గుంతకల్లుటౌన్: అరాచకాలు, దౌర్జన్యాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచిన టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరామ్, ఆయన సోదరుల నుంచి మన గుంతకల్లును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి పట్టణంలోని నామాల సేట్ ఫంక్షన్ హాలులో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోపా జగదీష్ ఆధ్వర్యంలో పట్టణ వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ రాయలసీమలోనే ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన గుంతకల్లులో అలజడి సృష్టించి అశాంతి నెలకొల్పేందుకు స్థానికేతరుడైన జయరామ్ను టీడీపీ బరిలో దింపిందన్నారు. గుమ్మనూరు దౌర్జన్యాలు, అరాచకాల గురించి అందరికీ తెలిసిందేనన్నారు. మనం పొరపాటున అలాంటి వ్యక్తికి ఓటేస్తే గుంతకల్లు భవిష్యత్తు నాశనమవుతుందని చెప్పారు. సీఎం జగన్, ప్రజలందరి సహకారంతో గుంతకల్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. పట్టణంలో వ్యాపారులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణ శివారులో రూ.వెయ్యి కోట్లతో సోలార్ పవర్ గ్రిడ్ పనులు పూర్తి చేయించి ఐదు వేల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి శంకర్నారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. సమావేశంలో మార్కెట్యార్డు చైర్మన్ ఎస్వీఆర్ మోహన్, మాజీ కౌన్సిలర్లు పోలేపల్లి మధు, గుంతా రమేష్, వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి సంపత్ ఆచారి, నరహరి రమేష్, వ్యాపార సంఘం నేతలు మాణిక్చంద్ కార్వా, ఇంజినీర్ రాము, వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొని ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
వ్యాపారులకు ఎల్లప్పుడూ
అండగా ఉంటా
మరోసారి మీ చల్లని దీవెనలు
అందించండి
ఆత్మీయ సమావేశంలో
ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి