
సాక్షి, అమరావతి: దేశంలో టెలికాం రంగ రూపురేఖలను మార్చిన డిజిటల్ విప్లవం ఇప్పుడు రాష్ట్రంలోని గిరిజన గ్రామాలకు చేరింది. రిలయన్స్ జియో తాజాగా రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 1,529 టెలికాం టవర్లను ఏర్పాటు చేసి తన మొబైల్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసింది. దీంతో ఇప్పుడు అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు 4జి నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి.
తన నెట్వర్క్ విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, జి.మాడుగుల, పెదబయలు, జి.కె.వీధి, డుంబ్రిగూడ వంటి మారుమూల గ్రామాలకు ఇప్పుడు హై–స్పీడ్ 4జి సేవలు అందిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు ఈ కరోనా సమయంలో బయటకు వెళ్లకుండా వారి విద్యను కొనసాగించడానికి, ప్రజలు సురక్షితంగా ఉండడానికి సహాయపడుతోంది.