![Vijayasai Reddy Said Industrialists Should Work To Reduce Pollution - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/2/sai.jpg.webp?itok=w2FNTewY)
సాక్షి, విశాఖపట్నం: కాలుష్యం తగ్గించేందుకు పారిశ్రామిక వేత్తలు కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. గాంధీ జయంతి పురస్కరించుకుని విశాఖ స్వచ్ఛ మహోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ మహోత్సవ్-2020 అవార్డ్ గ్రహీతలకు ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షన్- 2021 కరపత్రాలు, సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. 2014లో రాజ్ ఘాట్ లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారని, ప్రజలంతా స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. ఎయిర్ సీడింగ్ ద్వారా కొండల్లో పచ్చదనం పెంపుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పొల్యూషన్ ఫ్రీ సిటీ గా విశాఖ ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి పథకంలోను మహిళలకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
సుందర నగరం విశాఖ:ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే విశాఖపట్నం సుందర నగరమని పేర్కొన్నారు. విశాఖలో మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు హెలికాప్టర్స్ లో సీడ్ బాల్స్ ను కొండల్లో వదలడం ద్వారా మరింతగా పచ్చదనం పెంచవచ్చన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతోందని, మరింతగా అభివృద్ధి జరుగుతుందని ఎంపీ సత్యనారాయణ తెలిపారు.
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు: ఎంపీ సత్యవతి
అనకాపల్లి ఎంపీ కె.సత్యవతి మాట్లాడుతూ ఏపీకి వలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపారు.ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వలంటీర్లకు ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
మరింత అభివృద్ధి చెందుతుంది: ఎమ్మెల్యే వాసుపల్లి
ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 25 లక్షలు మొక్కలు నాటాలి అని సీఎం లక్ష్యం గా పెట్టుకున్నారని పేర్కొన్నారు.
23 శాతం నుంచి 33 శాతం అటవీ ప్రాంతం పెంపునకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణకు..
విశాఖ కమిషనర్ సృజన మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు, పర్యావరణ పరిరక్షణకు లక్ష విత్తన బంతులను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చెత్త నుంచి సంపదను సృష్టించుకుంటున్నామని, 50 వేల మందికి చెత్త బుట్టలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు నేడు సాయంత్రం 7 గంటలకు వలంటీర్లు, కార్యదర్శులను చప్పట్లతో అభినందించాలని ఆమె కోరారు. మంచి కోసం జరిగే మార్పులో వీరి పాత్ర చాలా కీలకమైందని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment