
సాక్షి, అమరావతి: పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం(మార్చి 17) నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తున్న ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని.. జూన్ 6న పూర్తవుతుంది. అంటే.. మొత్తం 80 రోజుల పాటు ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి.
ఏపీలోనూ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల కోడ్ అమలవుతోంది. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు పూర్తవుతున్నా, జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్న గ్రామ వలంటీర్లు ఎవరైనా కనిపిస్తే ఎన్నికల సంఘానికి వాట్సాప్ చేయాలంటూ ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది.
వలంటీర్ల ఫోటో తీసి వారి పేరు, ఊరు చెప్పాలని తెలిపారు. ఇందులో ఎన్నికల కమిషనర్ పేరుతో ఓ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కు వలంటీర్లపై ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
అయితే వాలంటీర్లపై వైరలవుతున్న ప్రకటన ఫేక్ అని ఎన్నికల సంఘం పేర్కొంది. తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ సీఈవో పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, 9676692888 సీఈఓ వాట్సాప్గా వైరల్ అవుతున్న నెంబర్ ఫేక్ అని స్పష్టం చేసింది. అలాంటి న్యూస్ నమ్మవద్దని తెలిపింది.
అసలు ఆ ట్వీట్లో ఏముందంటే.. ‘రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లు ఎవరైనా మీ కంటపడితే వెంటనే ఫోటో కానీ వీడియో కానీ తీసి, వాలంటరీ పేరు, ఊరు పేరు పేర్కొని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి వాట్సాప్(9676692888) చేయండి’ అని పేర్కొంది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సీరియస్ అయ్యారు. అది ఫేక్ న్యూస్ అని, అటువంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని స్పష్టం చేశారు.
చదవండి: 'భాజా, భజంత్రీల మీడియా'కు ఆపరేటర్గా బాబు!
FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb
— Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024