
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా పులుల దాడుల్లో 163 మంది మృతి చెందారు. 2021లో 57 మంది మరణించగా 2022లో 105 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర అటవీ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఏనుగుల దాడుల్లో మూడేళ్లలో 1,581 మంది చనిపోయారు. అత్యధికంగా ఒడిశాలో 322 మంది, జార్ఖండ్లో 291 మంది, పశ్చిమ బెంగాల్లో 240 మంది గజరాజుల క్రోధాగ్నికి బలయ్యారు.
2018 గణాంకాల ప్రకారం దేశంలో పులులు సంఖ్య 2,967 కాగా 2017 అంచనాల ప్రకారం ఏనుగుల సంఖ్య 29,964 అని కేంద్ర అటవీ శాఖ తెలిపింది.
ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షించడంతోపాటు నీటి వనరుల సంరక్షణ, చెట్లు నాటడం, స్థానిక ప్రజలను హెచ్చరించడం లాంటి చర్యలను అటవీశాఖ చేపడుతోంది. ఏనుగుల ఆవాసాలను ‘ఎలిఫెంట్ రిజర్వ్’ ప్రాంతంగా ప్రకటించి జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఏనుగుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది.