
షెంజెన్: ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ హువాయ్ విప్లవాత్మక ప్రకటన చేసింది. వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఆపకుండా.. డ్రైవర్ లెస్ కార్ల టెక్నాలజీకి శరవేగంగా పావులు కదుపుతోంది. 2025 నాటికల్లా డ్రైవర్లెస్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది.
కాగా, చైనీస్ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం హువాయ్ టెక్నాలజీస్ ఆటోమోటివ్ స్పేస్లో అడుగుపెట్టబోతున్నట్లు కొంతకాలంగా మీడియాకు హింట్ అందుతూనే వస్తోంది. అయితే ఏకంగా డ్రైవర్లెస్ కార్లను తయారు చేస్తామనే ప్రకటనతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చోంగ్క్వింగ్ ఛాంగన్ ఆటోమొబైల్ కో లిమిటెడ్తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ఎలక్ట్రానిక్ వెహికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రెండు కంపెనీలతో హువాయ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీగా పేరున్న హువాయ్.. స్మార్ట్ఫోన్ల అమ్మకం ద్వారా హవా చాటేది. అయితే ట్రంప్ హయాంలో ఆంక్షలు, ప్రత్యేకించి హువాయ్తో అమెరికా వర్తకానికి పెనుముప్పు ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో హువాయ్ దూకుడు మొదలుపెట్టింది. ఇక హువాయ్తో పాటు జియోమి, ఒప్పో కూడా వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు యాపిల్ కూడా ఈ రంగం తీరుతెన్నులపై ఒక అంచనాకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: స్మార్ట్ వాచ్.. 54 శాతం భారీ తగ్గింపు