బాలికావిద్యకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

బాలికావిద్యకు ప్రోత్సాహం

Published Sat, Apr 12 2025 2:34 AM | Last Updated on Sat, Apr 12 2025 2:34 AM

బాలిక

బాలికావిద్యకు ప్రోత్సాహం

బల్లికురవ: ప్రభుత్వం బాలికావిద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ప్రతి ఒక్కరూ చదువుకుని విద్యావంతులు కావాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. శుక్రవారం బల్లికురవలోని కెజీబీవి సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు కేజీబీవికి రూ.3.23 కోట్లతో 12 వసతి గదులు మంజూరుకాగా భూమిపూజతో శిలాఫలకాలు ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెజీబీవీలో వసతి గదుల నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం కేటాయించిందని 6 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బల్లికురవలో జరిగిన ప్రజాఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో మంత్రి అర్జీలు స్వీకరించారు. వ్యవసాయశాఖ ద్వారా సబ్సిడీపై యంత్ర పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

నిజాంపట్నం: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు 61 రోజులపాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధించినట్లు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సాయిసందీప్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సముద్రంలో వివిధ చేపలు, రొయ్యల జాతుల సంతాన ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ప్రతి ఏటా 61 రోజులపాటు వేట నిషేధం అమల్లోకి తెస్తుందన్నారు. ఈ సమయంలో రొయ్య, చేప జాతులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తికి దోహదపడే సమయమన్నారు. వేట నిషేధ సమయంలో మండలంలోని మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని తెలియజేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి వేటకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రయాణికులకు మెరుగైన

సేవలందించడమే లక్ష్యం

ఆర్టీసీ ఈడీ చెంగల్‌రెడ్డి

అద్దంకి రూరల్‌: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆర్టీసీ ఈడీ చెంగల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోను సందర్శించారు. డిపో ఆవరణను పరిశీలించారు. గ్యారేజ్‌లోని కార్మికులతో మాట్లాడారు. బస్సులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కండక్టర్‌లు, డ్రైవర్లు విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎం, సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడలో జరగనున్న ఏపీ స్టేట్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలకు ఎన్టీఆర్‌ స్టేడియం క్రీడాకారులు వీఎస్‌ఎస్‌ లలిత్‌, ఎస్‌.చరణ్‌ కుమార్‌, వి.హర్షిణి ఎంపికయ్యారని టెన్నిస్‌ కోచ్‌ జీవీఎస్‌ ప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర పోటీల్లోనూ పతకాలు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మిర్చి యార్డుకు

వరుస సెలవులు

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాలు యార్డుకు సాధారణ సెలవులు, సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంత్యుత్సవం పురస్కరించుకుని మిర్చి యార్డుకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్టు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావద్దని కోరారు. సోమవారం అర్ధరాత్రి నుంచి రైతుల సరుకును యార్డులోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. మంగళవారం యథావిధిగా యార్డులో క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఆమె వివరించారు.

బాలికావిద్యకు ప్రోత్సాహం 
1
1/1

బాలికావిద్యకు ప్రోత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement