ, తన పేరిట స్థాపించిన జాతీయ పురస్కారం కోసం తొలిసారిగా దేవానంద్ని ఎంపిక చేసి, నన్ను మాస్టర్ ఆఫ్ సెరిమనీస్గా ఉండి, ఆ సభను ఇంగ్లీషులో నిర్వహించమని ఆయన కోరినపుడూ, వరల్డ్ స్పేస్ రేడియో కోసం నాకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చినపుడూ... ఇలా ఎన్నో సంభాషణలూ... అపుడపుడూ ఫోన్లో కూడా. ఒక్క సన్నివేశం బాగా గుర్తు. నేను హడావిడిగా యూని వర్శిటీకి బయల్దేరుతున్నపుడు, నా లాండ్లైన్ మోగింది. నేను తీయగానే ‘ఎవరండీ?’ అన్నా. ‘నాగేశ్వరరావు’ని అన్నారు. ‘ఏ నాగేశ్వరరావండీ?’ అని విసుగ్గా అన్నాను, అప్పటికే బస్సు మిస్సయ్యానన్న చికాకుతో. ‘అక్కినేని నాగేశ్వరరావు అంటారండీ నన్ను’ అన్నారు ఎంతో సౌమ్యంగా. మరో సన్నివేశం- వరల్డ్ స్పేస్లో ఉన్నప్పుడు మా కొత్త స్టూడియోని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే ఒప్పుకున్నారు. కారు పంపుతానని చెప్పాను. ‘మీకు కారున్నట్టుందిగా’ అన్నారు. ‘ఉంది కానీ అది చిన్నది. మారుతీ జెన్. మంచి కారు పంపుతాను’ అని గొణిగాను. ‘‘మీకు బాగున్నది నాకెందుకు బాగుండదూ. పైగా మీతో వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు.’’ అని నా కారులోనే స్టూడియోకు వచ్చారు. అక్కినేనిగారు మా అమ్మాయి పెళ్లికి వచ్చి, రెండు గంటలకుపైగా ఉండి, మామూలు బంధువులా మా వాళ్లందరితోనూ కలిసిపోయి మాట్లాడారు. అన్నపూర్ణమ్మగారు కాలం చేసినపుడు, పరామర్శకు వెళ్లిన సందర్భంలో ఆయన నాతో గంటకుపైగా ఎన్నో విషయాలు మాట్లాడారు. ‘‘చాలా ఇంటర్వ్యూలు ఇచ్చానుగానీ, మీరు చేసిన ఆ పాత ఇంటర్వ్యూ నాకెంతో ఇష్టం’’ అన్నారాయన. ‘ఎందుకో తెలీదుగానీ మిమ్మల్ని నేను చాలా అడ్మయిర్ చేస్తాను’’ అని అన్నారు అక్కినేనిగారు. ఆయన్ని ఈరోజు ఆఖరిసారిగా చూస్తున్నప్పుడు ‘‘మనిషంటే ఇలా తృప్తిగా, పరిపూర్ణ జీవితం గడిపి, ప్రశాంతంగా శాశ్వత నిద్ర చేస్తూ తనలా ఉండమని మనకు స్ఫూర్తినివ్వాలి’’ అనిపించిది. బహుశా అదే మనం ఆయనకు ఇవ్వగలిగిన నివాళి. మృణాళిని, విమర్శకురాలు, సాహిత్యవేత్త