ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు షాక్‌ | Government Shock For RTC Employees, Decided Not To Give Night Duty Allowances Together With Pay Bills | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు షాక్‌

Published Fri, Aug 30 2024 4:10 AM | Last Updated on Fri, Aug 30 2024 9:38 AM

Government shock for RTC employees

జీతాలతో అలవెన్స్‌లు కలపకూడదని ఆదేశాలు

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగు­లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. నైట్‌ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను జీతాల బిల్లులతో కలిపి ఇవ్వకూడదని నిర్ణయించింది. దాంతో రాష్ట్రంలోని దాదాపు 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రయో­జనాలు దెబ్బతిననున్నాయి. తమకు జీతాలతో­పాటే నైట్‌ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర అలవెన్స్‌లు చెల్లించా­లని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నిధుల కొరత లేదా ఇతర కారణాలతో అలవెన్స్‌లు ఏళ్ల తరబడి చెల్లించేవారు కాదు. 

ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఆర్టీసీని ప్రభు­త్వ­ంలో విలీనం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ అంశంపై కూడా సాను­కూలంగా స్పందించింది. అల­వె­న్స్‌లను కూడా గ్రేడ్‌–1 ఉద్యోగులకు రూ.600 నుంచి రూ.800కు, గ్రేడ్‌–2 ఉద్యోగులకు రూ.400 నుంచి రూ.600కు, గ్రేడ్‌–3 ఉద్యోగులకు రూ.300 నుంచి రూ.400కు పెంచింది. ఆ అలవెన్స్‌­లను జీతాల బిల్లులతో­పా­టే ఆమోదించి ప్రతి నెలా జీతాల­తోపాటే చెల్లించాలని నిర్ణ­యించింది. దాంతో ఈ ఏడాది ఫిబ్ర­వరి నుంచి డ్రైవర్లు, కండక్టర్లకు జీతాల­తో­­పాటు అలవెన్స్‌లను కూడా చెల్లిస్తూ వచ్చారు. 

కాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది. ఆగస్టు నెల జీతాల బిల్లులతో నైట్‌డ్యూటీ అల­వె­న్స్‌­లు, టీఏలు, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌­లను కలపవద్దని విజయ­వాడ­లోని ఆర్టీసీ ప్రధాన కార్యా­ల­యం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు షాక్‌కు గురయ్యారు. గతంలో టీడీపీ ప్రభు­త్వంలో తమకు అల­వెన్స్‌లు ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉండే విష­యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తు­తం అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఆందోళన చెందుతు­న్నారు. 

నేడు నిరసన
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని డిపోల్లో ఉద్యోగులు ఈ నెల 30న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించాం. నిరసన ప్రద­ర్శన నిర్వహిస్తాం. రిటై­రైన ఉద్యోగులకు సకాలంలో సెటి­ల్‌మెంట్‌ చేయకుండా ట్రెజరీ శాఖ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఈ అంశంపై కూడా నిరసన తెలుపుతాం.  – పీవీ రమణారెడ్డి, అధ్యక్షుడు, – వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement