అభివృద్ధికి చిరునామా | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి చిరునామా

Published Thu, May 4 2023 4:04 AM

CM YS Jagan Comments At Bhogapuram Airport foundation Event - Sakshi

నాలుగేళ్లుగా మీకు ఇంతగా మంచి చేస్తున్న ప్రభుత్వం ఒకవైపు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఏ మంచీ చేయని పెద్దమనిషి మరో వైపు.. పేదవారి ప్రభుత్వం ఒకవైపు.. పెత్తందారులకు మద్దతు తెలిపే పార్టీ, దానికి మద్దతు ఇచ్చే వారు మరో వైపు.. పేద వారికి ఇంగ్లిష్‌ చదువులు చెప్పించాలని తపనపడే మనం ఒకవైపు.. పేద పిల్లలకు ఇంగ్లిష్‌ చదు­వులు అక్కర్లేదని చెప్పే పెత్తందారులు మరో­వైపు.. పేద వారికి, నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని వివక్ష, లంచాలు లేకుండా నేరుగా బటన్‌ నొక్కే మీ జగన్‌ ఒకవైపు.. వీరికి మంచి జరగకూడదని, ఇంటి పట్టాలు ఇవ్వకూడ­దని ఏకంగా సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని కోర్టుకు వెళ్లి అడ్డుకునే వారందరూ మరో వైపు.. నేను నమ్ముకున్నది ధర్మాన్ని, సత్యాన్ని. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులనే. అదే చంద్రబాబు నమ్ముకున్నది ఆ ఎల్లో పత్రికలను, ఎల్లో టీవీలను. వారి పునాది అబద్ధం, మోసం. 
– సీఎం వైఎస్‌ జగన్‌ 

భోగాపురం నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఉత్తరాంధ్ర ప్రాంతం అభ్యుదయానికే కాదు.. అభివృద్ధికీ చిరు­నామా. శ్రీకాకుళం జిల్లాలో కొద్దిరోజుల క్రితం శంకుస్థాపన చేసిన మూలపేట పోర్టు ఉత్తరాంధ్రకు మ­ణిహారమైతే.. భోగాపురం అంతర్జాతీయ విమా­నా­శ్రయం కిరీటం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి రానున్న 30 నెలల కాలంలో విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కేవలం ఉత్తరాంధ్రకే కా­కుండా రాష్ట్ర వైభవానికీ కేంద్ర బిందువుగా మార­నుందని అభిప్రాయపడ్డారు.

బుధవారం ఆయన రూ.5 వేల కోట్లతో నిర్మించనున్న భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంథి మల్లికార్జున­రావుతో కలిసి విమానాశ్రయ నమూనాను పరిశీలించారు. అనంతరం విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు తాగు నీరు, 30 వేల ఎకరాలకు సాగు నీటితో పాటు భోగాపురం విమానాశ్రయానికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.195 కోట్ల అంచనా వ్యయంతో తారకరామ తీర్థ సాగర్‌ ప్రాజెక్టు పనులకు భూమి పూజ చేశారు.

రూ.26 కోట్లతో ఫిష్‌ హ్యాండ్లింగ్‌ సెంటర్‌కు.. విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి దశలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ విమానాశ్రయానికి విశాఖ నుంచి 6 లేన్ల రహదారికి నాలుగు నెలల్లో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. అదానీ డేటా సెంటర్‌తో విశాఖ టైర్‌–1 సిటీగా అభివృద్ధి చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహుశా దేశంలోనే అతిపెద్ద.. 300 మెగావాట్ల డేటా సెంటర్‌ విశాఖలో ఏర్పాటు కానుండటం గర్వకారణ­మన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఉపాధి కోసం ఇక ఇక్కడికే వలసలు 
► మంచి మనసుతో చేస్తున్న మన కార్యక్రమాలను వరుణ దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఉత్తరాంధ్ర చరిత్రను మార్చాలనే సంకల్పంతో మనసా, వా­చా, కర్మణా అడుగులు ముందుకు వేస్తున్నాం. సంస్కృతికి, సంప్రదాయానికి, కవిత్వానికి, ఉద్యమాలకు కూడా చిరునామా ఈ గడ్డ. కళింగాంధ్ర భావాల విప్లవానికి గజ్జెకట్టిన నేల కూడా ఇదే. అభ్యుదయానికి చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం ఇక మీదట అభివృద్ధికి కూడా చిరునామాగా నిలవనుంది. 

► ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో శంకుస్థాపన చేసిన మూలపేట పోర్టు రాబోయే రోజుల్లో తలరాతలు మార్చే పోర్టు. మరో 24 నెలల్లో ఇక్కడికి షిప్‌లు రానున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సమాన దూరంలో రాబోతున్న ఈ ఎయిర్‌పోర్ట్‌ ఉత్తరాంధ్రకు.. మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా నిలవబోతోందని చెప్పడానికి సంతోషంగా ఉంది. విశాఖలో అదానీ డేటా సెంటర్‌ ద్వారా వచ్చే సబ్‌మెరైన్‌ కేబుల్స్‌తో మన రాష్ట్ర ఐటీ ముఖచిత్రం మారుతుంది. 

► ఈ మూడు బృహత్తర కార్యక్రమాలతో రానున్న రోజుల్లో స్థానికంగా విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఉ­ద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఈ ప్రాంతా­ని­కే వలస వచ్చే పరిస్థితులు రానున్నాయి. టూ­రిజం, మెడికల్‌ టూరిజం, ఐటీ, పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుంది.

2026లో ఎయిర్‌పోర్టును నేనే ప్రారంభిస్తా.. 
► మరో మూడేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయితే 2026 నాటికి ఇక్కడి నుంచి విమానాలు ఎగిరే పరిస్థితి రానుంది. ఈ రోజు ఇక్కడ పునాది రాయి వేశాం. 2026లో మళ్లీ మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడకు వచ్చి.. ఇదే ప్రాంగణం నుంచి ప్రారంభోత్సవం కూడా చేస్తాడని నమ్మకంగా చెబుతున్నా. దేవుని ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో అది జరుగుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఏమీ చేయలేరు.  – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాది రాయి వేస్తున్నామంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ ఎలా మాట్లాడుతున్నారో టీవీల్లో, పేపర్లలో చూశాం. ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే వాళ్ల హయాంలోనే ఈ స్థాయి ఉండి ఉంటే.. అప్పుడే ఈ ప్రాజెక్టు ఎందుకు ముందుకు కదలలేదు?

► సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసుల దగ్గరి నుంచి, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసుల వరకు అనేక కేసులను పరిష్కరించుకుంటూ వచ్చాం. కేంద్రం నుంచి అనేక అనుమతులు తీసుకొచ్చాం. టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి.. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. 

► ఎన్నికలకు 2 – 3 నెలల ముందు వాళ్లు ఇక్కడ టెంకాయ కొట్టి, వెళ్లిపోయారు. మళ్లీ నిస్సిగ్గుగా గతంలోనే మేం శంకుస్థాపన చేశామని చెబుతున్నారు. నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు.  

ట్రాఫిక్‌కు తగ్గట్లుగా డిజైన్‌
► దాదాపుగా రూ.5 వేల కోట్లతో 2026 నాటికి ఏ­కంగా రెండు రన్‌వేలతో ఈ ప్రాజెక్టు టేకాఫ్‌ కానుంది. 7 ఏరో బ్రిడ్జిలతో, ప్యాసింజర్‌ టెర్మి­నల్, కార్గో టెర్మినల్, విమానాల మరమ్మతు యూనిట్, ఏవియేషన్‌ అకాడమీ, ఎనిమల్‌ క్వారంటైన్‌ తదితర సదుపాయాలతో పూర్తవు­తుంది. ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ ఏకంగా 4 కోట్ల జ­నాభాకు కూడా సరిపోయేలా డిజైన్‌ చేశారు. 

► ఈ విమానాశ్రయంతో భారీ విమానం.. ఏ–380 కూడా (డబుల్‌ డెక్కర్‌ ఫ్లైట్‌.. ప్రపంచంలోనే అతి పెద్ద విమానం) సునాయాసంగా ల్యాండ్‌ అయ్యేలా 3.8 కిలోమీటర్ల పొడవైన రెండు రన్‌వేలు నిర్మాణం అవుతున్నాయి. ఎయిర్‌పోర్టు పక్కనే మరో 500 ఎకరాల్లో ఏరోసిటీని కూడా అభివృద్ధి చేయబోతున్నాం.

► ఇదే విమానాశ్రయానికి విశాఖ నుంచి 6 లేన్ల రహదారికి రూ.6,300 కోట్లతో మరో నాలుగు నెలల్లో శంకుస్థాపన చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడాను. పోర్టు, ఎయిర్‌పోర్టులతో.. ఇక్కడే ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు రాబోతున్నాయి. 

24 నెలల్లో పూర్తి చేయాలని కోరాను 
► ఈ రోజు ఎయిర్‌పోర్టు పనులు మొదలు పెట్టేందు­కు జీఎంఆర్‌ గ్రూపు అధినేత గ్రంథి మల్లికార్జునరావు వచ్చారు. ఆయన ఈ ప్రాంతం వాసి. 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రా­జెక్టును, అన్నా.. ఏమైనా ముందుకు జరపవ­చ్చా.. 24 నెలల్లో ఏమైనా చేయగలుగుతారా.. అని అడిగాను. ‘ఇక్కడే పుట్టా. ఇది నాకు కూడా చాలా ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు. శాయశక్తులా కృషి చేసి 30 నెలల్లో పూర్తి చేస్తా’ అని చెప్పారు. 24–30 నెలల్లో ఇక్కడ నుంచి విమానాలు తిరుగుతాయని నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసిన ఫ్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలకు ధన్యవాదాలు.

► ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయ నిర్మా­ణా­నికి భూములిచ్చిన ప్రతీ రైతన్నకు గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన వారిని పునరా­వాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం దాదాపుగా 50 ఎకరాల్లో సుమారు రూ.80 కోట్లతో 2 గేటెడ్‌ కమ్యూనిటీలు నిర్మించాం.

చంద్రబాబు మీకు మొహం చూపించగలరా!
► మేనిఫెస్టో అంటే చంద్రబాబు హయాంలో మాదిరిగా 600 పేజీల బుక్కులు వేసి ఎన్నికలు అయిపోయాక చెత్తబుట్టలో వేసేది కాదు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాము కాబట్టే అలా చేశాం. ఇదే మాదిరిగా చంద్రబాబు అడగగలడా? మీకు మొహం చూపించగలడా? (జనం రెండు చేతులు పైకెత్తి చూపలేరని చెప్పారు) ఇలా అడిగే అర్హత, నైతికత చంద్రబాబుకు ఉందా? 

► 1995లో అధికారం కోసం కూతురిని ఇచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచి.. అధికారంలో ఉన్నన్నాళ్లూ చేసిన మంచి పనులంటూ ఏవీ లేవు. 2019లో సీఎం అయిన మీ బిడ్డ జగన్‌ వల్ల మీకు, మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటని ఏ ఇంటి తలుపుతట్టినా ఇలా.. మంచి చేశాడని చెప్పే పరిస్థితి ఉంది.

► ఏ మంచి చేయని చంద్రబాబుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5.. వీరికి తోడుగా ఒక దత్తపుత్రుడు ఉన్నారు. గతంలో ఇదే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో మొదలుపెట్టి ఒక ఈనాడుకు ఇంత.. ఆంధ్రజ్యోతికి ఇంత... దత్తపుత్రుడికి ఇంత అని.. దాచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అని ఈ గజదొంగల ముఠా రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని దోచేసింది. అందుకే ఏ మంచీ చేయని చంద్రబాబుకు ఇంతగా తోడుగా ఉన్నారు. 

మారుతున్న గ్రామాల రూపురేఖలు 
► ఈ రోజు గ్రామాలు మారాయి. ఏ గ్రామంలో చూసినా సచివాలయంతో పాటు 50 మందికో వలంటీర్‌ కనిపిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో మన పిల్లలే చక్కగా చిరునవ్వుతో లంచాలు తీసుకోకుండా మంచి పనులు చేస్తున్నారు. మరో నాలుగడుగులు వేస్తే నాడు–నేడుతో రూపురేఖలు మారిన ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో ఇంటికే డాక్టర్‌ను తీసుకొచ్చిన విలేజీ క్లినిక్‌.. రైతన్నలను చేయి పట్టుకుని నడిపించే ఆర్‌బీకే కనిపిస్తుంది. అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతో ఇంటి వద్ద నుంచే పనిచేసే డిజిటల్‌ లైబ్రరీల వ్యవస్థ ఏర్పాటు కానుంది. 

► ఈ మార్పు మన కళ్లెదుటే కనిపిస్తోంది. అప్పు­డూ, ఇప్పుడూ ఇదే బడ్జెట్‌.. ఇదే రాష్ట్రం. అప్పు­లు కూడా చంద్రబాబు చేసిన దానికంటే తక్కు­వ. అయినా ఇవన్నీ చేస్తున్నాం. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడని ఆలోచించండి. ఈ విష­యాన్ని గ్రామ స్థాయిలో ప్రతీ ఇంటికీ తీసుకెళ్లండి. మీ బిడ్డకు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని మరోసారి కోరుకుంటున్నా.

► ఈ కార్యక్రమంలో జీఎంఆర్‌ చైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు, అదానీ గ్రూప్‌ ఎండీ, సీఈవోలు రాజేష్‌ అదానీ, కరణ్‌ అదానీ, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, సీదిరి అప్పలరాజు, కలెక్టర్లు మల్లికార్జున, నాగలక్ష్మీ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మేయర్‌ హరివెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. 

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి
► ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మనందరి ప్రభుత్వం వేస్తున్న అడుగులను మీకందరికీ గుర్తు చేస్తున్నా. ఉత్తరాంధ్ర అంటే బ్రిటీషర్లను గడగడలాడించిన మన్యం వీరు­డు అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ. అందుకే కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేశాం. మూడు జి­ల్లా­లుగా ఉన్న ఉత్తరాంధ్రను మరింత మెరుగు పరుస్తూ.. ముగ్గురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లు సరిపోరని.. 6 జిల్లాలుగా చేశాం. 

► కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే తపన, తాపత్రయంతో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ పనులను మొదలుపెట్టి పూర్తి చేశాం. ఈ జూన్‌లో దానిని జాతికి అంకితం చేయబోతున్నాం. ఇచ్చాపురం, పలాస ప్రాంతాలకు తాగునీటిని పైపుల ద్వారా తరలించేందుకు రూ.700 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి ఈ జూన్‌లో పూర్తి చేస్తున్నాం. పాతపట్నం నియోజకవర్గానికి మంచి చేస్తూ.. అదే రోజు అక్కడే మరో రూ. 265 కోట్లతో ఇదే తాగునీటి ప్రాజెక్టును విస్తరించే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నాం. 

► కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ పనులు, పాడేరు ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ పనులు.. పాతపట్నం, నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్‌ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయనగరం మెడికల్‌ కాలేజీని ఈ ఆగస్టు–సెప్టెంబర్‌లో నేనే వచ్చి ప్రారంభిస్తాను. ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ఉత్తరాంధ్రలో 4 మెడికల్‌ కాలేజీలను కడుతున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. సాలూరులో గిరిజన యూనివర్సిటీకి ఈ జూన్‌–జూలైలో శంకుస్థాపన చేయబోతున్నాం. దానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేశాం.

► విజయనగరంలో జేఎన్‌టీయూ గురజాడ యూనివర్సిటీ ఇప్పటికే నెలకొల్పాం. దశా­బ్దాల కల నెరవేరుస్తూ మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం. మరో 24 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితం చేయబో­తున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమా­నా­శ్రయానికి విశాఖనగరం నుంచి అనుసంధానంగా 6 లేన్ల రహదారికి మరో  నాలుగు నెలల్లో శంకుస్థాపన చేయబోతున్నాం.

► వీటన్నింటికి మించి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకే కాకుండా రాజధాని స్థాయికి కూడా తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో అతిపెద్దది, రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖలో మీ బిడ్డ కాపురం ఉండబోతున్నారని చెప్పేందుకు సంతోష పడుతున్నా.

నిజాయితీగా ప్రతి తలుపూ తడుతున్నాం
పేదలకు మంచి జర­గాలని.. పేదలు, మధ్యతరగతికి అండగా నిలవాలని అడు­గులు వేస్తున్నాం. మీ బిడ్డ పాలనలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్న­ది కూడా చూడటం లేదు. కాబట్టే 47 నెల­ల కాలంలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రూ.2.10 లక్షల కోట్లు.. నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి వేశారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. గతానికి, ఇప్పటికి.. చంద్రబాబుకు, మీ జగన్‌కు మధ్య తేడా మీరే చూడండి.

మనందరి ప్రభుత్వంలో మీకు ఇవి అందాయా అంటూ.. రాష్ట్రంలో కోటి 50 లక్షల కుటుంబాలను ప్రేమ­గా, ఆప్యాయంగా అడుగు­తున్నాం. చంద్రబాబు అన్ని ఏళ్ల పాలనలో కన్నా.. మన ప్రభుత్వంలో పథకాలు అందితేనే, మీకు మంచి జరిగిందని భావిస్తేనే నన్ను ఆశీ­ర్వదించండని రైతన్నలు, బడులకు పోయే పిల్లలు, నా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు.. అన్నదమ్ములను నిజాయితీగా, చిత్తశుద్ధితో అడుగుతున్నాం.  

Advertisement
 
Advertisement