
ఈడుపుగల్లులోని అంబేడ్కర్ గురుకుల విద్యాలయ మూసివేతకు రంగం సిద్ధం
ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్ల జాబితాలో లేని ఈడుపుగల్లు అకాడమీ
సెకండియర్ విద్యార్థినులను గురుకులాల్లోకి తరలించేలా చర్యలు
ప్రైవేటు భవనంలో అకాడమీ నడుస్తుండటమే కారణమంటున్న అధికారులు
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
కంకిపాడు: విద్యారంగాన్ని రాష్ట్రంలోని కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. విద్యార్థుల జీవితాలను నడిరోడ్డుకు లాగుతోంది. ఫలితంగా కోటి ఆశలతో ప్రతిభా పరీక్ష రాసి ఐఐటీ–మెడికల్ అకాడమీలో ప్రవేశం పొందిన విద్యార్థుల భవిష్యత్పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఏడాది ఐఐటీ–మెడికల్ అకాడమీలో ప్రవేశాల జాబితాలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీ పేరు లేకపోవటం అకాడమీకి మంగళం పాడేందుకు రంగం సిద్ధమైందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. దీంతో ప్రస్తుతం మొదటి సంవత్సరం విద్య పూర్తిచేస్తున్న విద్యార్థులు రెండో సంవత్సరం తమ విద్యాభ్యాసం ఎక్కడ? ఎలా? సాగుతుందోనన్న ఆందోళనతోనే వార్షిక పరీక్షలు రాస్తున్న దుస్థితి నెలకొంది.
మూడింటిలో ఒకటి
రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీలు మూడు మాత్రమే ఉన్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు, కర్నూలు జిల్లా చిన్నటేకూరు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడు ప్రాంతాల్లో ఇవి నడుస్తున్నాయి. చిన్నటేకూరు, అడవి తక్కెళ్లపాడు రెండు అకాడమీలు బాలురకు, ఈడుపుగల్లు అకాడమీ ప్రత్యేకించి బాలికలకు ఏర్పాటు చేశారు. 2017లో ఏర్పాటైన ఈ కేంద్రంలో ప్రస్తుతం 500 మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు.
గురుకులం మూసివేతకు రెడీ
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పూర్తిచేసిన ప్రతిభావంతులైన విద్యార్థులకు రెండు దశల్లో పరీక్ష రాసి అర్హత పొందిన వారికే ఈ అకాడమీలో ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ, నీట్తో పాటు ఐక్యరాజ్యసమితి సందర్శనకు వెళ్లిన విద్యార్థులు కూడా ఈ అకాడమీలో విద్యనభ్యసించారు.
పటిష్టమైన భద్రత ఉన్న అకాడమీని మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ద్వారా నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్లో ఈడుపుగల్లు ఐఐటీ–మెడికల్ అకాడమీ ప్రస్తావన లేకపోవటం నిదర్శనం.
విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం
నోటిఫికేషన్ నిలిపివేతతో ఐఐటీ–మెడికల్ అకాడమీ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. దీంతో ఈ ఏడాది మొదటి సంవత్సరం ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం చదువులు ఎలా, ఎక్కడన్న ఆందోళనలో మునిగిపోయారు. చదువుల దిగులుతోనే మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలను విద్యార్థులు రాస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమి సర్కారు, సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈడుపుగల్లు అకాడమీ నిర్వహిస్తున్న భవనం ప్రైవేటు వ్యక్తులది కావటంతో అక్కడి నుంచి అకాడమీ తీసివేయాలనే ఆలోచనతో అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయలేదని చెబుతున్నారు. మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులను ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కల గురుకులం, అలాగే విద్యార్థుల సొంత జిల్లాల్లో గురుకులాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చర్యతో ఐఐటీ–మెడికల్ అకాడమీతో మెరుగైన విద్య అందుతుందని ఆశించి ప్రతిభా పరీక్షల్లో సత్తా చాటి అకాడమీలో ప్రవేశం పొందిన విద్యార్థులు సాధారణ ఇంటర్ విద్యను అభ్యసించటం ద్వారా తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనికితోడు విద్యార్థుల సామర్థ్యాలు కూడా తక్కువగా ఉన్నాయని, విద్యాప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతుండటం గమనార్హం.
న్యాయ పోరాటానికి సిద్ధం
ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొనసాగిస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య, భవిష్యత్ భద్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అధికారులు తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. అకాడమీని కొనసాగించేలా విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయపోరాటానికి సన్నద్ధంఅవుతున్నారు.
విద్యార్థులకు నష్టం జరగనివ్వం
విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగనివ్వం. ప్రస్తుతం అకాడమీ ఉన్న భవనం ప్రైవేటుది. 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులను అకాడమీలో చేర్చుకున్నాం. ఇక్కడ ఉన్న పిల్లలను కుంటముక్కలకు తరలిస్తాం. వచ్చే ఏడాది 10 వరకూ ఐఐటీ–మెడికల్ అకాడమీలు రాబోతున్నాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. మెరుగైన విద్య అందుతుంది. – ఎ.మురళీకృష్ణ, జిల్లా కోఆర్డినేటర్, ఉమ్మడి కృష్ణాజిల్లా
Comments
Please login to add a commentAdd a comment