
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: సంకల్ప సిద్ధి కేసుతో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ముడిపెట్టి టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని హైకోర్టు న్యాయవాదులు తాడికొండ చిరంజీవి, బర్రె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుపై త్వరగా విచారణ జరిపి దోషులను అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డీజీపీకి ఇటీవల వినతిపత్రం ఇచ్చారన్నారు.
కేవలం రాజకీయ కక్షతోనే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఐడీ చీఫ్ సునీల్, పోలీస్ కమిషనర్ టీకే రాణా పేర్లను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. సీఐడీ విచారణను చెంచా విచారణ అని సంబోధించడం పట్టాభి అహంకారానికి పరాకాష్ట అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వల్లభనేని వంశీ గతంలోనే ప్రకటించినట్టు గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేస్తున్న పట్టాభికి లిఖిత పూర్వకంగా నోటీసులు ఇచ్చామన్నారు. పట్టాభిపై కేసు నమోదు చేసి రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
(చదవండి: ఏకలవ్య జాతీయ క్రీడల ఏర్పాట్లపై రాజీ పడొద్దు )
Comments
Please login to add a commentAdd a comment