ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం | Sakshi
Sakshi News home page

 ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం

Published Thu, Feb 29 2024 5:13 AM

The state is a hub for spiritual tourism - Sakshi

రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట

20 ప్రముఖ, చారిత్రక ఆలయాల అనుసంధానం

తొలిదశలో 18 సర్క్యూట్లలో స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీలు

దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహణ

నేడు లాంఛనంగా ప్రారంభం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది.

స్పెషల్‌ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం
పిల్‌గ్రిమ్‌ పాత్‌వేస్‌కు చెందిన ‘బుక్‌ మై దర్శన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్‌ ఏజెన్సీ అయిన బుక్‌ మై దర్శన్‌ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్‌ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్‌ సర్వీసుల)ను కల్పిస్తోంది. 

ఏపీటీడీసీ బస్సులతో పాటు..
ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్‌ సేవలను ‘బుక్‌ మై దర్శన్‌’ అందించేలా అగ్రిమెంట్‌ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు.

ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్‌ ఎండ్‌ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్‌ఎఫ్‌ఐబీ ట్యాగ్‌లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. 

ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు)
♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్‌ (రూ.970/రూ.780)
♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570)
♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250)
♦ విశాఖపట్నం సిటీ టూర్‌ (రూ.940/రూ.750)
♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060)
♦  విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320)
♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180)
♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250)
♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180)
♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290)
♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470)

2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా
♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220)
♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560)
♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220)
♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740)
♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460)
♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570)
♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) 

Advertisement
Advertisement