
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కలిసి పనిచేద్దామని నటుడు సోనూసూద్ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. ఐక్యకార్యాచరణ రూపొందించుకుని ప్రజాసేవ చేద్దామన్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రంట్లైన్ వారియర్స్, పలువురు నిపుణులతో ఆయన ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోనూసూద్ పాల్గొనగా తమతో కలిసి పనిచేయాలని ఆయన్ను చంద్రబాబు కోరారు. సోనూసూద్ ఒక ఐకాన్ అని.. ఆయన్ను తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తోందని చెప్పారు.
మూడో వేవ్ కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని.. దీనికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. అలాగే, ఆస్పత్రుల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆరోపించారు. కరోనా బారినపడి నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమవంతు కర్తవ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేశామన్నారు. సోనూసూద్ మాట్లాడుతూ.. తన సతీమణి ఆంధ్రాకు చెందిన వారేనని, ఏపీతో తనకు ఎప్పటినుంచో అవినాభావ సంబంధం ఉందన్నారు. కోవిడ్ సంక్షోభం అందరికీ గుణపాఠమని చెప్పారు. బాధితులకు మానవత్వంతో తనకు చేతనైన సాయం అందించానని తెలిపారు.