పోటీ పరీక్షలు.. ప్రమాణాలు పాతాళంలో | engineering and medical and law courses admission cutoff reduced: AP | Sakshi
Sakshi News home page

పోటీ పరీక్షలు.. ప్రమాణాలు పాతాళంలో

Published Sun, Jul 28 2024 5:15 AM | Last Updated on Sun, Jul 28 2024 5:15 AM

engineering and medical and law courses admission cutoff reduced: AP

ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కటాఫ్‌లు తగ్గింపు 

నాణ్యత విషయంలో రాజీపడి అడ్మిషన్లు 

జీరో మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడికల్‌ పీజీలో ప్రవేశం 

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో 40 వేలకు పైన ర్యాంకులకూ సీట్లు 

ప్రొఫెషనల్‌  కోర్సుల్లో ప్రమాణాలు పడిపోతే ప్రతికూల పరిణామాలు

దేశంలో ఇంజనీరింగ్, మెడికల్, లా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కటాఫ్‌ మార్కులు తగ్గించుకుంటూపోతున్నారు. నాణ్యత ప్రమాణాలతో రాజీ పడుతున్నారు. జీరో మార్కులు వచ్చిన వారు కూడా ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో అడ్మిషన్‌ పొందే పరిస్థితి ఉంది. సీట్ల భర్తీ కోసం కటాఫ్‌లు తగ్గించుకుంటూ పోవడం వల్ల ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రమాణాలు పడిపోతాయి. ఇది దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రొఫెషనల్‌ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు  కనీస ప్రమాణాలు పాటించాలని చెబుతున్నారు.. కెరీర్స్‌360 ఫౌండర్‌ చైర్మన్‌ మహేశ్వర్‌ పెరి. ప్రస్తుతం ప్రొఫెషనల్‌ కోర్సుల్లో పడిపోతున్న ప్రమాణాలపై ఆయన అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం..  

దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐబీఈ) కటాఫ్‌ను తగ్గించేందుకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఏఐబీఈ కటాఫ్‌ను తగ్గించడం వల్ల న్యాయ విద్యలో ప్రమాణాలు పడిపోతాయని పేర్కొంది. ‘‘పరీక్ష నిర్వాహకులు.. ఏఐబీఈ జనరల్‌ కేటగిరీ కటాఫ్‌ 45 మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు కటాఫ్‌ 40 మార్కులుగా నిర్ణయించారు.

ఆ మాత్రం కూడా స్కోర్‌ చేయకుంటే లాయరుగా ఎలా రాణించగలరు. మీరు దాన్ని ఇంకా 40, 35కు తగ్గించాలని కోరుతున్నారు.. దయచేసి చదవండి’’ అంటూ ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.  ప్రధాన న్యాయమూర్తి మనందరి తరఫున మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల్లో పడిపోతున్న ప్రమాణాలు, అర్హత మార్కులు, తగ్గుతున్న ఉత్తీర్ణత ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.  

నేషనల్‌ లా యూనివర్సిటీలు
2022 సర్క్యులర్‌లో నేషనల్‌ లా యూనివర్సిటీల కన్సారి్టయం ప్రతి కే టగిరీలో అందుబాటులో ఉన్న సీట్లకు ఐదు రెట్ల మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవాలని నిర్ణయించింది. దీని అర్థమేమిటంటే.. వారు కనీస ప్రమాణాలను కూడా  వదిలేసి ప్రతి సీటుకు ఐదుగురిని పిలవాలని నిర్దేశించారు. ప్రవేశానికి కనీస  మార్కులు నిర్దేశించకపోవడం వల్ల కనీసం నాణ్యత లేని విద్యార్థి కూడా అడ్మిషన్‌ పొందే అవకాశం ఉంటుంది. 2023లో 40 వేల కంటే ఎక్కువ ర్యాంకు వచి్చన విద్యార్థులు సైతం ఎన్‌ఆర్‌ఐ కోటాలో నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశం  పొందే వీలు కలిగింది. 150కు 15–17 మార్కుల(10 శాతం మార్కులు)మధ్య వచి్చన విద్యార్థులు కూడా జాతీయ లా వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ద్వారా అడ్మిషన్‌ పొంది.. ఈ దేశంలో లాయర్‌గా మారే అవకాశం ఏర్పడింది.  

నీట్‌ పీజీ 2023 
2023లో నీట్‌ పీజీకి హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య.. 2,00,517. ఆ ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు 47,526. మొత్తం 800 మార్కులకు పరీక్ష జరిగింది. 2023లో తొలుత కటాఫ్‌ 291 మార్కులు(36 శాతం). ఆ తర్వాత  కౌన్సెలింగ్‌ కొనసాగుతున్న కొద్దీ కటాఫ్‌ను తగ్గించుకుంటూ వచ్చి.. చివరకు జీరోగా నిర్ణయించారు. అంటే.. పరీక్షకు హాజరైతే చాలు.. మెడికల్‌ పీజీలో ప్రవేశం పొందొచ్చన్నమాట! ఇది ఒకరకంగా ప్రవేశ పరీక్షను చంపివేయడంలాంటిదే!! ప్రస్తుతం పలు మెడికల్‌ కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థుల్లో జీరో మార్కులు వచి్చన వారుకూడా ఉండొచ్చు.  

 నీట్‌ యూజీ 
⇒ 2020లో మొత్తం 13,66,945 మంది విద్యార్థులు నీట్‌ యూజీ పరీక్షకు హాజరైతే..  కటాఫ్‌ 147( మొత్తం 720 మార్కులకు(20.4 శాతం)గా నిర్ణయించారు.  ఆ సంవత్సరం మొత్తం మెడికల్‌ సీట్ల సంఖ్య 93,470. కానీ డెంటల్‌ సీట్లు భర్తీ కాకపోవడంతో డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆ ఏడాది కటాఫ్‌ను 113కు తగ్గించింది. దీంతో 15.7 శాతం మార్కులు వచి్చన వారికి కూడా సీటు లభించింది.  

⇒  అదే విధంగా 2021లో మొత్తం 15,44,273 మంది విద్యార్థులు నీట్‌ యూజీ పరీక్ష రాశారు. మొత్తం మెడికల్‌ సీట్లు 99,695 ఉన్నాయి. ఆ ఏడాది కటాఫ్‌ 138(19.2 శాతం). కాని ఆయుష్‌ సీట్లు భర్తీ కాకపోవడంతో ఆయుష్‌ అడ్మిషన్స్‌ సెంట్రల్‌ కౌన్సిలింగ్‌ కమిటీ కటాఫ్‌ను 122కు తగ్గించింది. అంటే 17% మార్కులు సాధించిన విద్యార్థులు కూడా సీటు పొందొచ్చు. ఇలా సీట్లు భర్తీ చేయడం కోసం కటాఫ్‌ తగ్గిస్తూ నాణ్యత విషయంలో రాజీపడుతున్నారు.  

నీట్‌ ఎండీఎస్‌ 2023
ఈ పరీక్షను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌.. ఎండీఎస్‌ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు 960. మొత్తం సీట్లు 6,937. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23,847. దీనికి కూడా సీట్ల భర్తీ కోసం 2021 నుంచి కటాఫ్‌ తగ్గించుకుంటూ వస్తున్నారు.  

నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ
దేశంలో నీట్‌ సూపర్‌ స్పెషాలిటీలో మొత్తం సీట్ల సంఖ్య 4,243. ఈ పరీక్షకు 2023లో వచ్చిన దరఖాస్తులు 19,944. 2023లో మొదటి రౌండ్‌లో కటాఫ్‌ 50 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్లు భర్తీకాలేదు. దీంతో రెండో రౌండ్‌లో కటాఫ్‌ను 20 పర్సంటైల్‌కు తగ్గించారు. అయినా సీట్లు నిండలేదు. ఇక చివరగా స్పెషల్‌ రౌండ్‌లో అర్హతను జీరో పర్సంటైల్‌గా నిర్ణయించారు.

మెడికల్, లాకే పరిమితం కాలేదు..
వాస్తవానికి ఈ అర్హత మార్కులు తగ్గింపు అనేది లా, మెడికల్‌కే పరిమితం కాలేదు. 2018 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఐఐటీల్లో ప్రతి విభాగం, ప్రతి కేటగిరీకి సంబంధించి సీట్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు అందుబాటులో ఉండేలా కటాఫ్‌ను తగ్గించాలని ఆదేశించింది. అంటే.. ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం 10వేల సీట్లకు 20 వేలమంది విద్యార్థులను జోసా కౌన్సెలింగ్‌ పిలుస్తారు. దీనికోసం అడ్మిషన్‌ బోర్డు అర్హత మార్కులను 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఏకంగా 10 శాతం తగ్గించారు. దీంతో తొలుత మెరిట్‌ లిస్ట్‌లో 18,138 మంది మాత్రమే ఉండగా.. కొత్తగా 13,842 మంది విద్యార్థులను అర్హులుగా ప్రకటించారు. ఇలా మొత్తంగా పదివేల సీట్ల కోసం  31,980 మంది విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement