
సోషల్ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారాలను హుందాగా తిప్పి కొట్టాలని..
సాక్షి, తాడేపల్లి: మీడియాను.. దానికి సంబంధించిన వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, అలాంటి వారితో పోరాటంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వైఎస్సార్ సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సోషల్ మీడియా సమావేశంలో కార్యకర్తలకు ఆయన పలు సూచనలు చేశారు.
వైఎస్సార్ సీపీలో వైఎస్ జగన్ తప్ప మిగిలినవారంతా కార్యకర్తలే. పార్టీకి సోషల్ మీడియానే కీలకం ఇప్పుడు. చంద్రబాబు అనే అబధ్దానికి, నిజం అనే వైఎస్ జగన్కు మధ్య జరుగుతున్న పోరాటం ఇది. మీడియా వ్యవస్ధలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. అలాంటి వాళ్లతో పోరాటంలో పార్టీ సోషల్ మీడియా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
టీడీపీ అనేది తుప్పుపట్టిపోయిన పార్టీ. ఇప్పటికే దాని పని అయిపోయింది. అందుకే దాని సోషల్ మీడియా, వాళ్లకు ఉన్న మీడియాల ద్వారా అబద్దాలను ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలి. వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలి అని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగానికి సజ్జల దిశానిర్దేశం చేశారు. అలాగే రాజ్యాంగ వ్యవస్దల పట్ల గౌరవంతో వ్యవహరించాలని, టీడీపీ వాళ్లు రెచ్చగొట్టేవ్యాఖ్యలు చేసినప్పుడు ట్రాప్లో పడొద్దని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: ‘టీడీపీకి అసలు సిసలు అధ్యక్షుడు రామోజీరావు’