
చంద్రగిరిలో కొవ్వొత్తుల ర్యాలీ
గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల తీరుపై ప్రజల ఆగ్రహం.. పలు చోట్ల కొవ్వొత్తులతో ర్యాలీలు
సాక్షి, నెట్వర్క్: తెనాలికి చెందిన గొల్తి గీతాంజలిని అసభ్యకర మెసేజ్లతో వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ, జనసేన పార్టీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలిపై ఈ రెండు పార్టీల సోషల్ మీడియా మూకలు అసభ్య సందేశాలతో దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రజలు చేస్తున్న నిరసనలు గురువారమూ కొనసాగాయి. పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి.
ట్రోలింగ్ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలో న్యాయవాదులు గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ న్యాయస్థానాల సముదాయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్వో వి.శ్రీనివాసరావుకు న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ టీడీపీ చర్యలతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుజాత, ఉషాజ్యోతి, సౌమ్య, జ్యోతి, సి.హెచ్.సాయిరామ్, పిళ్లా రవి, కె.జయరాజు, మన్మధరావు, కె.ప్రభాకర్, నిర్మల్ రాజేష్ , సూర్యనారాయణరెడ్డి, పూర్ణ, భార్గవ్రెడ్డి తదితరులు మాట్లాడారు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద గీతాంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులరి్పంచి, గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గొర్రుపోటు రమాదేవి తదితరుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment