స్టాండర్డ్‌ గ్లాస్‌లో అసాహీ పెట్టుబడి | Sakshi
Sakshi News home page

స్టాండర్డ్‌ గ్లాస్‌లో అసాహీ పెట్టుబడి

Published Fri, Nov 17 2023 7:23 AM

Agi Japan To Invest Up To Rs 200 Crore In Hyderabad Based Standard Glass - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్లాస్‌ లైన్డ్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీలో ఇంజనీర్డ్‌ గ్లాస్‌ సిస్టమ్స్‌ రంగంలో ఉన్న జపాన్‌ దిగ్గజం అసాహీ గ్లాస్‌ప్లాంట్‌ (ఏజీఐ జపాన్‌) రూ.200 కోట్లు పెట్టుబడి చేసింది. తద్వారా ఏజీఐ జపాన్, జీఎల్‌ హాకో, అనుబంధ కంపెనీలకు స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీలో మైనారిటీ వాటా దక్కనుంది. జపనీస్‌ విపణిలోకి తమ కంపెనీ ప్రవేశాన్ని ఏజీఐ జపాన్‌ సులభతరం చేస్తుందని స్టాండర్డ్‌ గ్రూప్‌ ఎండీ నాగేశ్వర రావు కందుల తెలిపారు.

ఏజీఐతోపాటు ఆ సంస్థకు చెందిన కస్టమర్లు ఆశించే స్థాయిలో కఠిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ప్రైవేట్‌ లేబుల్‌ ఏర్పాట్లు, సహ–బ్రాండింగ్, విడిభాగాల సరఫరాను ఈ భాగస్వామ్యంలో భాగంగా అమలు చేస్తారు. జీఎల్‌ హాకో ఉత్పత్తుల ఉనికిని విస్తృతం చేయడంతోపాటు గ్లాస్‌–లైన్డ్‌ రియాక్టర్‌ల భద్రతను పెంపొందిస్తూ ఎస్‌ఈఎఫ్‌ గ్లాస్‌ టెక్నాలజీని రూపొందించాలని స్టాండర్డ్‌ గ్రూప్‌ నిర్ణయించింది.   

భారీ ప్లాంటు ఏర్పాటు.. 
ఏజీఐ జపాన్‌ సీఈవో యసుయుకి ఇకేడ 2023 మార్చి నుంచి స్టాండర్డ్‌ గ్లాస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయంగా తమ సంస్థ విస్తరణకు ఇకేడ దోహదం చేస్తున్నారని నాగేశ్వర రావు తెలిపారు. ఈ పెట్టుబడి వ్యాపార అవకాశమేగాక అసాధారణ వ్యాపార భాగస్వామ్యం పెంపొందించి, వాటాదారులకు గణనీయంగా రాబడిని అందిస్తుందన్నారు.

స్టాండర్డ్‌ గ్లాస్‌ హైదరాబాద్‌ సమీపంలో 36 ఎకరాల్లో భారీ స్థాయిలో గ్లాస్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. వెల్డింగ్‌ రోబోలు, సెమీ ఆటోమేటెడ్‌ కట్టింగ్, బెండింగ్, వెల్డింగ్‌ మెషినరీ, అధునాతన వెల్డింగ్‌ పవర్‌ సోర్సెస్‌తో సహా అత్యాధునిక మెషినరీని ఏర్పాటు చేస్తున్నారు. ఉత్పత్తి నాణ్యతను పెంచడం, తక్కువ సమయంలో తయారీ లక్ష్యంగా సాంకేతికతను జోడిస్తున్నారు. 2012లో ప్రారంభమైన స్టాండర్డ్‌ గ్రూప్‌ టర్నోవర్‌ రూ.750 కోట్లు.    

Advertisement
 
Advertisement