
కాన్సెప్ట్ సిటీలతో పెట్టుబడి అవకాశాలు: సీఐఐ
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలోనూ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పారిశ్రామిక అభివృద్ధికి పలు చర్యలు తీసుకోవడంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీస్ (సీఐఐ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రం భారీ పెట్టబడులతోపాటు ఉపాధి అవకాశాలను పొందే అవకాశముందని సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ డి.తిరుపతిరాజు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్రం 6,234.64 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశానికి షోకేస్గా నిలబడిందని, కాన్సెప్ట్ సిటీల నిర్మాణంతో భారీగా ప్రైవేటు పెట్టుబడులను
ఆకర్షించవచ్చని చెప్పారు. హెల్త్కేర్, వ్యవసాయంలో యాంత్రీకరణలను ప్రోత్సహించడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
విపత్తులోనూ వృద్ధి నమోదు చేసే బడ్జెట్: ఫ్యాప్సీ
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలోనూ సుస్థిరాభివృద్ధి చేసే బడ్జెట్గా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) శ్లాఘించింది. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు రూ.3,673.34 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రం కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఫ్యాప్సీ అధ్యక్షుడు సీవీ అచ్యుతరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో వైద్యరంగానికి రూ.13,830 కోట్లు కేటాయించడం, ముఖ్యంగా కోవిడ్ కట్టడికి రూ.1,000 కోట్లు ఖర్చు చేయడం ఆహ్వానించదగ్గ నిర్ణయమని ప్రశంసించారు. వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన రాష్ట్రంలో ఈ రంగానికి రూ.31,256 కోట్లు కేటాయించడం ద్వారా అన్ని వర్గాలు ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు.
చదవండి: పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,673.34 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment