
ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదవాలన్నది సీఎం జగన్ ఆశయమని.. అలాగే పార్టీ
సాక్షి, వైఎస్సార్: ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదవాలన్నది సీఎం జగన్ ఆశయమని, రాష్ట్రంలో నిరుద్యోగి ఉండకూడదన్నది వైఎస్సార్సీపీ లక్ష్యమని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరు సీబీఐటీలో శనివారం ఉదయం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
విద్య ప్రతి ఒక్కరి అవసరం. ఉద్యోగాల కోసం ప్రతీ ఒక్కరూ పోటీ పడుతున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగం పొందితేనే కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారాయన. అలాగే.. ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొవాలని, ఇప్పుడు రానంత మాత్రాన మళ్లీ అవకాశం ఉంటుందని, బాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని విజయసాయిరెడ్డి యువతకు భరోసా ఇచ్చారు.
జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు పాల్గొనగా.. ఉద్యోగాల కోసం 13 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో.. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఆధర్వ్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు అపూర్వ స్పందన లభిస్తోందని డిప్యూటీ సీఎం అమ్జాద్ బాషా పేర్కొనగా.. జగన్ ఆశయ సాధనకు అనుగుణంగా జాబ్ మేళా నిర్వహిస్తామని, నిరుద్యోగిరహిత లక్ష్య సాధన కోసం పార్టీ కృషి చేస్తుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు.