
సీఎం వైఎస్ జగన్ను కలిసిన డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి, డాక్టర్ ప్రసాద్ జి. రెడ్డి
సాక్షి, అమరావతి: ప్రైమ్ హెల్త్కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్రెడ్డి మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ప్రైమ్ హెల్త్కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తూ, అక్కడ టాప్ టెన్ వైద్య వ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సీఎంతో సమావేశానంతరం డాక్టర్ ప్రేమ్సాగర్రెడ్డి మాట్లాడుతూ ‘సీఎం జగన్తో సమావేశం మంచి సుహృద్భావ వాతావరణంలో జరిగింది.
దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు మంచి స్నేహితుడు.. అలాగే నా సహాధ్యాయి. మేం వివిధ అంశాలపై చర్చించాం. అందులో ప్రధానంగా ఏపీలో ఆరోగ్యరంగంపై చర్చ జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఏపీలో 98 శాతం డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకం జరగడం గొప్ప విషయం. ఏపీకి డిజిటల్ ఎక్స్రే మిషన్లు, అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
కోవిడ్ సమయంలో కూడా అతితక్కువ వ్యవధిలో 1,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చాను. పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో చాలా చక్కగా సీఎం అభివృద్ధి చేస్తున్నారు. ఈ రాష్ట్రం కోసం అనేక గొప్ప పనులు చేస్తున్నారు. తన తండ్రిలా చక్కటి పాలన అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారు, ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వంలో నేను భాగస్వామిని కావడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’. అని అన్నారు.
ఈ సమావేశంలో డాక్టర్ ప్రసాద్ జి.రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి, మెడికల్ అడ్వైజర్ ఎన్నారై ఎఫైర్స్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి, ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, పలువురు సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment