
కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో భేటీలో భాగంగా.. గురువారం సాయంత్రం మొదటగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ నిర్వహించారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ‘ కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం. ఇక్కడ భరత్ను గనుక గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి మేలు ఎంతో జరిగింది. భవిష్యత్తులోనూ మరింత జరగుతుంది కూడా.
ఈ వేళ కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నాం. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటాం అని సీఎం జగన్.. కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్.. దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
- కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నాం
- కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని అంతా అనుకుంటారు
- వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం
- బీసీలకు మంచి చేస్తున్నాం అంటే .. అది ప్రతి పనిలోనూ కనిపించాలి
- బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం
- దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారు
- అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్ను తీసుకు వచ్చాం
- చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో నేను ఆస్పత్రికి కూడా వెళ్లాను
- ఆ రోజు భరత్ నాకు పరిచయం అయ్యాడు
- నేను భరత్ను ప్రోత్సహిస్తానని ఆ రోజే చెప్పాను
- ముందుండి ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశాం
- మీరు కూడా భరత్పై అదే ఆప్యాయతను చూపించారు
- దీనివల్ల భరత్ నిలదొక్కుకున్నాడు
- భరత్ను ఇదేస్థానంలో నిలబెడతారా? లేదా ఇదే భరత్ను మళ్లీ పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీమీద ఆధారపడి ఉంది
- భరత్ను గెలుపించుకు రండి..భరత్ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను
- నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతాడు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు
- నిజం చెప్పాలంటే.. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈమూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది
- స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్ల పట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీకూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు
- మన కళ్ల ఎదుటే ఇవి కనిపిస్తున్నాయి
- నాడు – నేడుతో బడులన్నీకూడా రూపురేఖలు మారుతున్నాయి
- ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కూడా అమల్లోకి వస్తుంది
ఇదీ చదవండి: నాడు అసాధ్యమన్నారు.. నేడు సాధ్యమైందిగా!