
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్ బిజినెస్లలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ముంబై ఎయిర్పోర్ట్స్ సీఈవో ఆర్కే జైన్ను ఎయిర్పోర్ట్స్ సీఈవోగా ఎంపిక చేసింది. నాన్ఏరో బిజినెస్ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్(ఏఏహెచ్ఎల్)కు బెన్ జండీని సీఈవోగా నియమించింది. గత వారం ముంబై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్) మేనేజ్మెంట్ను అదానీ ఎంటర్ప్రైజెస్కు అనుబంధ సంస్థ అయిన ఏఏహెచ్ఎల్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఏఏహెచ్ఎల్ ప్రెసిడెంట్ ప్రకాష్ తుల్సియానీ ఎంఐఏఎల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతేకాకుండా ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అహ్మదాబాద్ నుంచి ముంబైకు మారుస్తోంది. త్వరలో ప్రారంభంకానున్న నవీ ముంబై ఎయిర్పోర్టులో ఎంఐఏఎల్కు 74 శాతం వాటా ఉంది. గతేడాది ఆగస్ట్లో జీవీకే గ్రూప్నకు ముంబై ఎయిర్పోర్ట్లో గల వాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అదానీ గ్రూప్ 74 శాతం వాటాను సొంతం చేసుకుంది.